Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-అండర్-17, అండర్-20 మహిళల ప్రపంచకప్లు వాయిదా
-అండర్-17 వరల్డ్కప్కు భారత్ ఆతిథ్యం
-పరిస్థితులు సద్దుమణిగితే నూతన షెడ్యూల్ విడుదల
న్యూఢిల్లీ : కరోనా వైరస్ (కోవిడ్-19) మహమ్మారి ఫిఫా వరల్డ్కప్లపైనా పడింది. ఈ ఏడాది నవంబర్లో జరగాల్సిన అమ్మాయిల అండర్-17 వరల్డ్కప్ అనూహ్యంగా వాయిదా పడింది. రానున్న 2-3 నెలల్లో అంతర్జాతీయంగా పరిస్థితులు అదుపులోకి వస్తాయనే అంచనాలు నెలకొన్నాయి. దీంతో నవంబర్లో జరగాల్సిన అండర్-17 వరల్డ్కప్కు ఎటువంటి ప్రమాదం లేదనే దీమాతో ఆతిథ్య దేశం భారత్ కనిపించింది. శనివారం సమావేశం అయిన ఫిఫా ఎగ్జిక్యూటివ్ కమిటీ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. భారత్లో జరగాల్సిన అండర్-17 వరల్డ్కప్తో పాటు ఆగస్టులో నిర్వహించాల్సిన అండర్-20 వరల్డ్కప్ను సైతం వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది. ఫిఫా ఎగ్జిక్యూటివ్ కమిటీ కాన్ఫరెన్స్ కాల్లో తొలిసారి సమావేశమైంది.
ఆగస్టు/సెప్టెంబర్లో ఫిఫా అండర్-20 మహిళల వరల్డ్కప్కు పనామా/కోస్టారికా ఆతిథ్యం ఇవ్వాల్సి ఉంది. నవంబర్లో అండర్-17 వరల్డ్కప్కు భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. వాస్తవానికి ఈ రెండు టోర్నీలు షెడ్యూల్ ప్రకారం నిర్వహించే వెసులుబాటు ఉంది. కానీ కరోనా వైరస్ కారణంగా అర్హత మ్యాచులు ఎక్కడికక్కడే వాయిదా పడ్డాయి. తప్పని పరిస్థితుల్లో ఏజ్ గ్రూప్ వరల్డ్కప్లను ఫిఫా వాయిదా వేసింది. నూతన షెడ్యూల్ను పరిస్థితులు సద్దుమణిగిన తర్వాత విడుదల చేస్తామని పేర్కొంది. లూథియానలో నిర్వహించాల్సిన ఫిఫా ఫుట్సల్ (ఇండోర్ గేమ్, ఒక్కో జట్టులో ఐదుగురు ఆటగాళ్లు) వరల్డ్కప్పై నిర్ణయాన్ని ఏప్రిల్ ఆఖర్లో వెల్లడించే అవకాశం ఉంది. ఈ వరల్డ్కప్ సెప్టెంబర్లో జరగాల్సి ఉంది. దీంతో పాటు 2020 జూన్ వరకు జరగాల్సిన అన్ని ఫిఫా మెన్స్, ఉమెన్స్ మ్యాచులను వాయిదా వేసింది. 2022 ఫిఫా వరల్డ్కప్ క్వాలిఫయర్స్పై సంబంధింత దేశాలతో ద్వైపాక్షిక చర్చలకు పచ్చజెండా ఊపింది. ఆరోగ్యకర పరిస్థితుల్లో రీ షెడ్యూల్ చేయాలని ఆదేశించింది. అండర్-17 బార్సు ఫిఫా వరల్డ్కప్ను ఘనంగా నిర్వహించి, వీక్షకుల పరంగా ఆల్టైమ్ రికార్డు సృష్టించిన భారత్, అండర్-17 బాలికల వరల్డ్కప్ నిర్వహణతో మరోసారి భారత్లో ఫుట్బాల్కు పాపులారిటీ తీసుకురావాలని భావించింది. అండర్-17 వరల్డ్కప్ తర్వాత భారత్లో ఫుట్బాల్కు ఆదరణ పెరిగిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) వీక్షకుల్లో 50 శాతం పెరుగుదల ఆ విషయాన్ని బలపరుస్తోంది.