Authorization
Mon Jan 19, 2015 06:51 pm
1975 హాకీ ప్రపంచకప్ ఫైనల్స్. పాకిస్థాన్తో వరల్డ్కప్ అంతిమ సమరం. తుది పోరు నాటి ఉదయం చోటుచేసుకున్న సన్నివేశమిది. భారత జట్టు సెంటర్ డిఫెండర్ అస్లాం షేర్ ఖాన్ను జట్టు మేనేజర్ కౌలాలంపూర్లోని రాయల్ మసీద్కు తీసుకెళ్లాడు. అస్లాం షేర్ ఖాన్ ప్రార్థనలు ముగించుకుని బయటకు వస్తుండగానే, పాకిస్థాన్ జట్టు సైతం మసీదుకు చేరుకుంది. అప్పుడు భారత జట్టు మేనేజర్తో పాకిస్థాన్ ఆటగాళ్లు ఇలా అన్నారు. ' మేము ఏం అడగాలని (ప్రపంచకప్ పసిడి) వచ్చామో, నువ్వు ముందే అడిగేశావ్' అని అన్నారు. అప్పటి భారత జట్టు మేనేజరే దిగ్గజ హాకీ క్రీడాకారుడు బల్బీర్ సింగ్ సీనియర్. సెంటర్ ఫార్వర్డ్గా భారత్కు మూడు ఒలింపిక్ స్వర్ణాలు అందించిన లెజెండ్. జట్టు మేనేజర్గా ప్రపంచకప్ పసిడి స్వప్నం సైతం సాకారం చేసిన యోధుడు. అన్ని మతాల ఆటగాళ్లు ప్రాతినిథ్యం వహించే జాతీయ జట్టుకు ఉమ్మడి ప్రార్థన గది ఉండాలనే ఆలోచన చేసిన లౌకికవాది. భారత్కు అత్యున్నత స్థాయిలో ప్రాతినిథ్యం వహించి, అత్యుత్తమ పతకాలు అందించిన క్రీడాస్ఫూర్తిని నిజజీవితంలోనూ కొనసాగించాడు. క్రీడా రంగంలో నిజమైన లౌకిక జాతీయవాదిగా నిలబడ్డాడు. ఇప్పటి తరం క్రీడాలోకానికి లౌకిక జాతీయవాదంలో బల్బీర్సింగ్ నిజమైన ఆదర్శప్రాయుడు!
నవ తెలంగాణ క్రీడా విభాగం : హాకీ స్టిక్తో అతడేమీ మాంత్రికుడు కాదు. మేటి దిగ్గజం ధ్యాన్చంద్ స్థాయి ఆటగాడు అసలే కాదు. బంతిని నేర్పుగా డ్రిబ్లింగ్ చేయగల సామర్థ్యం కలిగిన ఆటగాడూ కాదు. అయినా, అతడి కోసం ఓ రాష్ట్ర పోలీసు అధిపతి పట్టుబట్టాడు. ఇంతకీ అతడిలో ఉన్న ప్రత్యేకత ఏమిటీ? సమష్టిగా ఆడే హకీలో అతడు స్వచ్ఛమైన జట్టు ఆటగాడు. బంతిని గోల్ పోస్ట్ వద్దకు తీసుకెళ్తూ, గోల్స్ కొట్టడంలో సహజసిద్ధమైన ప్రతిభ అతడిని హాకీలో ప్రత్యేకంగా నిలిపింది. ధ్యాన్చంద్ మాదిరిగా అందరి నోటా వినిపించే పేరు కాకపోయినా, ఒలింపిక్స్ ఫైనల్లో అత్యధిక గోల్స్ (5)తో రికార్డు నెలకొల్పిన ఘనత అతడిది. జీవతం అంతా హాకీకి అంకితం చేసిన బల్బీర్సింగ్ సీనియర్ సోమవారం తుది శ్వాస విడిచిన సంగతి అందరికీ తెలిసిందే. ఆటగాడిగా బల్బీర్సింగ్ సీనియర్ చేసిన విన్యాసాలు, సాధించిన విజయాలు, నెలకొల్పిన రికార్డులు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. దిగ్గజ ఒలింపియన్, దిగ్గజ హాకీ మాంత్రికుడిగా బల్బీర్సింగ్ చిరస్థాయిగా నిలుస్తారు. ఆటగాడిగా హాకీ మైదానంలో చూపిన క్రీడాస్ఫూర్తి, మైదానం వెలుపలా బల్బీర్సింగ్ కొనసాగించారు. క్రీడాస్ఫూర్తితోనే ఇతరులతో మెలిగారు. హాకీ చూసిన నిజమైన జెంటిల్మెన్, గొప్ప లౌకిక జాతీయవాది బల్బీర్ సింగ్ సీనియర్.
హాకీ ప్రవేశం అనూహ్యం! : బల్బీర్ సింగ్ హాకీలోకి అడుగుపెట్టడం అనూహ్య పరిణామం. యూనివర్శిటీ స్థాయిలో హాకీ స్టిక్ పట్టుకున్నా, ప్రభుత్వ కొలువులో స్థిరపడాలనేది ఆలోచన. కానీ పంజాబ్ పోలీసు చీఫ్ బెదిరింపులతో హాకీలోకి ప్రవేశించాడు. బల్బీర్సింగ్ తండ్రి స్వాతంత్య్ర సమర పోరాటంలో చురుగ్గా పాల్గొన్నారు. ఈ క్రమంలో పలుమార్లు పంజాబ్ పోలీసులు బల్బీర్ తండ్రిని ఖైదు చేశారు. దీంతో పోలీసుల పట్ల బల్బీర్సింగ్కు వ్యతిరేక భావం ఏర్పడింది. కళాశాల స్థాయిలో బల్బీర్సింగ్ హాకీ మెరుపులను చూసి ముగ్ధుడైన పంజాబ్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసు జాన్ బెనెట్ అతడిని రాష్ట్ర పోలీసు జట్టులో చేరాల్సిందిగా కోరాడు. పోలీసుల పట్ల వ్యతిరేక భావాలు కలిగిన బల్బీర్ సింగ్ ఆ ఆఫర్ను తిరస్కరించి ఢిల్లీకి చేరుకున్నాడు. అక్కడ ప్రజా పనుల విభాగంలో చేరాడు. పంజాబ్ పోలీసు అధికారులను వారెంట్లతో ఢిల్లీకి పంపించిన బెనెట్, బల్బీర్ సింగ్కు రెండు ఆప్షన్లు ఇచ్చాడు. ఖైదీగా జైలుకెళ్లడం, ఆటగాడిగా హాకీ మైదానంలోకి వెళ్లడమా. పోలీసు శాఖలో ఉద్యోగంతో రాష్ట్ర జట్టుకు అయిష్టంగానే ప్రాతినిథ్యం వహించాడు. 1946లో పంజాబ్ జట్టుకు నాయకత్వం వహించి 14 ఏండ్ల విరామం అనంతరం పంజాబ్ను జాతీయ చాంపియన్గా నిలిపాడు. దేశ విభజనకు కొద్ది నెలల ముందు జరిగిన 1947 జాతీయ చాంపియన ్షిప్స్లో సైతం స్నేహితులు అలీ షా దార్ (1936 ఒలింపిక్స్ జట్టులో సభ్యుడు), మొహమ్మద్ షారుక్ ఖాన్లతో కలిసి టైటిల్ నిలుపుకున్నాడు. దేశ విభజన సమయంలో అలీ షా దార్, మొహమ్మద్ షారుక్ ఖాన్లు పాకిస్థాన్కు వెళ్లటం జరిగింది. 1948 లండన్ ఒలింపిక్స్లో స్నేహితులు అలీ షా దార్, షారుక్ ఖాన్లు పాకిస్థాన్కు ప్రాతినిథ్యం వహించారు.
పచ్చికపై చిచ్చరపిడుగు : ఆ కాలంలో హాకీని పచ్చికపై ఆడేవారు. ఒలింపిక్స్లో భారత్ సాధించిన బంగారు పతకాలన్నీ పచ్చికపై పసిడి వెలుగులే. 1948 ఒలింపిక్స్ హాకీ జట్టుతో పాటు యావత్ భారత్ను భావోద్వేగానికి గురిచేసింది. ఫైనల్లో గ్రేట్ బ్రిటన్తో తలపడిన భారత్.. మరో మూడు రోజుల్లో తొలి స్వాతంత్య్ర వేడుకలు జరుపుకోనుంది. ఆ మ్యాచ్లో భారత్ 4-0తో బ్రిటన్ను ఓడించింది. పసిడి పోరులో తొలి రెండు గోల్స్ బల్బీర్ సింగ్ సాధించాడు. 1952 హెల్సింకి (ఫిన్లాండ్ రాజధాని) ఒలింపిక్స్లో గొప్ప రికార్డు నెలకొల్పాడు. నెదర్లాండ్స్తో ఫైనల్లో ఐదు గోల్స్ కొట్టి.. అంతిమ సమయంలో అత్యధిక గోల్స్ కొట్టిన ఆటగాడిగా ఒలింపిక్ రికార్డు తన పేరిట లిఖించుకున్నాడు. ఇప్పటికీ ఈ రికార్డు పదిలంగా ఉంది. 1948 (లండన్), 1952 (హెల్సింకి), 1956 (మెల్బోర్న్) వరుసగా మూడు ఒలింపిక్స్లో భారత్కు స్వర్ణాలు అందించాడు. 61 మ్యాచుల్లో 246 గోల్స్ సాధించాడు. మూడు ఒలింపిక్స్, 1954, 1955 విదేశీ పర్యటనల్లో కలిపి ఈ గోల్స్ సాధించాడు. అప్పట్లో గణాంకాలు నమోదు చేసే యంత్రాంగం వ్యవస్థీకృతంగా లేదు. లేదంటే బల్బర్ సింగ్ గోల్స్ గణాంకాలు మరో స్థాయిలో ఉండేవి.
లెక్యులర్ నేషనలిస్ట్ : బల్బీర్ సింగ్ కెరీర్లో ప్రధానంగా చెప్పుకోదగిన లక్షణం ఆయన గొప్ప లౌకిక భావాలు. భిన్నత్వానికి మారుపేరు భారత హాకీ జట్టు. భిన్న మతస్థులు జాతీయ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్న తరుణంలో కెప్టెన్గా ఆటగాళ్లకు ప్రార్థన గది ఉండాలని సూచించాడు. మతాన్ని, దేశభక్తిని ఎన్నడూ కలిపి చూడలేదు. ' మా నాన్న మున్వెన్నల జెండాతో స్వాతంత్య్ర పోరాటం చేస్తున్నప్పుడు నాకు ఆ సంకల్ప ఉద్దేశం అర్ధం కాలేదు. 1948 ఒలింపిక్స్లో స్వర్ణం నెగ్గిన అనంతరం జాతీయ జెండా, జాతీయ గేయం వినిపించినప్పుడు ఆ సంగతి బోధపడింది. అది మాటల్లో చెప్పలేనిది, అనుభవించాలి అంతే' అని బల్బీర్ సింగ్ పలుమార్లు అన్నారు. ఇతర మతస్థుల పట్ల ఎంతో గౌరవభావంతో మెలిగాడు, ఇతరుల మత విశ్వాసాల పట్ల గౌరవం చూపారు. 1975 వరల్డ్కప్ ఫైనల్స్ రోజు ఉదయం కౌలాలంపూర్ (మలేషియా)లోని రాయల్ మసీద్కు భారత ఆటగాడు అస్లాం షేర్ ఖాన్ను స్వయంగా తీసుకెళ్లారు. ఆ సందర్భంగా మసీదు వద్దకు చేరుకున్న పాకిస్థాన్ ఆటగాళ్లు తనతో చెప్పిన మాటను బల్బీర్ సింగ్ ఓ ఇంటర్వ్యూలో గుర్తు చేశారు.
నిజమైన జెంటిల్మెన్
వీడ్కోలు పలికినా బల్బీర్ హాకీని వీడలేదు. కోచ్గా, మేనేజర్గా, డైరెక్టర్గా హాకీ జట్టుతో అనుబంధం కొనసాగించాడు. కెరీర్లో ఎన్నడూ సహనం కోల్పోలేదు. హాకీ ఇండియా అత్యంత గడ్డు పరిస్థితులను చవిచూసిన సమయం లోనూ విమర్శలకు వెళ్లలేదు. స్పోర్ట్స్ మ్యూజియం కోసం భారత క్రీడా ప్రాధికార సంస్థ (సారు) బల్బీర్ను సంప్రదించింది. మూడు ఒలింపిక్ మెడల్స్ మినహా అన్ని పతకాలు, ఆసియా క్రీడల మెడల్, 100 అరుదైన ఫోటోలు, 36 ట్రోఫీలు, మెల్బోర్న్ ఒలింపిక్స్ కెప్టెన్ బ్లేజర్లను సారుకు ఇచ్చాడు. నిర్వహణ లోపంతో బల్బీర్సింగ్ జ్ఞాపకాలను సారు నిర్లక్ష్యం చేసింది. ఇప్పుడు అవి ఎక్కడ ఉన్నాయనే విషయం సైతం సారు అధికారులకు తెలియని పరిస్థితి. సారు అధికారుల నిర్లక్ష్యం పట్ల సైతం సహనం కోల్పోలేదు. భారత హాకీ పురోగతికి ఎల్లప్పుడూ ఉత్పేరకంగానే పని చేశాడు.