Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అప్పుడే వరల్డ్కప్ విజయం వరిస్తుంది
- మహిళల క్రికెట్ చీఫ్ సెలక్టర్ హేమలత కళ
న్యూఢిల్లీ : భారత మహిళల క్రికెట్ గత ఐదేండ్లలో అద్భుత పురోగతి సాధించింది. మెగా టోర్నీల్లో నిలకడగా రాణిస్తూ, ప్రపంచ అగ్రశ్రేణి జట్టుగా నిలిచే ప్రయత్నం చేసింది. 2017 వన్డే వరల్డ్కప్, 2020 టీ20 వరల్డ్కప్ ఫైనల్లోకి చేరటంతో పాటు 2018 టీ20 వరల్డ్కప్ సెమీఫైనల్లోకి ప్రవేశించింది. వరుసగా ఐసీసీ టోర్నీల్లో సెమీఫైనల్స్ హ్యాట్రిక్ సాధించింది. ఇది చిన్న విషయమేమీ కాదు. వరల్డ్కప్ విజయం ఇంకా అందని ద్రాక్షగా మిగిలినా.. మన అమ్మాయిలు నిలకడగా మెప్పించారు. వరల్డ్కప్ విజయానికి నిలకడతో పాటు ఒత్తిడిని జయించటం తెలియాలి. భారత మహిళల జట్టు ఇక్కడే వెనుబడిందని పదవీ కాలం ముగించుకోనున్న సీనియర్ సెలక్షన్ కమిటీ చైర్మన్ హేమలత కళ అభిప్రాయం వ్యక్తపరిచారు. భారత్కు 72 వన్డేలు, ఏడు టెస్టుల్లో ప్రాతినిథ్యం వహించిన హేమలత 2015లో సెలక్షన్ కమిటీలో సభ్యురాలిగా చేరారు, 2016లో చీఫ్ సెలక్టర్ అయ్యారు. హేమలత సెలక్టర్గా పనిచేసిన సమయంలోనే మహిళల జట్టు అద్వితీయ విజయాలు నమోదు చేయటం విశేషం. భారత మహిళల జట్టు పురోగతి, ఐసీసీ టోర్నీల్లో అంతిమ వైఫల్యం, ఇతర అంశాలపై హేమలత తన అభిప్రాయాలను పంచుకున్నారు.
ఒత్తిడిని ఓడించాలి : ఐసీసీ మెగా టోర్నీలు, అంతిమ సమరాల్లో ఆడగల సత్తా భారత జట్టు సొంతం. క్రికెటర్లు అందరూ అందుకు సిద్ధంగా ఉన్నారు. సీనియర్లు, జూనియర్ల మేళవింపుతో జట్టుగా పటిష్టంగా కనిపించినా.. బ్యాటింగ్ వైఫల్యాలు దెబ్బతీశాయి. బహుశా అమ్మాయిలు తీవ్ర ఒత్తిడిలో ఉన్నారు. 2017 వన్డే వరల్డ్కప్ ఫైనల్లో లక్ష్యం 229. భారత్ 191/3తో గెలుపు దిశగా సాగుతోంది. అసలు కంగారు పడే అవసరమే లేదు. అయినా అమ్మాయిలు ఒత్తిడిలో పడ్డారు. సెమీఫైనల్లో ఆస్ట్రేలియాను చిత్తు చేసిన జట్టు.. ఫైనల్లో గెలుపు ముంగిట ఒత్తిడికి లోనయ్యారు. ఇంగ్లాండ్, ఆస్ట్రేలియాలను నిలకడగా ఓడించే సత్తా మనకుంది. ఐసీసీ టోర్నీల్లో ఫైనల్స్కు వెళ్లటం తెలిసినా, అక్కడ ఒత్తిడి ప్రధాన పాత్ర పోషిస్తోంది. ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా జట్ల కంటే భారత్ 4-5 ఏండ్లు వెనుకంజలో ఉందనే వాదనను విశ్వసించను. ఆస్ట్రేలియాను 2017 సెమీఫైనల్లో, 2018 లీగ్ దశలో, 2020 లీగ్ దశలో సైతం ఓడించాం. భారత జట్టు చేయాల్సిందల్లా ఒక్కటే.. ఆ జట్ల మాదిరి ఒత్తిడిని జయించటం నేర్చుకోవాలి. బహుశా ఆ పని 2021 వన్డే వరల్డ్కప్లో మన అమ్మాయిలు చేస్తారని ఆశిస్తున్నానని హేమలత అన్నారు.
పేసర్లను తయారు చేయాలి : హర్మన్ప్రీత్ను మించిన నాయకురాలు మరొకరు లేరు. టీ20 జట్టుకు ఆమే నాయకత్వం వహించాలి. మిథాలీరాజ్ అనంతరం వన్డే పగ్గాలు అందుకోవాలి. ఇదే మా సెలక్షన్ కమిటీ ఆలోచన. భారత్ సుదీర్ఘంగా స్పిన్నర్లపైనే ఆధారపడుతోంది. ఈ పంథా మారాలి. మన దగ్గర పేసర్లు ఉన్నా జులన్ గోస్వామి, శిఖా పాండే స్థాయిని అందుకోలేకపోతున్నారు. భారత్-ఏ జట్ల మ్యాచులు ఆరంభం కానుండటంతో..పేసర్లను తయారు చేసేందుకు ఓ అవకాశం చిక్కనుంది. యువ షెఫాలీ వర్మ మాదిరి అందరినీ ఏకంగా వరల్డ్కప్లోనే ప్రయోగించలేమని హేమలత చెప్పారు.