Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-బీసీసీఐ అంబుడ్స్మన్కు ఫిర్యాదు
ముంబయి : భారత క్రికెట్ సూపర్స్టార్, కెప్టెన్ విరాట్ కోహ్లి కోరుకోని విధంగా వార్తల్లోకెక్కాడు. భారత క్రికెట్లో జస్టిస్ ఆర్.ఎం లోధా కమిటీ సిఫారసులు అమల్లోకి వచ్చిన నాటి నుంచి విరుద్ధ ప్రయోజనాల అంశం తరచుగా వివాదాలకు కారణం అవుతోంది. భారత క్రికెట్ దిగ్గజాలు సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ, రాహుల్ ద్రవిడ్, వీవీఎస్ లక్ష్మణ్ సహా ఆఫీస్ బేరర్లు విరుద్ధ ప్రయోజనాల వివాదంలో చిక్కుకున్నవారే. ఇప్పుడు ఈ జాబితాలోకి టీమ్ ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లి చేరాడు. విరాట్ కోహ్లి విరుద్ధ ప్రయోజనాలు కలిగి ఉన్నాడని బీసీసీఐ అంబుడ్స్మన్ డికె జైన్కు ఫిర్యాదు అందింది. మధ్యప్రదేశ్ క్రికెట్ సంఘం (ఎంపీసీఏ) శాశ్వత సభ్యుడు సంజరు గుప్తా ఈమేరకు అంబుడ్స్మన్కు ఫిర్యాదు చేశాడు. జులై 4న బీసీసీఐ అంబుడ్స్మన్ ఫిర్యాదు అందుకున్నారు. బీసీసీఐ నిబంధనలు రూల్ 38(4)ను విరాట్ కోహ్లి ఉల్లంఘించినట్టు ఫిర్యాదులో పేర్కొన్నాడు. ' విరాట్ కోహ్లి జోడు పదవుల్లో కొనసాగుతున్నాడు. భారత జట్టులో ఆటగాడిగా, కెప్టెన్గా కొనసాగుతూ..స్పోర్ట్స్ మార్కెటింగ్ కంపెనీ డైరెక్టర్గా వ్యవహరిస్తున్నాడు. ఆ కంపెనీ కోహ్లి సహచర క్రికెటర్ల మార్కెట్ కాంట్రాక్టులను పర్యవేక్షిస్తుంది' అని ఫిర్యాదులో వివరించాడు. విరాట్ కోహ్లి స్పోర్ట్స్ ఎల్ఎల్పీ అండ్ కార్నర్స్టోన్ పార్ట్నర్స్ ఎల్ఎల్పీకి విరాట్ కోహ్లి డైరెక్టర్గా ఉన్నాడు. ఈ కంపెనీల్లో కోహ్లి సహచర డైరెక్టర్లు కార్నర్స్టోన్ స్పోర్ట్ అండ్ ఎంటర్టైన్మెంట్ ప్రై లిమిటెడ్లో డైరెక్టర్టుగా ఉన్నారు, ఆ కంపెనీ విరాట్ సహచర క్రికెటర్ల కాంట్రాక్టులను పర్యవేక్షిస్తోంది. విరుద్ధ ప్రయోజనాల నుంచి బయటపడేందుకు కోహ్లి ఒక పదవిని వదులుకోవాల్సి ఉంటుంది. బీసీసీఐ అంబుడ్స్మన్ జస్టిస్ డికె జైన్ ఈ అంశంపై త్వరలోనే విరాట్ కోహ్లిని నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది.