Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-విరాట్ విరుద్ధ ప్రయోజనాలపై బంటీ సజ్దే
న్యూఢిల్లీ : గుప్త ప్రయోజనాల కోసమే ఇతరులు విరాట్ కోహ్లిని అనవసర వివాదాల్లోకి లాగుతున్నారని కార్నర్స్టోన్ కంపెనీ సీఈఓ బంటీ సజ్దే విమర్శించారు. భారత క్రికెట్ జట్టు కెప్టెన్గా, కార్నర్స్టోన్ స్పోర్ట్స్ మేనేజ్మెంట్ బోర్డు డైరెక్టర్గా విరాట్ కోహ్లి జోడు పదవులు అనుభవిస్తూ విరుద్ధ ప్రయోజనాలు కలిగి ఉన్నాడని బీసీసీఐ అంబుడ్స్మన్, ఎథిక్స్ ఆఫీసర్ జస్టిస్ డికె జైన్కు ఫిర్యాదు అందిన విషయం తెలిసిందే. మధ్యప్రదేశ్ క్రికెట్ సంఘం (ఎంపీసీఏ) జీవనకాల సభ్యుడు సంజీవ్ గుప్తా ఈ మేరకు విరాట్ కోహ్లిపై ఫిర్యాదు చేయటం జరిగింది. విరాట్కోహ్లిపై విరుద్ధ ప్రయోజనాల ఆరోపణలు నిరాధారం, అరకొర సమాచారంతో చేసిన ఫిర్యాదుగా బంటీ సజ్దే వెల్లడించారు. ' తాజాగా విరాట్ కోహ్లిపై వచ్చిన విరుద్ధ ప్రయోజనాల ఆరోపణలపై ఇప్పుడు స్పందించాల్సి వస్తుంది. ప్రతి అంశంలో విరాట్ కోహ్లిని ఎటువంటి ఆధారాలు లేకుండానే వివాదాల్లోకి లాగాలని చూడటం దురదృష్టకరం. విరుద్ధ ప్రయోజనాల ఊహాగానాలు పూర్తిగా కల్పితం, అంతకుమించి ఏమీ లేదు. ఇతర క్రికెటర్ల మాదిరిగానే విరాట్ కోహ్లితో మేము కాంట్రాక్టు కుదుర్చుకున్నాం. బాధ్యతాయుత కంపెనీగా మేము మరోసారి చెబుతున్నాం. విరాట్ కోహ్లి ఎటువంటి విరుద్ధ ప్రయోజనాలు పొందటం లేదు. ఇతర ప్రయోజనాలు ఆశిస్తోన్న బయటి వ్యక్తులు మరోలా ఆలోచిస్తున్నారు. ఇటువంటి ఆరోపణలు చేయడానికి ముందు, వాస్తవాలు పరిశీలించుకోవాలని వారికి మరోసారి మనవి చేస్తున్నాను' అని బంటీ సజ్దే ఓ ప్రకటనలో పేర్కొన్నాడు