Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-ఇంగ్లాండ్తో సిరీస్లో విండీస్ జెర్సీలు
-విండీస్ క్రికెట్కు అనుమతి ఇచ్చి ఐసీసీ
మాంచెస్టర్ (ఇంగ్లాండ్) : జాతి వివక్ష వ్యతిరేక ఉద్యమాన్ని వెస్టిండీస్ క్రికెటర్లు మరో స్థాయికి తీసుకెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. అమెరికాలో జార్జ్ ఫ్లాయిడ్ ఉదంతం అనంతరం, క్రికెట్లో సైతం ఎదురైన జాతి, వర్ణ వివక్షలపై వెస్టిండీస్ క్రికెటర్లు గళం విప్పిన సంగతి తెలిసిందే. కరోనా వైరస్పై పోరాడుతున్న బ్రిటన్ ఆరోగ్య కార్యకర్తలు, ఫ్రంట్లైన్ వర్కర్ల పేర్లతో కూడిన జెర్సీలను ప్రాక్టీస్ సెషన్లలో ధరించేందుకు ఇంగ్లాండ్ క్రికెట్ రంగం సిద్ధం చేయగా... జాతి వివక్ష వ్యతిరేక ఉద్యమానికి సంఘీభావంగా 'బ్లాక్ లైవ్స్ మ్యాటర్' చిహ్నంతో కూడిన జెర్సీలు ధరించేందుకు వెస్టిండీస్ క్రికెటర్లు రెఢ అయ్యారు. అలిసా హౌసన్నా డిజైన్ చేసిన బ్లాక్ లైవ్స్ మ్యాటర్ చిహ్నలతో కూడిన జెర్సీలను ప్రీమియర్ లీగ్ ఫుట్బాల్ క్లబ్లు ధరించిన సంగతి తెలిసిందే. ఆ లోగోలను వినియోగించేందుకు వెస్టిండీస్ క్రికెట్ బోర్డు అలిసా హౌసన్నాను సంప్రదించింది. వెస్టిండీస్ క్రికెటర్లు జెర్సీ కాలర్లపై ఈ చిహ్నం ధరించేందుకు ఐసీసీ నుంచి అనుమతి లభించింది.
మాపై ఆ బాధ్యత ఉంది : ' జాతి వివక్ష వ్యతిరేక ఉద్యమానికి సంఘీభావంగా నిలిచేందుకు, అవగాహన కల్పించేందుకు మాపై బాధ్యత ఉందని మేము నమ్ముతున్నాం. క్రీడా చరిత్రలో ఇదో ముఖ్యమైన ఘట్టం. మేము ఇక్కడికి (ఇంగ్లాండ్) విజ్డెన్ ట్రోఫీని నిలుపుకునేందుకు వచ్చాం. కానీ ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలపై, సామాజిక న్యాయం, సమానత్వం కోసం జరుగుతున్న ఉద్యమం పట్ల సంపూర్ణ అవగాహన కలిగి ఉన్నాం. సమాన హక్కులు, శరీర రంగు, సామాజిక నేపథ్యం ప్రకారం మనుషులు చూడకుండా ఉండేందుకు మనమో మార్గం కనుగొనాల్సి ఉంది' అని వెస్టిండీస్ కెప్టెన్ జేసన్ హౌల్డర్ ఓ ప్రకటనలో తెలిపాడు.