Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-స్కీమ్ వర్కర్లకు రూ. 21 వేల వేతనం ఇవ్వాలి
- 7,8 తేదీల్లో జరిగే సమ్మె, 9న జైల్భరోను జయప్రదం చేయండి: ఎస్.రమ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహిస్తున్న మధ్యాహ్న భోజనం, ఎన్హెచ్ఎం, ఐసీడీఎస్, తదితర స్కీములను ప్రయివేటీకరించవద్దనీ, వాటికి బడ్జెట్ కేటాయించాలని శ్రామిక మహిళ రాష్ట్ర కన్వీనర్ ఎస్.రమ అన్నారు. హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో మంగళవారం మీడియాతో అమె మాట్లాడుతూ స్కీమ్ వర్కర్ల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 7,8 తేదీల్లో దేశవ్యాప్త సమ్మెలో భాగంగా ఏడో తేదీన గ్రామాల్లో, 8న మండల కేంద్రాల్లో అధికారులకు వినతిపత్రాలు ఇవ్వాలని కోరారు. 9వ తేదీన జరిగే జైల్భరో కార్యక్రమంలో స్కీమ్ వర్కర్లు పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు. స్కీమ్ వర్కర్లందరినీ కార్మికులుగా గుర్తించాలనీ, 45, 46వ ఇండియన్ లేబర్ కాన్ఫరెన్స్ సిఫారసులను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రతి ఒక్కరికీ రూ.21 వేల వేతనం ఇవ్వాలనీ, పెన్షన్ రూ.10 వేలు ఇవ్వడంతో పాటు ఈఎస్ఐ, పీఎఫ్ సౌకర్యం కల్పించాలని కోరారు. కరోనా నేపథ్యంలో పాఠశాలలు మూతపడ్డ నేపథ్యంలో మధ్యాహ్న భోజన కార్మికులందరికీ రూ.10 వేల చొప్పున ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఐకేపీ వీఓఏ యూనియన్ గౌరవాధ్యక్షులు జె.వెంకటేశ్ మాట్లాడుతూ నాలుగు నెలల పెండింగ్ వేతనాలను వీఓఏలకు చెల్లించాలని కోరారు. కార్మిక చట్టాల సవరణ, రద్దు, పనిగంటల పెంపును తక్షణమే ఆపాలని డిమాండ్ చేశారు. డ్యూటీలో కరోనా సోకిన స్కీమ్ వర్కర్లందరికీ నష్టపరిహారం కింద కనీసం రూ.10 లక్షలు చెల్లించాలనీ, ప్రతి ఒక్కరికీ రూ.50 లక్ష బీమా కల్పించాలని కోరారు.
అందరికీ ఆరోగ్య సదుపాయం, ఆహారం, విద్య అందేలా చట్టాన్ని రూపొందించాలని విజ్ఞప్తి చేశారు. జీడీపీలో ఆరోగ్య రంగంపై ఆరు శాతం బడ్జెట్ కేటాయించాలని కోరారు. ఆశా వర్కర్ల యూనియన్ రాష్ట్ర నాయకులు మీనా మాట్లాడుతూ నేషనల్ హెల్త్ మిషన్(ఎన్హెచ్ఎం) ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని కోరారు. ఆదాయ పన్ను చెల్లించని ప్రజలందరికీ ఉచితంగా కోవిడ్ పరీక్షలు చేయాలనీ, ప్రజారోగ్య విధానాన్ని బలోపేతం చేయాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతమున్న ఇన్సూరెన్స్ స్కీములు ప్రధానమంత్రి జీవన్జ్యోతి బీమా యోజన, ప్రధానమంత్రి సురక్షబీమా యోజన, అంగన్వాడీ కార్యకర్తల బీమాయోజనలను స్కీం వర్కర్లందరికీ వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. నేతలను పోలీసులు అడ్డుకున్నారు.
సున్నం రాజయ్య, వంగపండు మృతికి పీఎన్ఎమ్ నేతల సంతాపం
సీపీఐ(ఎం) మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్య, ప్రజాగాయకులు వంగపండు ప్రసాద్ మృతికి సంతాపం తెలుపుతున్నట్టు ప్రజానాట్యమండలి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కట్టనర్సింహ, సహాయ కార్యదర్శి కోటరమేశ్ మంగళవారం ఒక ప్రకటనలో సంతాపం తెలిపారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. రాజయ్య, వంగపండు మృతి వామపక్ష, ప్రజా ఉద్యమాలకు తీరని లోటు అన్నారు.