Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రయివేటుకు పోవాల్సిన అవసరం లేదు..
- రాష్ట్ర మంత్రివర్గంలో నిర్ణయం
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
కరోనా వైరస్ సోకితే ప్రయివేటు ఆస్పత్రులకు పోవాల్సిన పని లేదని రాష్ట్ర మంత్రివర్గం స్పష్టం చేసింది. ప్రభుత్వ దవాఖానాల్లో అన్ని వసతులు, మందులను అందుబాటులో ఉంచామని తెలిపింది. కరోనా వ్యాప్తి, వైరస్ సోకిన వారికి అందుతున్న చికిత్స, ప్రభుత్వ వైద్యాన్ని మరింత పటిష్టం చేసే అంశాలపై మంత్రివర్గంలో విస్తతంగా చర్చించారు. ఈ విషయాలపై క్యాబినెట్ దాదాపు రెండున్నర గంటల పాటు నిపుణులు, వైద్యులతో చర్చించింది. వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి, కమిషనర్, వివిధ విభాగాధిపతులను సమావేశానికి ఆహ్వానించి చర్చించారు. ఈ సందర్భంగా వైద్యాధికారులు కరోనా పరిస్థితిపై వివరాలు అందించారు.
'ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలకు పాకిన కరోనా ప్రస్తుతం పెద్ద నగరాల్లో తగ్గుముఖం పట్టింది. హైదరాబాద్లోనూ కేసులు తగ్గుతున్నాయి. తెలంగాణలో మరణాలు రేటు తక్కువగానూ, కోలుకుంటున్న వారి రేటు ఎక్కువగానూ నమోదవుతున్నది. కాబట్టి ప్రజలు పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు..' అని వైద్య నిపుణులు క్యాబినెట్కు వివరించారు. ప్రజలు పెద్దగా ఆందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని మంత్రివర్గం సూచించింది. ఈ సందర్బంగా ప్రభుత్వం పలు నిర్ణయాలు తీసుకున్నది.
కరోనా కట్టడికి నిర్ణయాలు...
రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో రెమ్ డెసివిర్, లోమాలిక్యులర్ వెయిట్ హెపారిన్, డెక్సామిథజోన్ ఇంజక్షన్లు, ఫావిపిరావిర్ టాబ్లెట్లు, ఇతర మందులు, పీపీఈ కిట్లు, టెస్ట్ కిట్లు లక్షల సంఖ్యలో అందుబాటులోకి తేవాలని నిర్ణయించింది.
-పరీక్షలో పాజిటివ్ వచ్చినట్టు తేలగానే వారికి వెంటనే హౌమ్ ఐసోలేషన్ కిట్లు ఇవ్వాలనీ, 10 లక్షల కిట్లు సిద్ధంగా ఉంచాలని నిర్ణయించింది.
-ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఎక్కడైనా సిబ్బంది కొరత ఉంటే తాత్కాలిక పద్ధతిలో నియమించే అధికారాన్ని కలెక్టర్లకు ఇచ్చింది.
-రాష్ట్ర వ్యాప్తంగా 10 వేల ఆక్సిజన్ బెడ్లను సిద్ధంగా ఉంచాలని నిర్ణయించింది.
-తకోవిడ్ రోగులకు చికిత్స అందించే విషయంలో అవకతవకలకు పాల్పడే ప్రయివేటు ఆసుపత్రుల విషయంలో కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించింది.
-ఇటీవల ప్రభుత్వం విడుదల చేసిన వందకోట్లకు అదనంగా మరో వంద కోట్లను విడుదల చేసింది. వైద్య ఆరోగ్య శాఖ నిధులను నెల వారీగా ఖచ్చితంగా విడుదల చేయాలి.
-ప్రయివేటు మెడికల్ కాలేజీల్లో ఉచితంగా వైద్య సేవలు అందిస్తున్నందున వారికి కావాల్సిన మందులు, ఇంజక్షన్లు, భోజనాలు ఖర్చులు ప్రభుత్వం భరించాలని నిర్ణయించింది.
-ప్రతీ రోజూ 40వేల వరకు పరీక్షలు నిర్వహించాలని అధికారులను ఆదేశించింది.
-మంత్రి ఈటల రాజేందర్, సీఎస్ సోమేశ్ కుమార్ గురువారం కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిం చనున్నారు.