Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-కార్యదర్శి ఎవరో తెలియని సందిగ్ధంలో బీసీసీఐ
-జై షా ఆరేండ్ల పదవీ కాలం జూన్30తో పూర్తి
-జులై 27తో గంగూలీదీ ఇదే పరిస్థితి
నవతెలంగాణ-ముంబయి
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)లో విచిత్రమైన పరిస్థితి నెలకొంది. బీసీసీఐకి ఇప్పుడు కార్యదర్శి ఉన్నారా? లేరా? ఉంటే ఆ కార్యదర్శి ఎవరు? అనే విషయంపై ఎవరికీ స్పష్టత లేదు. ప్రపంచ అత్యంత ధనిక క్రికెట్ బోర్డు ఎందుకు ఈ పరిస్థితిని ఎదుర్కొంటుంది?. నిజానికి ఇటువంటి పరిస్థితులు ఎదురవుతాయనే సంగతి బీసీసీఐ ఆఫీస్ బేరర్లకు ముందే తెలుసు. అయినా, జస్టిస్ లోధా కమిటీ సిఫారసులు, సుప్రీంకోర్టు ఆదేశాలు, బీసీసీఐ రాజ్యాంగాన్ని తుంగలో తొక్కి.. బోర్డు వార్షిక సర్వ సభ్య సమావేశం ఈ పరిస్థితి తలెత్తే నిర్ణయం తీసుకుంది!. ఇప్పుడు సుపరిపాలన, కరోనా కష్టకాలం, క్రికెట్ సవాళ్ల పేరుతో సుప్రీంకోర్టు తలుపు తడుతోంది. నూతన రాజ్యాంగం అనుసారం బీసీసీఐ, రాష్ట్ర క్రికెట్ సంఘాల్లో కలిపి వరుసగా ఆరేండ్లు మాత్రమే పదవీలో కొనసాగేందుకు వీలుంది. ఆరేండ్ల అనంతరం కచ్చితంగా మూడేండ్లు అన్ని పదవులకు (క్రికెట్ పరిపాలన) దూరంగా ఉండాలి. ఆ నిబంధనల ప్రకారం జై షా కార్యదర్శి పదవీకాలం జూన్ 30తో ముగిసిపోయింది. జులై 27న బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ పదవీ కాలం ముగియనుంది. ఇప్పుడు కార్యదర్శి ఎవరో తెలియని సందిగ్థంలో పనిచేస్తోన్న బీసీసీఐ.. మరికొన్ని రోజుల్లో అధ్యక్షుడు ఉన్నారో లేదో తెలియని సంకటి స్థితిలో పనిచేయాల్సిన పరిస్థితి ముంచుకొస్తుంది.
ప్రస్తుతానికి కార్యదర్శి లేడు..! : ' ఈ విషయాన్ని ఎవరూ బహిరంగంగా చెప్పలేరు. కానీ బీసీసీఐ రాజ్యాంగం ప్రకారం ఇప్పుడు బోర్డుకు కార్యదర్శి లేరు. జులై 27 తర్వాత బోర్డుకు అధ్యక్షుడు కూడా ఉండబోరు' అని పేరు చెప్పడానికి ఇష్టపడని ఓ అధికారి తెలిపారు. ' ఒకరకంగా చెప్పాలంటే జూన్ 1 నుంచి బీసీసీఐకి కార్యదర్శి లేరు. ఇకనుంచి అన్నీ ఆటోమోడ్లో ఉంటాయి' అని మరో అధికారి అన్నారు. నిబంధనల ప్రకారం కార్యదర్శి పదవీకాలం ముగియటంతో.. తాత్కాలిక కార్యదర్శి బాధ్యతలు ఎవరు తీసుకున్నారనే విషయమై బీసీసీఐ ఉన్నతాధికారులను సంప్రదించగా.. ఎటువంటి సమాచారం రావటం లేదు.
ఈ పరిణామానికి బీసీసీఐ ఉన్నతాధికారులు ముందుగానే సన్నద్ధమైనట్టు తెలుస్తోంది. బీసీసీఐ వెబ్సైట్లో ఆఫీస్ బేరర్ల సమాచారం ఉండటం సహజం. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఆఫీస్ బేరర్ల పేర్లను వెబ్సైట్లో ఉంచటం, సాంకేతికంగా న్యాయస్థానంలో సమస్యలు వస్తాయని అప్రమత్తమయ్యారు. నిబంధనల ప్రకారం ఆఫీస్ బేరర్ల జాబితా నుంచి జై షా (బీజేపీ మాజీ అధ్యక్షుడు, హౌం శాఖ మంత్రి అమిత్ షా కుమారుడు) పేరు తొలగించాలి. అదే జరిగితే, అనంతరం బీసీసీఐ టెక్నికల్ టీమ్ చీఫ్ రాజీనామా చేయాల్సిన పరిస్థితి తలెత్తే ప్రమాదం లేకపోలేదు!. అందుకే ఆఫీస్ బేరర్లు అందరి పేర్లను వెబ్సైట్ నుంచి తొలగించారు. కార్యదర్శిపై సమాచారం కోసం ఎవరు సంప్రదించినా, ఉన్నతాధికారులు స్పందించేందుకు నిరాకరిస్తున్నారు.
సుప్రీంకోర్టులో పిటిషన్లు : జస్టిస్ ఆర్ఎం లోధా కమిటీ సిఫారసుల ప్రకారం రాష్ట్ర క్రికెట్ సంఘం, బీసీసీఐలో కలిపి వరుసగా ఆరేండ్లకు మించి పదవిలో ఉండేందుకు అవకాశం లేదు. కచ్చితంగా మూడేండ్లు బీసీసీఐ, రాష్ట్ర క్రికెట్ సంఘాలకు దూరంగా ఉండాల్సిందే. గుజరాత్ క్రికెట్ సంఘం (జీసీఏ) అధ్యక్షుడిగా అమిత్ షా కొనసాగిన సమయంలో అతని కుమారుడు జై షా సంయుక్త కార్యదర్శిగా జీసీఏలో అడుగుపెట్టాడు. 2020 జూన్ 30తో జీసీఏ, బీసీసీఐలో కలుపుకుని జై షా ఆరేండ్ల పదవీ కాలం ముగిసింది. జూన్ 30తో పదవీ కాలం ముగియడానికి ముందే, జై షా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కరోనా కష్ట కాలంలో క్రికెట్ సంక్షోభం ఎదుర్కొంటున్న తరుణంలో పదవీలో కొనసాగేందుకు అనుమతించాలని జై షా పిటిషన్ దాఖలు చేసినట్టు సమాచారం. దీనిపై జై షా ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు.
జూన్ 30తో జై షా, జులై 27తో సౌరవ్ గంగూలీ పదవీకాలం ముగియనుండటంతో బీసీసీఐ ఇదివరకే సుప్రీంకోర్టు తలుపు తట్టింది. మూడేండ్ల విరామ సమయం నిబంధన మార్పు చేసేందుకు, రాజ్యాంగ సవరణకు అనుమతి ఇవ్వాలని బీసీసీఐ సుప్రీంకోర్టులో పిటిషను వేసింది. బీసీసీఐ రాజ్యాంగ సవరణలకు సుప్రీంకోర్టు అనుమతి అవసరం అక్కర్లేకుండా చూడాలని సైతం పిటిషనులో విన్నవించింది. బీసీసీఐ పిటిషను సుప్రీంకోర్టులో విచారణకు రావాల్సి ఉంది.
అందుకే ఆ భేటి ఆలస్యం : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) తాత్కాలిక షెడ్యూల్, విదేశీ కంపెనీల స్పాన్సర్షిప్లపై సమీక్ష చేసేందుకు ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం కావాల్సి ఉంది. గత వారంలోనే ఈ సమావేశం జరగాల్సి ఉంది. అయినా, చోటుచేసుకోలేదు. అందుకు బోర్డు అధికారులు ఇతర కారణాలు చెబుతున్నా.. పదవీ కాలం ముగిసిపోయిన కార్యదర్శిపై స్పష్టత లేకపోవటమేనని తెలుస్తోంది.