Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పార్లమెంట్లోనూ ఇదే దుస్థితి :క్రీడాశాఖ మంత్రి కిరణ్ రిజుజు
న్యూఢిల్లీ : అనారోగ్యంతో బాధపడుతున్న తండ్రిని 1300 కిమీ దూరం సైకిల్ తొక్కుతూ ఇంటికి చేర్చిన జ్యోతి కుమారి, కంబాల జాకీ శ్రీనివాస గౌడ, రామేశ్వర్ గుర్జార్లు భారత్కు ఒలింపిక్స్లో స్వర్ణ పతకాలు సాధించగలరని సోషల్ మీడియాలో సంచలనం కావటం ఎంతో ఆశ్చర్యానికి గురి చేసిందని, నిజానికి మన ప్రజల్లో క్రీడలపై సరైన అవగాహన లేదని... ఆమాటకొస్తే పార్లమెంట్లో అదే దుస్థితి అని క్రీడాశాఖ మంత్రి కిరణ్ రిజుజు వ్యాఖ్యానించారు. ' భారతీయ సమాజంలో క్రీడలపై చాలా తక్కువ అవగాహన ఉంది. నా సహచరులను తక్కువ చేయటం నా ఉద్దేశం కాదు, కానీ పార్లమెంట్లోనూ క్రీడలపై పెద్దగా అవగాహన కనిపించదు. ప్రతి ఒక్కరికి క్రికెట్ తెలుసు. బ్రిటీష్ పాలకులు మన మెదళ్లలో క్రికెట్ను ఎక్కించారు. ఇంగ్లాండ్ క్రికెట్ ఆడుతుంది, మనం క్రికెట్లో వారిని ఓడించాలి. అంతకుమించి, ఎటువంటి అవగాహన లేదు. అందరికీ స్వర్ణ పతకాలు మాత్రం కావాలి. దుర్భర పరిస్థితుల నడుమ ఓ బాలిక తన తండ్రిని 1300 కిమీలు సైకిల్పై తీసుకెళ్లింది. మనసును కలిచివేసే సంఘటన అది. కానీ అందరూ ఆమె సైక్లింగ్లో భారత్కు బంగారు పతకాలు సాధించగలదని అన్నారు. అసలు సైక్లింగ్ ఫార్మాట్ ఎలా ఉంటుంది, ప్రమాణాలు ఏ విధంగా ఉంటాయనే సంగతి ఎవరికీ అక్కర్లేదు. కర్ణాటకలోనూ ఇదే పరిస్థితి. కంబాల జాకీ, ఎడ్లపోటీల్లో 100 మీటర్లు వేగంగా పరుగెత్తిన శ్రీనివాస్ను ఉసేన్ బోల్ట్తో పోల్చారు. వరల్డ్ క్లాస్ స్ప్రింటర్కు అతడు సరిపోడని చెప్పినా.. ప్రజలకు అది పట్టదు. మనం ప్రతిభను వెతికి పట్టుకోవాలి. కానీ ప్రజలకు ఎటువంటి అవగాహన లేదు, ఆ విషయం అర్థం చేసుకోరు' అని మంత్రి రిజుజు తెలిపారు.