Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్రం తెచ్చిన 3 ఆర్డినెన్స్లను వ్యతిరేకించాలి : ఏఐకేఎస్సీసీ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రబీలో రైతులకు కరోనా వల్ల తీవ్ర నష్టం వాటిల్లిందనీ, రైతాంగాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని ఏఐకేఎస్సీసీ కోరింది. వ్యవసాయ రంగాన్ని కార్పొరేటీకరణలో భాగంగా కేంద్రం తీసుకొచ్చిన మూడు ఆర్డినెన్స్లను వ్యతిరేకించాలనీ, అసెంబ్లీలో తీర్మానం చేయాలని డిమాండ్ చేసింది. ఈ మేరకు ఏఐకేఎస్సీసీ రాష్ట్ర కన్వీనర్ పశ్యపద్మ, రైతు సంఘాల నేతలు తీగల సాగర్, కన్నెగంటి రవి, అచ్యుతరామారావు, రాయల చంద్రశేఖర్, పల్లపు ఉపేందర్రెడ్డి, తదితరులు సీఎం కేసీఆర్కు లేఖను బుధవారం రాశారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. రుణమాఫీ ఒకే దఫాలో రద్దు చేయాలని డిమాండ్ చేశారు. బీమా పథకం కౌలు రైతులు, వ్యవసాయ కూలీలకూ వర్తింపచేయాలని కోరారు. కౌలు రైతులకు గుర్తింపు కార్డులిచ్చి పంట రుణాలివ్వాలని డిమాండ్ చేశారు. వ్యవసాయ అనుబంధ రంగాలకు చెందిన కుటుంబాలను కూడా ఆదుకోవాలని రాష్ట్ర సర్కారుకు విన్నవించారు. పోడు భూముల్లో హరితహారం పేరిట మొక్కలు నాటడాన్ని ఆపేయాలనీ, అటవీ హక్కుల చట్టం ప్రకారం వారికి హక్కు పత్రాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో సమగ్ర భూ సర్వే వెంటనే చేపట్టాలని సూచించారు