Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-భారత్ విజయంపై వకార్ యూనిస్
కరాచీ : 2018లో ఆస్ట్రేలియా గడ్డపై భారత్ బోర్డర్ గవాస్కర్ టెస్టు సిరీస్ను గెల్చుకుంది. 71 ఏండ్ల సుదీర్ఘ విరామానికి ముగింపు పలుకుతూ ఆస్ట్రేలియాలో తొలి టెస్టు సిరీస్ విజయాన్ని అందుకుంది. భారత టెస్టు క్రికెట్లో ఇదో మైలురాయి!. కోహ్లిసేన విజయానికి స్టీవ్ స్మిత్, డెవిడ్ వార్నర్ గైర్హాజరీ సైతం కారణమని పాకిస్థాన్ బౌలింగ్ కోచ్ వకార్ యూనిస్ అన్నారు. ' భారత్ సాధించిన ఘనతను తక్కువ చేసే ప్రయత్నం కాదు. కోహ్లిసేన మెరుగైన జట్టు, ఆసీస్లో బాగా ఆడింది. అదే సమయంలో ఆస్ట్రేలియా డ్రెస్సింగ్రూమ్లో అనిశ్చితి నెలకొంది. బాల్ టాంపరింగ్ వివాదంతో ఆసీస్ క్రికెట్ సంక్షోభంలో పడింది. ఆస్ట్రేలియా స్టీవ్ స్మిత్, డెవిడ్ వార్నర్లను కోల్పోయింది' అని వకార్ అన్నారు. 1994 నుంచి ఆసీస్లో పాకిస్థాన్ కనీసం ఓ టెస్టు మ్యాచ్ను నెగ్గలేదు. అయితే దీనికి కారణాలు తనకు పెద్దగా తెలియవని వకార్ వ్యాఖ్యానించారు. ' ఇన్నేండ్లుగా ఆసీస్లో పాక్ టెస్టు విజయం సాధించలేదు. అందుకు కారణం నాకు తెలియదు. ఆసీస్లో బ్యాట్స్మెన్ మెరుగ్గా రాణించినప్పుడు, బౌలర్లు విఫలమయ్యారు. బౌలింగ్ విభాగం గొప్ప ప్రదర్శన చేసినప్పుడు, బ్యాట్స్మెన్ సహకారం కొరవడింది' అని పాక్ వైఫల్యంపై వకార్ అభిప్రాయపడ్డారు. కోవిడ్-19 మహమ్మారి కారణంగా ఖాళీ స్టేడియాల్లో క్రికెట్ మ్యాచుల నిర్వహణకు ఏమాత్రం అనుకూలం కాదని వకార్ స్పష్టం చేశారు. కాస్త ఆలస్యమైనా అభిమానులతోనే ఆట ఆరంభం కావాలని అన్నారు.