Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-ఈ గౌరవం అందుకున్న మూడో భారత అంపైర్
దుబారు : ఐసీసీ ఎలైట్ ప్యానల్ ఆఫ్ అంపైర్ల జాబితాలోకి భారత అంపైర్ నితిన్ మీనన్ ఎంపికయ్యారు. 2020-2021 సీజన్కు నితిన్ మీనన్ను ఎంపిక చేస్తూ ఐసీసీ ప్యానల్ నిర్ణయం తీసుకుంది. ఐసీసీ జనరల్ మేనేజర్ జాఫ్, మాజీ క్రికెటర్ సంజరు మంజ్రేకర్, మ్యాచ్ రిఫరీ రంజన్ మదుగాలె, డెవిడ్ బూన్లతో కూడిన ప్యానల్ ఈ నిర్ణయం తీసుకుంది. ఐసీసీ ఎలైట్ ప్యానల్ ఆఫ్ అంపైర్లకు ఎంపికైన అతి పిన్న వయస్కుడిగా నితిన్ మీనన్ (36) నిలిచాడు. నితిన్ మీనన్ ఇప్పటివరకు అంతర్జాతీయ ప్యానల్లో సభ్యుడిగా ఉన్నాడు. నిగెల్ లాంగ్ స్థానంలో నితిన్ మీనన్ ఎలైట్ ప్యానల్లోకి రానున్నాడు. ఐసీసీ ప్రతి సంవత్సరం వివిధ కొలమానాలు (ఆన్ ఫీల్డ్ నిర్ణయాలు, సమీక్షల్లో వచ్చిన సరైన నిర్ణయాలు, మైదానంలో ప్రవర్తన ఆధారంగా పాయింట్లు కేటాయిస్తారు. పాయింట్ల ప్రకారం అంతర్గత ర్యాంకులు ఇస్తారు) ఆధారంగా సమీక్ష చేస్తారు.
అరుదైన గౌరవం! : 'ఐసీసీ ఎలైట్ ప్యానల్లో చోటుచేసుకోవటం గొప్ప గౌరం, నాకు ఎంతో గర్వకారణం. నిరంతరం ప్రపంచ అత్యుత్తమ అంపైర్లు, రిఫరీలతో కలిసి పనిచేయటం మాటల్లో చెప్పలేని అనుభూతి. దీని కోసమే ఇన్నాండ్లూ కలలు కన్నాను. ఇప్పటికే టెస్టులు, వన్డేలు, టీ20 సహా ఐసీసీ ఈవెంట్లలో అంపైరింగ్ చేశాను. ఎలైట్ ప్యానల్లో చోటుతో నాపై ఉన్న బాధ్యతను అర్థం చేసుకోగలను. నా అనుభవాలను భారత అంపైర్లతో పంచుకుంటాను' అని నితిన్ మీనన్ ఆనందంగా తెలిపారు. 2017లో అంపైర్ కెరీర్ మొదలుపెట్టిన నితిన్ మీనన్.. మూడు టెస్టులు, 24 వన్డేలు, 16 టీ20లకు అంపైర్గా పనిచేశారు. మహిళల 2018, 2020 టీ20 ప్రపంచకప్లకు సైతం అంపైర్గా వ్యవహరించారు. ఎస్. వెంకటరాఘవన్, ఎస్.రవి తర్వాత ఐసీసీ ఎలైట్ ప్యానల్లో నిలిచిన మూడో భారత అంపైర్ నితిన్ మీనన్ కావటం విశేషం.
ఐసీసీ ఎలైట్ ప్యానల్ ఆఫ్ అంపైర్స్ : అలీమ్ దార్, కుమార్ ధర్మసేన, మరియస్ ఎరాస్మస్, క్రిస్ గఫానీ, మైకల్ గాఫ్, నితిన్ మీనన్, రిచర్డ్ ఇల్లింగ్వర్త్, రిచర్డ్ కెటిల్బార్, బ్రూస్ ఒక్సెన్ఫోర్డ్, పాల్ రీఫెల్, రాడ్ టకర్, జోల్ విల్సన్.
ఐసీసీ ఎలైట్ ప్యానల్ ఆఫ్ మ్యాచ్ రిఫరీస్ : డెవిడ్ బూన్, క్రిస్ బ్రాడ్, జెఫ్ క్రోవె, రంజన్ మదుగాలె, ఆండీ క్రాఫ్ట్, రిచీ రిచర్డ్సన్, జవగళ్ శ్రీనాథ్.