Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తహసీల్దార్ వల్లే అఘాయిత్యం : మృతుని భార్య
నవతెలంగాణ-చిలిపీఛెడ్
పై అధికారుల ఒత్తిడి, మానసిక వేధింపుల వల్ల వీఆర్ఓ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మెదక్ జిల్లా చిలిపీఛెడ్ మండలంలో మంగళవారం జరిగింది. మృతుని భార్య సువర్ణ తెలిపిన వివరాల ప్రకారం..
చిలిపీఛెడ్ మండల పరిధిలోని చండూర్ గ్రామానికి చెందిన వీఆర్వో వెంకటేశం(48) గతేడాది అక్టోబర్ 22న చిలిపీఛెడ్ నుంచి బదిలీ మీద నర్సాపూర్కు వెళ్లారు. ఇక్కడ వెంకటేశం తుజాల్పూర్, తిరుమలపూర్ గ్రామాల విధులు నిర్వహించేవాడు. కొంతకాలంగా తహసీల్దార్కు వీఆర్వోకు మధ్య భేదాభిప్రాయాలు వచ్చాయి. మద్యం తాగి విధులు నిర్వహిస్తున్నాడని నాలుగునెలల కిందట అతనిపై తహసీల్దార్ సరెండర్ పెట్టారు. ఈ విషయమై వెంకటేశ్ మెదక్ కలెక్టర్ ఆఫీస్కు తిరిగినా పని కాలేదు. అంతేకాకుండా నర్సాపూర్ తహసీల్దార్ కార్యాలయంలో ఎల్పీసీ ఇవ్వకుండా కార్యాలయం చుట్టూ తిప్పుకున్నారు. నెల రోజుల కిందట చేగుంట మండలంలో విధులు నిర్వహించడానికి ఉత్తర్వులు రాగా విధుల్లో చేరాడు. కానీ, నర్సాపూర్ తహసీల్దార్ కార్యాలయంలో ఎల్పీసీ ఇవ్వ నందున వేతనం రాలేదు. ఆర్థిక ఇబ్బందులు ఎక్కువకావడంతో మనస్తాపానికి గురైన వెంకటేశం మంగళవారం ఇంట్లో ఉరేసుకున్నాడు. పై అధికారుల ఒత్తిడితోనే తన భర్త ఆత్మహత్య చేసుకున్నట్టు వీఆర్వో భార్య సువర్ణ ఆవేదన వ్యక్తం చేశారు. వారికి ఇద్దరు కుమారులున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఎస్ఐ మల్లారెడ్డి వివరాలు సేకరించి కేసు దర్యాప్తు చేపట్టారు.