Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-షెడ్యూల్ సిద్ధం చేస్తున్న ఆస్ట్రేలియా
మెల్బోర్న్ : కంగారూ గడ్డపై టీమ్ ఇండియా తొలి గులాబీ టెస్టు ఆడేందుకు రంగం సిద్ధమవుతోంది. ఆస్ట్రేలియాలో డే నైట్ టెస్టుకు బీసీసీఐ గ్రీన్ సిగల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. కరోనా వైరస్ కారణంగా ప్రపంచ క్రికెట్ స్తంభించినా, క్రికెట్ సీజన్ పునరుద్ధరణకు క్రికెట్ ఆస్ట్రేలియా సర్వ శక్తులూ ఒడ్డుతోంది. దేశవాళీ సీజన్తో మొదలెట్టి, మెగా సిరీస్లకు ప్రణాళిక చేసుకోవాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే భారత్తో బోర్డర్-గవాస్కర్ టెస్టు సిరీస్కు వారం రోజుల్లో షెడ్యూల్ ఖరారు చేయనుంది. ఈ మేరకు క్రికెట్ ఆస్ట్రేలియా వర్గాలు వెల్లడించాయి. ఆస్ట్రేలియా వేసవి టెస్టు సీజన్లో డేనైట్ గులాబీ టెస్టు సంప్రదాయంగా వస్తోంది. కానీ టీమ్ ఇండియా గత పర్యటనలో గులాబీ పోరుకు నిరాకరించింది. ఈసారి ఆడిలైడ్లో కోహ్లిసేనతో పింక్ బాల్ టెస్టు ఆడేందుకు సీఏ ఎదురుచూస్తోంది. భారత్తో సిరీస్కు వేదికల ఎంపికలోనూ సీఏ జాగ్రత్తగా వ్యవహరిస్తోంది. బోర్డర్ గవాస్కర్ సిరీస్ను తిరిగి సాధించేందుకు తొలి టెస్టును బ్రిస్బేన్ గబ్బాలో ఏర్పాటు చేస్తోంది. 1988 నుంచి గబ్బాలో కంగారూ జట్టు ఓటమెరుగదు. రెండో టెస్టు ఆడిలైడ్లో జరుగనుండగా.. తర్వాతి రెండు టెస్టులకు మెల్బోర్న్, సిడ్నీ ఆతిథ్యం ఇవ్వనున్నాయి. బయో సెక్యురిటీ కారణాలతో తొలుత పెర్త్లో (రెండు స్టేడియాలు)లో భారత్తో సిరీస్కు నిర్వహించేందుకు సీఏ ఆలొచన చేసింది. డిసెంబర్లో పరిస్థితుల్లో మార్పు ఆశిస్తోన్న సీఏ నాలుగు నగరాల్లో పూర్తి స్థాయి షెడ్యూల్ సిద్ధం చేస్తోంది. భారత్తో సిరీస్కు ముందు వాకా (పెర్త్)లో అఫ్గనిస్థాన్తో ఆసీస్ ఓ టెస్టు మ్యాచ్లో ఆడనుంది.