Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-హాకీ ఇండియా, టిటిఎఫ్ఐ సిఫార్సు
న్యూఢిల్లీ: ప్రతిష్ఠాత్మక రాజీవ్గాంధీ ఖేల్రత్న అవార్డుకు భారత మహిళా హాకీ జట్టు కెప్టెన్ రాణి రాంపాల్, టేబుల్ టెన్నిస్ మహిళల స్టార్ మనిక బత్రాను ఆయా సమాఖ్యలు సిఫార్సు చేశాయి. అర్జున అవార్డుకు వందన కటారియా, మోనిక మాలిక్, హర్మన్ప్రీత్ సింగ్లను మంగళవారం హాకీ ఇండియా(హెచ్ఐ) ప్రతిపాదించింది. మేజర్ ధ్యాన్చంద్ లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డుకు మాజీ ఆటగాడు ఆర్పీసింగ్, తుషార్ ఖండేకర్లను, కోచ్లు బిజె కరియప్ప, రొమేశ్ పఠానియాలను ద్రోణాచార్య అవార్డుకు నామినేట్ చేసింది. రాజీవ్గాంధీ ఖేల్ రత్న అవార్డుకు 1 జనవరి 2016 నుంచి 31 డిసెంబరు 2019 మధ్య ఆటను పరిగణనలోకి తీసుకుంటారు. ఈ కాలంలో రాణి సారథ్యంలోని భారత మహిళల హాకీ జట్టు 2017 ఆసియాకప్లో చారిత్రాత్మక విజయం సాధించింది. 2018లో ఆసియా గేమ్స్లో రజత పతకం గెల్చుకోవడంతోపాటు.. 2019లో ఎఫ్ఐహెచ్ ఒలింపిక్ క్వాలిఫయర్స్లో రాణి నిర్ణయాత్మక గోల్ సాధించి జట్టును టోక్యో ఒలింపిక్స్కు చేర్చింది. రాణి ఇప్పటికే వరల్డ్ గేమ్స్ 'అథ్లెట్ ఆఫ్ ది ఇయర్', 2016లో అర్జున అవార్డు, 2020లో పద్మశ్రీ పురస్కారాలను అందుకుంది.
మనిక బత్రాకు టిటిఎఫ్ఐ సిఫార్సు
భారత మహిళల టేబుల్ టెన్నిస్ స్టార్ మనిక బత్రాకు టిటి సమాఖ్య ప్రతిష్టాత్మక ఖేల్రత్న అవార్డుకు ఎంపిక చేసింది. మనిక కామన్వెల్త్ గేమ్స్ టిటి మహిళల సింగిల్స్లో స్వర్ణం నెగ్గిన ఏకైక క్రీడాకారిణిగా నిలిచింది. 2018లో మనిక నాలుగు బంగారు పతకాలను గెల్చుకొని సంచలనం సృష్టించింది. కామన్వెల్త్ క్రీడల్లో భారత మహిళల టిటి జట్టు స్వర్ణం, జకార్తా ఆసియా క్రీడల మిక్స్డ్ డబుల్స్లో కాంస్య పతకం గెల్చుకొని చరిత్ర సృష్టించింది. 2020 అవార్డుల నామినేషన్ల స్వీకరణకు నేటితో ఆఖరు.