Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-సాధారణ రోగులతోనే అనుమానితులు
-టెస్ట్ రిపోర్టులు వచ్చేదాకా ఒకేచోట..
- వైరస్ ముప్పు ఉన్నా బేఖాతర్.. కాసులు దండుకోవటానికే..
- చనిపోతున్న దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు
- దృష్టిపెట్టని సర్కార్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
కార్పొరేట్ దవాఖానాలు కరోనా వైరస్ ఉత్పత్తికి చిరునామాలుగా మారుతున్నాయి. వాప్తి చెంద డానికి కారణమవుతున్నాయి. పరీక్షల ఫలితాలు వస్తేనే ఏ వార్డులో ఉంచాలో నిర్ణయిస్తాం, అప్ప టిదాకా కరోనాతోపాటు సాధారణ రోగులూ ఒక్క చోటే ఉంచుతామని బడా ఆస్పత్రుల యాజమాన్యాలు తెగేసి చెబుతున్నాయి. ఈనేపథ్యంలో దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు కష్టాలు తప్పడం లేదు. ప్రాణాలనూ వదలాల్సి వస్తున్నది. ఇది ప్రయివేటు, కార్పొరేట్ ఆస్పత్రుల్లోని పరిస్థితి. దీంతో దినదినగండం నూరేళ్లాయుష్సులా సాధారణ రోగులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్థుల పరిస్థితి. దీంతో ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని ఆస్పత్రులకు వెళ్లాల్సి వస్తున్నది.
అత్యవసర వార్డుల్లో వైద్య సేవలు పొందేవారితో పాటే కరోనా అనుమానితులను ఉంచుతున్నారు. పాజిటివ్ అని తేలిన తర్వాత తీరిగ్గా వారిని ప్రత్యేక వార్డుకు తరలిస్తున్నారు. ఈ క్రమంలోనే ఎమర్జెన్సీ సేవలు పొందే ఇతర రోగాల వారికి కరోనా అంటుకుంటున్నది. అప్పటికే దీర్ఘకాలిక ఇబ్బందులతో బాధపడుతున్నవారు కరోనా సోకడంతో ప్రాణాలు కోల్పోతున్నారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వంతోపాటు వైద్యశాఖ ఉన్నతాధికారులూ దృష్టి పెట్ట డంలేదని ప్రజాసంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. కరోనా అనుమానితులను ఇక్కడ చేరుస్తున్నా రేంటి అంటే ఇది కరోనా సమయం...ఇక్కడ వైద్య సేవలు పొందాలను కుంటే ఉండండి...లేకపోతే వెళ్లిపోండి అంటూ కార్పొరేట్ ఆస్పత్రుల యాజమాన్యాలు మొహంమీదనే చెప్పేస్తున్నాయి. నల్లగొండ జిల్లాకు చెందిన సంతోష డయాలసిస్ రోగి. ఆమెను కుటుంబ సభ్యులు హయత్నగర్లోని ప్రయివేటు ఆస్పత్రిలో చేర్చారు. ఎమర్జెన్సీ వార్డులో చికిత్స పొందుతున్న క్రమంలో నాలుగైదు రోజుల తర్వాత ఆమెకు కరోనా సోకింది. గాంధీకి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి చనిపోయింది. చివరకు ఆమె మృతదేహానికి సొంత గ్రామానికి కూడా తీసుకురావడానికి ఊరోళ్లు అడ్డుచెప్పడంతో తల్లీదండ్రులు, ఆమె భర్త కలిసి హైదరాబాద్లోనే అంత్యక్రియలు చేశారు. మిగతా రోగాలతో బాధపడుతూ ఎమర్జెన్సీ వార్డుల్లో చికిత్సపొందుతున్న వారిపక్కనే కరోనా అనుమానితులను చేర్చడం వల్లనే ప్రాణసంకటంగా మారుతున్నదనే స్పష్టంగా అర్థమవుతున్నది. నల్లగొండ జిల్లాకు చెందిన మరో డయాలసిస్ పేషెంట్ ఓ ప్రయివేటు ఆస్పత్రిలో చికిత్స పొందగా అక్కడ అతనికీ కరోనా వచ్చింది. గాంధీలో చికిత్స పొందుతూ అతనూ పరిస్థితి చేయిదాటి మృతిచెందాడు.
నల్లగొండ జిల్లాకు చెందిన శంకరయ్యదీ అదేపరిస్థితి. వెలుగులోకి వచ్చిన ఘటనలు స్వల్పమే అయినప్పటికీ లెక్కలోకి రానివి చాలానే ఉంటాయని అంచనా. వీరంతా తమ దీర్ఘకాలిక వ్యాధులకు చికిత్స చేయించడానికి రాగా కరోనా సోకినవారే. ఉన్నరోగాన్ని తగ్గించుకుందామని వస్తే కొత్తగా కరోనా సోకుతుండటం ఆందోళన కలిగిస్తున్నది. ఇలాంటి అనుమానంతో చాలా మంది దీర్ఘకాలిక వ్యాధులున్నవారు ఆస్పత్రుల మెట్లు ఎక్కాలంటేనే జడుసుకుంటున్నారు. పాత రోగాలకు తోడు ఆస్పత్రికెళ్లి కొత్తరోగాలు తగిలించుకోవడమెంటుకు అనుకుంటూ నెట్టుకొచ్చే ప్రయత్నంలో ఉన్నారు.
మన్సురాబాద్కు చెందిన సంతోష్ చేతిపై ప్రమాదవశాత్తు గ్లాసు చేయిమీద పడటంతో మణికట్టు వద్ద నరం తెగింది. రాత్రి కావడంతో వెంటనే మలక్పేటలోని ఓ కార్పొరేట్ ఆస్పత్రికి వెళ్లగా ఎమర్జెన్సీ వార్డులో చేర్చారు. చుట్టూ కరోనా లక్షణాలతో ఇబ్బంది పడుతున్నవారు ఉండటంతో అతను హడలిపోయాడు. చేతికి గాయం ఏమోగానీ కరోనా వస్తే అమ్మో! అన్న భయం ఆయన్ను పట్టుకుంది. వెంటనే ఆస్పత్రి మార్చాలని కుటుంబ సభ్యులపై ఒత్తిడి తెచ్చాడు. వారూ భయాందోళనకు గురయ్యారు. ఆస్పత్రి యాజమాన్యానికి తనకు తెలిసిన వారితో ఫోన్ చేయించారు. 'ఇది కరోనా సమయం. మేం ఏం చేయలేం. కరోనా అనుమానితుల రిపోర్టు వచ్చే దాకా ప్రత్యేక వార్డులో చేర్చలేం. అందరితోపాటే వారినీ ఎమర్జెన్సీ వార్డులోనే ఉంచుతాం. కరోనా పాజిటివ్ అని తేలాకే మారుస్తాం. ఒకవేళ మీకు నచ్చకపోతే వేరే ఆస్పత్రికి వెళ్లిపోండి. త్వరగా చెబితే డాక్టర్లతో మాట్లాడి డిశ్చార్జి చేయిస్తాం' అని చెప్పేసింది. ఓవైపు రాత్రి పదకొండు గంటలు..మరోవైపు కరోనా అనుమానితుల మధ్య భయంభయంగా సంతోష్ ఏం చేయాలో పాలుపోని పరిస్థితి. అయినా అతను ఆస్పత్రి నుంచి వెళ్లిపోవడానికే మొగ్గుచూపాడు. ఆ కాస్త సమయానికి గానూ రూ.35 వేల బిల్లు కట్టి డిశ్చార్జి అయ్యాడు. ఆ తర్వాత సంతోశ్ దిల్సుఖ్నగర్లోని ఓ ప్రయవేటు ఆస్పత్రిలో చేరాడు. అక్కడ సర్జరీ చేశారు. రెండు రోజుల పాటు అదే ఆస్పత్రిలో ఉన్నాడు. అక్కడ సర్జరీకి, రెండు రోజులు పాటు స్పెషల్ రూమ్లో ఉన్నందుకుగానూ వేసిన బిల్లు రూ. 25 వేలు మాత్రమే. 'ఆస్పత్రిలో ఉన్న గంటన్నర పాటు కరోనా అనుమానితుల మధ్య ఉండటంతో భయమేసింది. ఎక్కడ తనకు సోకుతుందో ఆందోళనతోనే ఆస్పత్రి మారా ' అంటూ సంతోష్ ఆవేదన వ్యక్తం చేశాడు.
అందరికీ ఒకటే ఎమర్జెన్సీ వార్డంట...
ప్రభుత్వాస్పత్రుల్లో కరోనా అనుమానితులు, కరోనా రోగులకు ప్రత్యేకంగా వార్డులున్నాయి. ఇంతవరకు బాగానే ఉంది. లక్షలకు లక్షల బిల్లులు వేస్తున్న కార్పొరేట్ ఆస్పత్రులపై రాష్ట్ర ప్రభుత్వం కనీసం దృష్టిపెట్టకపోవడంతో అవి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి. పలు ప్రయివేటు, కార్పొరేట్ ఆస్పత్రుల్లో కరోనా లక్షణాలైన శ్వాసతీసుకోవడంలో ఇబ్బంది తలెత్తడం, ఆయాసం, తీవ్ర దగ్గు వంటి వాటితో ఇబ్బందిపడే వారిని అత్యవసర సేవల నిమిత్తం ఎమర్జెన్సీ వార్డులో చేర్చుతున్నారు. దీనిపై మిగతా రోగులు ప్రశ్నిస్తే కరోనా నిర్ధారణ కాని మేం ఎలా మారుస్తాం? అంటూ దాటవేయడం గమనార్హం. వాస్తవానికి కరోనా అనుమానితులకు కూడా ప్రయివేటు, కార్పొరేట్ ఆస్పత్రుల్లో ప్రత్యేక వార్డులు పెట్టి మరింత మందికి కరోనా సోకకుండా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటే బాగుంటుంది.