Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-విచారణలో బుకీ సంజీవ్ చావ్లా
న్యూఢిల్లీ : ఇప్పటివరకు మనం చూసిన మ్యాచులన్నీ కళంకితమేనా? ఏ మ్యాచ్ నిజాయితీగా ఆడలేదా? ప్రతి మ్యాచ్ ఫలితాన్ని బుకీలు శాసించారా? అంటే అవుననే అంటున్నాడు క్రికెట్ బుకీ సంజీవ్ చావ్లా. హై ప్రొఫైల్ క్రికెట్ బుకీ సంజీవ్ చావ్లాను ఢిల్లీ పోలీసులు విచారిస్తున్న సంగతి తెలిసిందే. 1993లో లండన్కు వెళ్లిన చావ్లా, అక్కడ బట్టల వ్యాపారం చేశాడు. 2010లో బ్రిటన్ పౌరసత్వం పొందాడు. క్రికెట్లో ఫిక్సింగ్ కుంభకోణంలో కీలక సమాచారం కోసం బ్రిటన్ ప్రభుత్వంతో చర్చలు జరిపి ఈ ఏడాది ఆరంభంలో చావ్లాను భారత్కు తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. తొలుత ఓ టెస్టు మ్యాచ్, రెండు వన్డేలను ఫిక్స్ చేసినట్టు అంగీకరించిన సంజీవ్ చావ్లా.. తాజాగా పెద్ద బాంబ్ పేల్చాడు. ఇప్పటివరకు జనాలు చూసిన మ్యాచుల అన్నీ ఫిక్స్ చేసినవేనని వెల్లడించాడు. ఈ మేరకు ఇండియన్ ఎక్స్ప్రెస్ పత్రికలో కథనం ప్రచురితమైంది. ఏ క్రికెట్ మ్యాచ్ నిజాయితీగా ఆడలేదు. ఇప్పటి వరకు జనాలు చూసిన మ్యాచులు అన్నీ ఫిక్స్ అయినవే. దీంట్లో పెద్ద సిండికేట్, మాఫియా పని చేస్తోంది. మాఫియా పనితీరు, క్రికెట్ మ్యాచుల ఫిక్సింగ్ ఇప్పటికే దర్శకులు వెండితెరపై చూపించారు. అచ్చం అలాగే క్రికెట్ మ్యాచులు ఫిక్స్ చేస్తున్నారు. దీన్ని చాలా ప్రమాదకర వ్యక్తులు నడుపుతున్నారు. మాఫియా విషయాలు చెబితే, నా ప్రాణానికి ముప్పు వాటిల్లుతుంది. కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసు అధికారులు సైతం మాఫియా హిట్ లిస్ట్లో ఉన్నారు' అని సంజీవ్ చావ్లా విచారణ అధికారులతో అన్నట్టు సమాచారం. ' కేసు ఇంకా దర్యాప్తు దశలోనే ఉంది. ఈ సమయంలో కీలక సమాచారంపై ఎటువంటి వ్యాఖ్యలు చేయలేం' అని విచారణ అధికారి పేర్కొన్నారు.