Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గ్లైఫోసేట్ గడ్డిమందు వాడకంతో పంట నష్టం
- పలుజిల్లాల్లో పత్తి పంటలపై తీవ్ర ప్రభావం
- నిషేధం ఉన్నా రహస్య ప్రాంతాల నుంచి రవాణా
- గ్రామ పంచాయతీలతో పాటు రైతులకూ చేరుతున్న డబ్బాలు
- ఈ సీజన్లోనే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో
రూ.12 కోట్ల దందా
పర్యావరణంతో పాటు పంటలను నాశనం చేసే కలుపు మందు గుట్టుచప్పుడు కాకుండా రైతు దరి చేరుతున్నది. రహస్య ప్రాంతాలగుండా గ్రామాల్లోకి వెళ్లి పత్రహరితంగా ఉండాల్సిన మొక్కలను పాడు చేస్తున్నది. గ్లైఫోసేట్ మందు ప్రభావంతో ఏపుగా ఎదగాల్సిన మొక్కలు నాశనం చేస్తుండగా.. అన్నదాతల అమాయకత్వాన్ని ఆసరా చేసుకుని అమ్ముకుంటున్న వ్యాపారులు మాత్రం కోట్ల రూపాయల సొమ్ముచేసుకుంటున్నారు. ఈ మందును క్యాన్సర్ కారకంగా గుర్తించి ఎప్పుడో నిషేధించినా రాష్ట్రవ్యాప్తంగా విచ్చిలవిడిగా విక్రయిస్తూనే ఉన్నారు. కొన్ని గ్రామాల్లో పిచ్చిమొక్కల నివారణకు వ్యవసాయ అధికారులే అనుమతులిస్తుండగా.. అట్నుంచటే పంట పొలాల్లోకి వెళ్తున్నట్టు తెలుస్తున్నది.
నవతెలంగాణ-మొఫిసిల్ యంత్రాంగం
క్షేత్రస్థాయి వరకూ అధికారులు వెళ్లి అవగాహన కల్పించకపోవడంతో రైతులు వ్యాపారులు చెప్పిందే నమ్ముతున్నారు. సాగుకు అవసరమున్నా లేకపోయినా పంటల్ని, ప్రకృతిని నాశనం చేసే అనేక మందులను రైతులకు అంటగడుతున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పత్తి పంట ఎక్కువగా సాగుచేస్తుండటంతో గ్లైఫోసేట్ కలుపు మందు వినియోగం కూడా అధికంగానే ఉంది. గైసిల్ విత్తనాలు, గ్లైపోసెట్ గడ్డిమందును పక్కరాష్ట్రాలైన మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ నుంచి గుట్టుచప్పుడు కాకుండా తరలించి వ్యాపారులు అక్రమంగా నిల్వ చేసుకున్నారు. గైసిల్ విత్తనాలు కొనుగోలు చేసిన రైతులు తప్పనిసరిగా గ్లైపోసెట్ గడ్డిమందును వాడాల్సి ఉండటంతో భారీగా వసూలు చేస్తూ విక్రయిస్తున్నారు. కలుపు తీయడానికి కూలీలు దొరక్కపోవడం, ఖర్చు కూడా ఎక్కువ కావడంతో అనివార్యంగా వాటివైపు రైతులు ఆసక్తి చూపుతున్నారు. కంపెనీలు, వ్యాపారుల మాటలు నమ్మి పిచికారీ చేస్తుండగా.. ఏపుగా పెరగాల్సిన పంటలు గిటుకబారిపోతుండటంతో కొందరిలో ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ మందు ప్రభావం కలుపు మొక్కలపై 50శాతం మాత్రమే ఉంటుంది. కానీ పత్తి, ఆముదం, వరి పంటలపై ఎక్కువగా పడుతుంది. మోతాదుకు మించితే పంట చేలే ఎండిపోయే ప్రమాదం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని కల్వకుర్తి, తెలకపల్లి సహా పలు మండలాల్లో పత్తి పంటలో దీన్ని ఎక్కువగా వినియోగిస్తున్నట్టు తెలుస్తోంది. డబ్బాకు రెండింతల రేట్లు పెంచి రైతులను వ్యాపారులు నిలువు దోపిడీ చేస్తున్నారు.
సరిహద్దుల నుంచి.. నాటు పడవల్లో..
సరిహద్దు రాష్ట్రాల నుంచి గ్లైపోసేట్ గడ్డిమందును రాష్ట్రంలోకి అక్రమంగా తరలిస్తున్నారు. వానాకాలం సీజన్కు ముందే కుమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాకు తీసుకొచ్చి రహస్య ప్రాంతాల్లో నిల్వ చేసినట్టు తెలిసింది. దాదాపు 25 మండలాల్లో గ్లైఫోసేట్ వినియోగం అధికంగా ఉండగా.. ఈ ప్రాంతా ల్లోని ఫెర్టిలైజర్ వ్యాపారులు ఏపీలోని గుంటూరు, కృష్ణా, మహారాష్ట్రలోని చంద్రపూర్, గడ్చిరోలి జిల్లాల్లోని వ్యాపారు లకు అడ్వాన్స్ చెల్లించి మరీ తెప్పిస్తున్నట్టు తెలిసింది.
మహారాష్ట్రలో 20 లీటర్ల గ్లైఫోసేట్ గడ్డిమందు క్యాన్ రూ.5500కు లభిస్తుండగా, ఇక్కడ రూ. 10 వేల నుంచి రూ.11 వేలకు విక్రయిస్తున్నారు. మహారాష్ట్ర చంద్రపూర్ జిల్లా నుంచి ప్రాణహిత మీదుగా నాటు పడవల్లో, సిరొంచ జిల్లా నుంచి అధికారుల కండ్లు గప్పి మోటార్ సైకిళ్లు, ఆటోల్లో తీసుకొస్తున్నారు. నిజామాబాద్-జగ్దల్పూర్ జాతీయ రహదారిపై ప్రాణహిత నది బ్రిడ్జికి ఇరువైపులా పోలీస్ చెక్పోస్టులుండటంతో కాళేశ్వరం - మహారాష్ట్ర రహదారి గుండా తరలిస్తున్నారు. ఇంకొందరు మహారాష్ట్రలో తమకు తెలిసిన వారితో ఆర్డర్ పెట్టించుకుంటున్నారు. ఈ ఒక్క సీజన్లోనే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రూ. 10 నుంచి 12 కోట్ల నిషేధిత విత్తనాలు, గడ్డి మందు విక్రయాలు జరిగినట్టు సమాచారం. ప్రత్యేక నిఘాతో దాదాపు రూ.80 లక్షల సరుకును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
కొన్నిచోట్ల పాత స్టాక్..
నిషేధంలో ఉన్న గ్లైఫోసేట్కు త్వరలోనే మళ్లీ అనుమతులిస్తారని ఆశతో కొందరు వ్యాపారులు డబ్బాలను నిల్వ చేసినట్టు సమాచారం. కామారెడ్డి జిల్లాలోని కొన్ని ఫెస్టిసైడ్ షాపుల్లో పాత స్టాక్ అలాగే ఉంచేసినట్టు తెలిసింది.
వ్యవసాయ అధికారుల అనుమతితో గ్రామాల్లో పిచ్చిమొక్కల కోసం దీన్ని పిచికారీ చేస్తుండగా.. ఇదే అదనుగా రైతులకు కూడా అందజేస్తున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. పత్తి సాగు అధికంగా ఉన్న భూపాలపల్లి, ములుగు జిల్లాల్లోనూ రైతులు ఈ గడ్డిమందును విచ్చలవిడిగా వాడుతున్నట్టు తెలుస్తోంది. ఖమ్మం జిల్లాలోనూ ఇటీవల రూ.5.18లక్షల కలుపుమందు పట్టివేత, 1,112 లీటర్ల అక్రమ నిల్వలపై దాడులు చేసి పట్టుకున్నారు. బోనకల్, కొణిజర్ల, తిరుమలాయపాలెంలో ఇవి వెలుగుచూడగా చింతకాని మండలంలోని పలు గ్రామాల్లో గట్ల వెంబడి గ్లైఫోసేట్ గడ్డిమందు వినియోగించినట్టు ఆనవాళ్లు కనిపిస్తున్నాయి.
అక్టోబర్ వరకు నిషేధించాం : విజయనిర్మల, డీఏఓ ఖమ్మం
ఈ సంవత్సరం అక్టోబర్ వరకు గ్లైఫోసేట్ అమ్మకాలను నిషేధించాం. లైసెన్స్డ్ దుకాణాల్లో కలుపు మందు ఉన్నా వాటిని అమ్మడానికి వీల్లేదని ఆదేశాలు జారీ చేశాం. దీనిపై రైతులకు ఎప్పటికప్పుడు అవగాహన కల్పిస్తున్నాం. అమ్మకాలు జరగక ముందే పట్టుకోవడం వల్ల రైతులు ఎవరూ కొనలేదు. అధికారుల సూచన మేరకు రైతులు జాగ్రత్తలు తీసుకోవాలి.