Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆస్పత్రుల భూములను ఎందుకు స్వాధీనం చేసుకోరు : హైకోర్టు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ప్రభుత్వం నుంచి అనేక రాయితీలు పొందిన కార్పొరేట్ ఆస్పత్రులు కరోనా లాంటి విపత్తు సమయంలోనూ నిబంధనలు పాటించకుండా భారీగా ఫీజులు వసూలు చేయడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ ఆస్పత్రులపై చర్యలు తీసుకోవడమే ఉత్తమమం అని చెప్పింది. ప్రభుత్వం విధించిన షరతులు ఉల్లంఘిస్తే ఆ ఆస్పత్రులకు ఇచ్చిన భూములను ఎందుకు వెనక్కి తీసుకోవడం లేదని ప్రభుత్వాన్ని ధర్మాసనం ప్రశ్నించింది. అధిక బిల్లులు చెల్లించకపోతే
మృతదేహాలను కూడా అప్పగించకపోవడంపై విస్మయం వ్యక్తం చేసింది. ప్రభుత్వం నిర్ధేశించిన ధరల కంటే ఎక్కువగా కరోనా బాధితుల నుంచి అధిక చార్జీలు వసూలు చేస్తున్న ప్రయివేటు ఆస్పత్రులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. 1981లో 30 ఎకరాలను అపోలో అస్పత్రి యాజమాన్యం తీసుకున్నప్పుడు 15 శాతం బెడ్స్ పేదలకు కేటాయిస్తామని చెప్పిందనీ, 1990లో బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రికి 7.37 ఎకరాలను 30 ఏండ్లకు లీజుకు తీసుకున్నప్పుడు 25 శాతం బెడ్స్ పేదలకు ఇస్తామని చెప్పిందనీ, ఆ భూలావాదేవీల ఒప్పందాన్ని ఉల్లంఘిస్తున్నాయని సామాజిక కార్యకర్త ఓ.ఎం. దేబరా
పిల్ దాఖలు చేశారు. దీనిని బుధవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్ విజరుసేన్రెడ్డిలతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. కరోనా మహమ్మారి తీవ్ర ప్రభావం చూపుతుంటే భూమి తీసుకున్నప్పుడు చేసుకున్న ఒప్పందాన్ని ఉల్లంఘించిన ఆయా ఆస్పత్రుల నుంచి భూముల్ని వెనక్కి తీసుకుంటే తప్పేమని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. భూముల్ని వెనక్కి తీసుకునే వ్యవహారంపై ప్రభుత్వం తన వాదనను తెలియజేయాలనీ, దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. డబ్బు కోసం డెడ్ బాడీలను కూడా ఇవ్వడం లేదని ఈరోజు కూడా పేపర్లల్లో వార్తలు చూశామనీ, ఇలాంటి ఆస్పత్రులపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పింది. అపోలోకు ఇచ్చిన 30 ఎకరాల విలువ రూ.1500 కోట్లు, బసవ తారకం ఆస్పత్రికి లీజుకు ఇచ్చిన భూమి విలువ రూ.400 కోట్లు ఉంటుందని, ఇలాంటి ఆస్పత్రుల్లో 50 శాతం బెడ్స్ పేదలకు ఇచ్చేలా ఉత్తర్వులు ఇవ్వాలని పిటిషనర్ లాయర్ గండ్ర మోహన్రావ్ వాదించారు. ప్రభుత్వానికి ఇతర ప్రతివాదులకు నోటీసులు ఇచ్చిన హైకోర్టు కరోనాపై ఉన్న ఇతర పిల్స్తో దీనిని కూడా జత చేసి 13న విచారిస్తామని తెలిపింది.