Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పార్టీ భవనానికి అదనపు భూమి ఆక్రమణ
- కేటాయించింది ఎకరం- కబ్జా మరో అర ఎకరం
- ఆ భూమి విలువ రూ.3.63 కోట్లు
- జనగామలో ప్రహరీ నిర్మాణం
నవతెలంగాణ-వరంగల్ ప్రాంతీయ ప్రతినిధి
కంచె చేను మేసినట్టుంది టీఆర్ఎస్ పరిస్థితి. అధికారం చేతిలో ఉంటే ఏదైనా చేయొచ్చు అన్నట్టు వ్యవహరిస్తున్నారు ఆ పార్టీ నాయకులు. జనగామలో పార్టీ కార్యాలయ నిర్మాణానికి అధికారులు కేటాయించింది ఎకరం అయితే.. అదనంగా మరో అరెకరం కబ్జా పెట్టేశారు. దాని చుట్టూ ప్రహరీ నిర్మాణం చేస్తుండ్రు. దీని విలువ సుమారు రూ.3.63కోట్లు కావడం విశేషం.
రాష్ట్ర వ్యాప్తంగా 24 జిల్లాల్లో పార్టీ కార్యాలయాల నిర్మాణం చేయాలని టీఆర్ఎస్ నిర్ణయించగా.. అందుకు భూమి కేటాయింపునకు ప్రభుత్వం 21 జూన్ 2019లో జీఓ 66ను విడుదల చేసింది. అంతకు ముందే జనగామ జిల్లా పార్టీ కార్యాలయ నిర్మాణం కోసం 2019 మే ఒకటిన నియోజకవర్గ కో-ఆర్డినేటర్, ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి బావమర్ది కలెక్టర్కు లేఖ ఇచ్చారు. అదే రోజు అప్పటి కలెక్టర్ టి.వినరుకృష్ణారెడ్డి ఆర్డీఓకు రెఫర్ చేశారు. 2019 మే రెండో తేదీన భూమిని కేటాయించాల్సిందిగా తహసీల్దార్ను ఆదేశించారు. మూడో తేదీన వీఆర్వోకు లేఖ చేరింది. 2019 జూన్ 22న యశ్వంతాపూర్ వద్ద సర్వే నెంబర్ 82/15/1లో గుంట, 82/16/1లో 17 గుంటలు, 82/17/1లో 22 గుంటలు గుర్తించి జనగామ తహసీల్దార్ పంచనామ చేశారు. గజానికి వంద రూపాయల చొప్పున కేటాయించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సంతకం చేసిన రూ.4లక్షల 84వేల చెక్కును 2019 ఆగస్టు 8న జిల్లా కలెక్టర్కు అందజేశారు. రెండ్రోజుల్లో భూమి కేటాయింపు జరిగిపోయింది. కేటాయించిన ఎకరం స్థలంలోనే టీఆర్ఎస్ పార్టీ భవన నిర్మాణం చేయగా, దాని ముందు మరో 20 గుంటల భూమి హన్మకొండ-హైదరాబాద్ జాతీయ రహదారిని ఆనుకొని ఉంది. ఆ స్థలాన్ని టీఎన్జీవో భవనం కోసం కేటాయించాలని ఆ సంఘం ప్రతినిధులు అధికారులను కోరగా, టీఆర్ఎస్ పెద్దలు అడ్డుకున్నట్టు అప్పట్లో విమర్శలొచ్చాయి. తర్వాత ఆ స్థలాన్నీ కలుపుకుని పార్టీ భవనం చుట్టూ ప్రహరీ నిర్మాణం చేశారు. దాంతో మొత్తం 1.20 ఎకరాల పరిధిలో నిర్మాణాలు చేస్తున్నారు. అసలు అధికారులు కేటాయించిన ఆ భూమే చాలా విలువైంది. హన్మకొండ-హైదరాబాద్ జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న భూమి గజానికి రూ.15వేలకు పైగా పలుకుతోంది. ఎకరం రూ.7కోట్ల26లక్షలు. దాన్ని వంద రూపాయలకు గజం చొప్పున కేటాయించాలని అధికారికంగా ఆదేశాలు వచ్చిన నేపథ్యంలో రూ.4లక్షల 84వేలు చెల్లించారు. ఇప్పుడు అధికారులకు ఎలాంటి సమాచారమూ లేకుండా అర ఎకరం కబ్జా చేస్తుండ్రు. దీని మార్కెట్ విలువ రూ.3కోట్ల 63లక్షలు. పేదల గూడు కోసం 60 గజాల స్థలం ఇవ్వాలని నెత్తీనోరు కొట్టుకుని మొత్తుకున్నా ఇవ్వడం లేదు. ప్రభుత్వ భూమి లేదంటూ దాటేస్తున్నారు. చివరకు టీఎన్జీఓ బిల్డింగ్కూ ఇవ్వలేదు. కానీ, టీఆర్ఎస్ భవనానికి కబ్జా చేయడంపై పెద్దఎత్తున విమర్శలొస్తున్నా పట్టించుకోవడం లేదు.
ఒక ఎకరమే కేటాయించాం : రమేష్, తహసీల్దార్
టీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయానికి ఎకరం స్థలం మాత్రమే కేటాయించాం. అదనంగా భూమి ఇవ్వాలని ఎలాంటి దరఖాస్తూ ఇవ్వలేదు. ప్రభుత్వ జీవో ప్రకారం డబ్బులు చెల్లించినంత మేరకు తాము భూమి కేటాయించాం. ఆ భూమికి హద్దులు కూడా పెట్టాం. అదనంగా కబ్జా చేస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుని స్వాధీనం చేసుకుంటాం.