Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-పద్ధతి మార్చుకోకపోతే చర్యలు తప్పవు
- ఇది...డబ్బు సంపాదించుకునే టైం కాదు
- చనిపోయే ముందు ప్రభుత్వాస్పత్రులకు పంపుతారా?
- లక్షలు కడితేనే డెడ్ బాడీలు ఇస్తామనడం మానవత్వానికే కళంకం
- ప్రయివేటు ఆస్పత్రులపై మంత్రి ఈటల ఆగ్రహం
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ప్రయివేటు ఆస్పత్రులు పద్ధతి మార్చుకోకపోతే కఠిన చర్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ మరోసారి హెచ్చరించారు. నగరంలో మంగళవారం మీడియా తో ఆయన మాట్లాడారు. డబ్బు సంపాదించుకునేందుకు, ప్రజలను బ్లాక్ మెయిల్ చేసేందుకు ఇది సమయం కాదని హితవు పలికారు. సీరియస్గా ఉండి కదిలితే చనిపోయే స్థితిలో ఉన్న రోగులను చేర్చుకోకుండా ప్రభుత్వాస్పత్రులకు పంపడం దారుణమన్నారు. ప్రయివేటు ఆస్పత్రుల్లో చనిపోయిన రోగుల మతదేహాలను ఇచ్చేందుకు కూడా లక్షల రూపాయలు చెల్లించాలని కోరడం మానవ సమాజానికే కళంకమనీ, హీనమైన చర్యగా అభివర్ణించారు. వేలాది ఫిర్యాదులు వచ్చాయనీ, వాటిపై విచారిస్తున్నామనీ, ఒకట్రెండు రోజుల్లో మరో రెండు ఆస్పత్రులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రభుత్వం ఇచ్చిన అనుమతులను కొన్ని ప్రయివేటు ఆస్పత్రులు దుర్వినియోగం చేస్తున్నాయని చెప్పారు. ప్రయివేటు ఆస్పత్రుల కన్నా ప్రభుత్వాస్పత్రుల్లోనే మెరుగైన
చికిత్స అందుతుందన్నారు. ప్రభుత్వాస్పత్రుల్లో బెడ్లు, ఐసీయూ, వెంటిలేటర్లు, ఆక్సిజన్కు కొరతలేదన్నారు. ప్రభుత్వాస్పత్రులకు వెళితే చనిపోతారనే ప్రచారంలో వాస్తవం లేదన్నారు. కరోనా చికిత్సకు రూ.1000 అవుతుందనీ, పది రోజులు ఆక్సిజన్ పెట్టినా రూ.2500కు మించదన్నారు. అనుమానం ఉన్న వారు వెంటనే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో యాంటిజెన్ పరీక్షలు చేయించుకోవాలనీ, లక్షణాలున్న వారు ఆర్టీపీసీఆర్ పరీక్షల కోసం వెళ్లాలని సూచించారు. హితం యాప్ ద్వారా 70 మంది విశ్రాంత వైద్యుల ద్వారా సలహాలు ఇస్తున్నట్టు మంత్రి తెలిపారు. లక్షణాలు లేకుండా కేవలం అనుమానంతో పరీక్షలు చేయించుకునే వారితో అవసరమైన వారికి పరీక్షలు ఆలస్యమవుతున్నాయని చెప్పారు. రాష్ట్రంలో 15 వేల బెడ్లకు ఆక్సిజన్ సరఫరా చేస్తున్నామనీ, రోగం ముదిరిన తర్వాత అవి పెట్టినా ప్రయోజనం ఉండటం లేదన్నారు. ఆక్సిజన్ పెట్టినా ఊపిరితిత్తులు పూర్తిగా పాడైన తర్వాత ఆస్పత్రులకు వచ్చే వారికి ఉపయోగం ఉండడం లేదన్నారు. ఉస్మానియా ఆస్పత్రిలో ఆక్సిజన్ కొరత ఉందనడం సరికాదనీ, ఇప్పటికే ఉస్మానియా, గాంధీ ఆస్పత్రులతో పాటు చెస్ట్, నీలోఫర్ ఆస్పత్రుల్లో ఆక్సిజన్ లిక్విడ్ బ్యాంక్ సదుపాయాన్ని కల్పించామని చెప్పారు. గాంధీలో 1100 బెడ్లకు ఆక్సిజన్ అందుబాటులో ఉందన్నారు. తద్వారా 10 రోజుల వరకు ఆక్సిజన్ కొరత ఉండదన్నారు. గాంధీలో 550 చొప్పున ఐసీయూ, ఆక్సిజన్ సదుపాయం ఉన్న పడకలున్నాయనీ, మరో 350 బెడ్లను ఐసీయూలోకి మారుస్తున్నట్టు వెల్లడించారు. కేంద్రాన్ని 1400 వెంటిలేటర్లు కోరితే 900 వచ్చాయనీ, మిగిలినవి కూడా పంపిస్తారన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.
అన్ని కరోనా మరణాలు కాదు
ఆస్పత్రుల్లో చోటు చేసుకుంటున్న మరణాలన్ని కరోనా మరణాలు కాదని మంత్రి ఈటల అన్నారు. గాంధీ ఆస్పత్రికి ప్రతి రోజూ గుర్తు తెలియని శవాలు కూడా వచ్చి చేరుతుంటాయని చెప్పారు. ఇప్పటికీ ఆ ఆస్పత్రిలో మూత్రపిండాల రోగులకు డయాలసిస్ సేవలతో పాటు కోవిడ్-19 గర్భిణులకు ప్రసవాలు జరుగుతున్నాయని చెప్పారు. ప్లాస్మాథెరపీ అందరికీ చేయాల్సిన అవసరం లేదని మంత్రి తెలిపారు. థెరపీకి ఐసీఎంఆర్ కొన్ని నిబంధనలు, ఆంక్షలు విధించిందని చెప్పారు. ఆ నిబంధనల మేరకే ముందుకెళుతున్నామని చెప్పారు. జీహెచ్ఎంసీ పరిధిలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయన్నారు. 'క్లినికల్ ట్రయల్స్లో మూడు వ్యాక్సిన్లు'...click here