Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-కేంద్ర ప్రభుత్వానికి మాజీ ఆటగాళ్ల వినతి
న్యూఢిల్లీ : ఆటగాడిగా, నాయకుడిగా హ్యాట్రిక్ ఒలింపిక్ స్వర్ణాలు. మేనేజర్గా తొలి ప్రపంచకప్ విజయం బల్బీర్సింగ్ హాకీ మ్యాజిక్ను కొలించేందుకు సరిపోవు!. ఫీల్డ్ హాకీలో బ్రిటీష్ ఇండియాను ధ్యాన్చంద్ నడిపించగా, స్వతంత్ర భారత్ను బల్బీర్ సింగ్ నిలబెట్టాడు. భారత హాకీ పితామహుడు ధ్యాన్చంద్కు అత్యున్నత పురస్కారం భారతరత్న దక్కలేదు. కానీ ఇతర ఇతర గౌరవాలు మాత్రం లభించాయి. బల్బీర్సింగ్కు ఆ మాత్రం గౌరవం అయినా దక్కలేదు. నాల్గో ఉన్నత పౌర పురస్కారం పద్మ శ్రీతో సరిపెట్టుకోవాల్సి ఉంది. భారత హాకీ స్వర్ణయుగ సారథి బల్బీర్ సింగ్ శకం ముగిసింది. మరణానంతరం అయినా దిగ్గజ క్రీడాకారుడిని సముచితంగా గౌరవించాలని హాకీ మాజీ క్రీడాకారులు కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ' ధ్యాన్చంద్, బల్బీర్సింగ్ ఇద్దరూ భారత క్రీడా దిగ్గజాలు. ఇద్దరూ గొప్ప రికార్డులు నెలకొల్పారు. ధ్యాన్చంద్ హాకీ జాతిపిత అయితే, బల్బీర్సింగ్ అంకుల్ ఆఫ్ హాకీ. ధ్యాన్చంద్, బల్బీర్సింగ్లు భారతరత్నకు అర్హులు. ఈ ఇద్దరూ కొన్ని తరాల క్రీడాకారులను ప్రేరణ, రాబోయే తరాలకు సైతం ఆదర్శం' అని 1975 వరల్డ్కప్ కెప్టెన్ అజిత్ పాల్ సింగ్ అన్నారు. ధ్యాన్చంద్ కుమారుడు అశోక్కుమార్ (1975 వరల్డ్కప్ జట్టు సభ్యడు), మాజీ కెప్టెన్ దిలీప్ టర్కీలు సైతం బల్బీర్సింగ్ సీనియర్ను ప్రభుత్వం ఇప్పటికైనా సముచితంగా గౌరవించాలని కోరారు.