Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇంగ్లాండ్ మాజీ స్పిన్నర్ పనేసర్
సౌతాంప్టన్ (ఇంగ్లాండ్) : కరోనా వైరస్ మహమ్మారితో ప్రపంచ క్రికెట్కు కోరుకోని విరామం వచ్చింది. బయో సెక్యూర్ బబుల్ వాతావరణంలో ఇంగ్లాండ్, వెస్టిండీస్లు టెస్టు సిరీస్లో తలపడేందుకు సిద్ధమవుతున్నాయి. విరామం అనంతరం క్రికెట్ను చూసేందుకు అభిమానులు ఎంత ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. కరోనా తీసుకొచ్చిన మార్పులపై క్రికెటర్లు తమ నైపుణ్యాన్ని ఏ విధంగా వినియోగిస్తారనే ఆసక్తి సైతం ఎక్కువగా కనిపిస్తోంది. ఉమ్మి నిషేధంతో పేసర్లు స్వింగ్ ఎలా రాబడతారనే చర్చ ఇప్పుడు విస్తృతంగా సాగుతోంది. ఇంగ్లాండ్ మాజీ స్పిన్నర్ మాంటీ పనేసర్ ఈ ఆసక్తికర చర్చలో తన అభిప్రాయాలను పంచుకున్నాడు. ' ఇంగ్లాండ్లో ఫుట్బాల్ మొదలైంది. ఇప్పుడు క్రికెట్ వంతు వచ్చింది. ఇంగ్లాండ్, వెస్టిండీస్ అభిమానులు మళ్లీ క్రికెట్ను ఆస్వాదించబోతున్నారు. ఈ సిరీస్ జరుగుతున్న తీరుపై ఇతర క్రికెట్ బోర్డులు ఆసక్తికరంగా చూడనున్నాయి. ప్రపంచంలో అత్యుత్తమ బ్యాట్స్మన్ ఎవరు? అంటే ఏం చెప్తాం. విరాట్ కోహ్లి అనేస్తాం. అదే బౌలర్లలో జేమ్స్ అండర్సన్ పేరు నా వరకు అత్యుత్తమం. అత్యంత నైపుణ్యం కలిగిన పేసర్ అండర్సన్. ఉమ్మి సాయం లేకుండా అండర్సన్ స్వింగ్ రాబట్టలేకుంటే.. మిగతా బౌలర్లు కచ్చితంగా మరింత ఎక్కువ ఇబ్బందులు పడతారు. ఉమ్మి లేకుండా స్వింగ్ చేయగల తొలి బౌలర్ జేమ్స్ అండర్సన్ అని నా గట్టి నమ్మకం' అని పనేసర్ అన్నాడు. జులై 8న సౌతాంప్టన్లో ఇంగ్లాండ్, వెస్టిండీస్లు తొలి టెస్టులో తలపడనున్న సంగతి తెలిసిందే.