Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- క్షేత్రస్థాయి పర్యటనతో పంటల లెక్క :
: రైతు సమన్వయ సమితి రాష్ట్ర అధ్యక్షులు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి
నవతెలంగాణ-పరిగి రూరల్
రైతు వేదిక భవనాలను సెప్టెంబర్ 10 నాటికి పూర్తి చేసి, రైతులకు అందుబాటులోకి తీసుక రావాలని రైతు సమన్వయ సమితి రాష్ట్ర అధ్యక్షులు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి అన్నారు. మంగళవారం వికారాబాద్ జిల్లా పరిగి మండల పరిధిలోని గడిసింగపూర్, సాలీ పూలబాట, సోండేపూర్ తదితర గ్రామాల్లో ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డితో కలిసి పర్యటించారు. గడి సింగపూర్లో రైతు వేదిక నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. గ్రామంలో రైతులు, రైతుబంధు, పంటల నమోదు వివరాలను రైతులను అడిగి తెలుసుకున్నారు. నమోదు చేసిన రైతు పంట వివరాలను వ్యవసాయ పొలానికి వెళ్లి పరిశీలించారు. అనంతరం సాలిపూలబాట గ్రామంలో రైతులతో మాట్లాడారు. రైతులు కాస్తులో ఉన్నా, కొత్త పాస్ పుస్తకాలు రావడం లేదని ఆయన దృష్టికి తీసుకొచ్చారు.
సమస్య పరిష్కరించాలని రెవెన్యూ అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా రాజేశ్వర్రెడ్డి మాట్లాడుతూ.. క్షేత్రస్థాయిలో పర్యటన ద్వారానే వ్యవసాయ పంటల లెక్క పక్కాగా ఉంటుందన్నారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు క్షేత్రస్థాయిలో వివరాలు సేకరించి రైతుల సమస్యలు పరిష్కరించి, వ్యవసాయం ఒక పండుగగా మార్చేందుకు కృషి చేస్తున్నట్టు తెలిపారు. ఆయన వెంట జెడ్పీటీసీ హరిప్రియ ప్రవీణ్ రెడ్డి, పీఏసీఎస్ చైర్మెన్ శ్యామ్ సుందర్ రెడ్డి, వైస్ చైర్మెన్ భాస్కర్, ఏడీ వీరప్ప, తహసీల్దార్ విద్యాసాగర్రెడ్డి తదితరులు ఉన్నారు.