Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-గిట్టుబాటు ధర దక్కేలా చూడాలి
- వ్యవసాయాన్ని కార్పొరేట్లకు కట్టబెట్టి దేశాన్ని ఆగం చేయొద్దు
- రుణవిముక్తి చట్టం తేవాలి
- 9న జైల్భరోలో రైతులు భారీగా పాల్గొనాలి : అఖిల భారత రైతు పోరాట సమన్వయ కమిటీ కన్వీనర్ వీఎమ్సింగ్
మోడీ అబద్ధపు మాటలు నమ్మొద్దు.. : మేధా పాట్కర్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రైతులకు గిట్టుబాటు ధర ఇచ్చి వ్యవసాయాన్ని లాభసాటిగా చేసేలా కేంద్రం విధానాలు ఉండాలని అఖిల భారత రైతు పోరాట సమన్వయ కమిటీ కన్వీనర్ వీఎమ్సింగ్ అన్నారు. వ్యవసాయాన్ని కార్పొరేట్లకు కట్టబెట్టి దేశాన్ని ఆగం చేయొద్దనీ, వ్యవసాయ రంగంపై మోడీ సర్కారు తీసుకొచ్చి మూడు ఆర్డినెన్స్లను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆన్లైన్ వేదికగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన రైతు సంఘాల ఆధ్వర్యంలో హైదరాబాద్ నుంచి ఆన్లైన్ బహిరంగ సభ మంగళవారం నిర్వహించారు. ఈ సభలో వీఎమ్సింగ్ మాట్లాడుతూ రైతులకు సంబంధించిన తొమ్మిది డిమాండ్లతో ఈ నెల తొమ్మిదో తేదీన క్విట్ఇండియా డే సందర్భంగా చేపట్టే జైల్భరో కార్యక్రమంలో రైతులు పెద్దఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు. పట్టణాలే యువతకు మొత్తం ఉపాధి కల్పించడం సాధ్యకాదని నొక్కి చెప్పారు. వ్యవసాయాన్ని లాభసాటిగా చేస్తే యువత ఆ రంగం వైపు మొగ్గుచూపుతున్నదన్నారు. దీనివల్ల నిరుద్యోగ సమస్యకు కూడా కొంత పరిష్కారం దొరుకుతుందని అభిప్రాయపడ్డారు. వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్లకు కట్టబెట్టి చిన్న, సన్నకారు, కౌలు రైతుల పొట్ట కొట్టవద్దని కేంద్రానికి సూచించారు. పలు కారణాల వల్ల నష్టపోతున్న పారిశ్రామికవేత్తలను, ఇతర రంగాలను ఆదుకునేందుకు చట్టాలున్నాయనీ, అలాగే రైతులను ఆదుకునే చట్టాలను కూడా చేయాలని డిమాండ్ చేశారు.
సామాజిక వేత్త మేధాపాట్కర్ మాట్లాడుతూ నరేంద్ర మోడీ అబద్ధపు మాటలను, మోసపూరిత ప్యాకేజీలను ప్రజలు, రైతులు నమ్మొద్దని పిలుపునిచ్చారు. నర్మదా, పోలవరం ప్రాజెక్టుల పేరుతో గిరిజనులు, ఆదివాసీలను అడవుల నుంచి వెళ్లగొట్టడం దారుణమన్నారు. అటవీ హక్కుల చట్టం ప్రకారం పోడుభూములు సాగు చేసుకునే ఆదివాసీ, గిరిజన రైతులకు పట్టాలివ్వాలని డిమాండ్ చేశారు. హరితహారం పేరుతో పోడు భూములను లాక్కోవడం దారుణమన్నారు. కేంద్రం ఆర్డినెన్స్లకు వ్యతిరేకంగా ఉత్తరభారతంలో రైతులు పెద్దఎత్తున రోడ్లపైకి వస్తున్నారనీ, మహారాష్ట్రలోనూ ఏఐకేఎస్ పోరాటాలు విస్తృ తంగా జరుగుతున్నాయని వివరించారు. వాటి స్ఫూర్తితో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోనూ బలమైన రైతు పోరాటాలు చేపట్టి కనీస హక్కులు సాధించుకోవాలన్నారు.
ఏఐకేఎస్సీసీ కార్యవర్గ సభ్యులు ఆశీశ్ మిట్టల్ మాట్లాడుతూ కేంద్రం తీసుకొచ్చిన ఆర్డినెన్స్తో మార్కెట్లపై కార్పొరేట్లకు మరింత ఆధిపత్యం కల్పించిందన్నారు. చిన్న, సన్నకారు రైతులే దేశంలో 80 శాతం ఉంటారనీ, వారికి ఈ మార్కెట్ గురించి ఏమి తెలుస్తుందని ప్రశ్నించారు. ఎక్కువ ధర వచ్చే వరకు పంటను నిల్వ చేసుకునే ఏర్పాట్లు ఎక్కడ ఉన్నాయో చెప్పాలన్నారు. ప్రభుత్వాలే రైతులకు గిట్టుబాటు ధర ఇచ్చి పంటలను కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. విత్తనాలు, ఎరువులపై కార్పొరేట్ల ఆధిపత్యం పెరిగిపోతున్నదనీ, పంట పండకపోయినా ఆ కంపెనీలు ఎలాంటి బాధ్యత వహించయని తెలిపారు. తాము చెప్పిన పంటలనే పండించాలనే పాలకుల ఒత్తిడి వెనుక విదేశీ కార్పొరేట్ల హస్తం ఉందని విమర్శించారు. అభివృద్ధి చెందిన దేశాల్లో వాణిజ్యపంటలు పండే వాతావరణం సరిగా ఉండదనీ, సమశీతల దేశమైన ఇండియాలో అన్ని రకాల పంటలు పండే అవకాశం ఉందని వివరించారు. విద్యుత్ సంస్కరణ వల్ల కరెంటు బిల్లులు విపరీతంగా పెరుగుతాయనీ, దీని ప్రభావం రైతులపైనే ఎక్కువ పడుతుందని వివరించారు. కేంద్ర ఆర్డినెన్స్ల వెనుక రైతులను వ్యవసాయానికి దూరం చేసి కార్పొరేట్లకు కట్టబెట్టే కుట్ర ఉందని విమర్శించారు.
ఏఐకేఎస్సీసీ కార్యవర్గసభ్యులు వేములపల్లి వెంకట్రామయ్య మాట్లాడుతూ..మద్దతు ధరల నిర్ణయంలో ఉన్న 23 రకాల లోపాలను సవరించాలని డిమాండ్ చేశారు. రైతు పంటకు పెట్టే ఖర్చుకంటే 50 శాతం మద్దతు ధర తక్కువగా ఉందనీ, క్వింటాల్ వరి ధాన్యానికి 1880, పత్తికి 3900 చొప్పున నష్టపోతున్నారని ఉదాహరణలతో వివరించారు. కనీస మద్దతు ధరలు లేకపోవడం వల్ల రైతులు ప్రతి ఏటా రైతులు 2,64,000 వేల కోట్లు నష్టపోతున్నారని వాపోయారు. స్వామినాథన్ కమిటీ సిఫారసులను అమలు చేస్తున్నామని మోడీ సర్కారు పచ్చి అబద్ధాలు చెబుతున్నదని విమర్శించారు.
తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.సాగర్ మాట్లాడుతూ వాస్తవ సాగుదారులైన కౌలు రైతులకు రైతు బంధు వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. వ్యవసాయ కూలీలు, వ్యవసాయ పనులు చేసే మహిళలు, కౌలుచేసేవాళ్లను కూడా రైతులుగా గుర్తించాల న్నారు. కౌలు రైతులను అసలు రైతులుగానే గుర్తించబోమని సీఎం కేసీఆర్ మాట్లాడటం సబబు కాదనీ, ఆ మాటలను ఉపసం హరించుకోవాలని కోరారు. వ్యవసాయ సీజన్ ప్రారంభమై రెండు నెలలు దాటుతున్నా 30 శాతం రుణాలు కూడా రైతులకు ఇవ్వలేదని విమర్శించారు. రైతులకు లక్ష రూపాయల రుణమాఫీ విడతల వారీగా కాకుండా ఒకేసారి చేయాలన్నారు. ప్రభుత్వం బ్యాంకులకు రుణమాఫీ నిధుల విడుదల చేయకపోవడం వల్ల రైతులకు బ్యాంకుల్లో రుణాలు ఇవ్వని పరిస్థితి నెలకొందన్నారు. పోడు సాగుదారులకు పట్టాలివ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐకేఎస్సీసీ రాష్ట్ర కన్వీనర్ పశ్యపద్మ, నాయకులు విస్సా కిరణ్, జమలయ్య, కేశవరావు, ఉపేందర్రెడ్డి, అచ్యుత రామారావు, చంద్రశేఖర్, కన్నెగంటి రవి, సాయన్న, ధరంపాల్, కె.శ్రీనివాస్, కోటిరెడ్డి, తదితరులు మాట్లాడారు.