Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విచక్షణారహితంగా కొట్టిన భూతవైద్యుడు
- తాళలేక మహిళ మృతి
నవతెలంగాణ-శంకరపట్నం
దయ్యం పట్టిందంటూ అత్తింటివారు భూత వైద్యుడితో విచక్షణారహితంగా కొట్టించడంతో తట్టుకోలేక మహిళ ప్రాణం విడిచింది. అత్తింటి వారు ఓ భూత వైద్యున్ని పిలిపించగా.. తీవ్రంగా కొట్టిన ఘటన వీడియో ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే. బాధితురాలు సోమవారం రాత్రి కరీంనగర్లోని ప్రయివేటు ఆస్పత్రిలో మృతిచెందింది. మృతురాలి బంధువులు తెలిపిన వివరాల ప్రకారం..
కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం గద్దపాక గ్రామానికి చెందిన కనుకుంట్ల శారద- నర్సయ్య కుమార్తె రజిత(24). శారద-నర్సయ్యలు ఆరేండ్ల కిందట చనిపోయారు. రెండేండ్ల కిందట రజిత మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం కుందారం గ్రామానికి చెందిన మల్లేశ్ను ప్రేమ వివాహం చేసుకుంది. వీరికి రెండు నెలల కిందట కుమార్తె పుట్టింది. అయితే, రజితకు దెయ్యం పట్టిందని అత్తింటి వారు మంత్రగాన్ని తీసుకురాగా.. అతను ఆమెను చితకబాదాడు. స్పృహ కోల్పోయిన రజితను కరీంనగర్కు తరలించి ఓ ప్రయివేటు ఆస్పత్రిలో చేర్చారు. సోమవారం రాత్రి పరిస్థితి విషమించి మృతిచెందింది. అత్తింటివారు అందుబాటులో లేకుండా పోయారు. అనాథగా ఉన్న రజిత మృతదేహాన్ని పెద్దనాన్న కొమురయ్య, మేనత్త కుటుంబ సభ్యులు, బంధువులు స్వగ్రామంలోని గద్దపాకకు తీసుకెళ్లి మంగళవారం అంత్యక్రియలు నిర్వహించారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రీతం డిమాండ్ చేశారు.