Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఒక కుటుంబంపై మరో కుటుంబం దాడి
నవతెలంగాణ- చౌటుప్పల్ రూరల్
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం తూప్రాన్పేటలో పాత కక్షలు భగ్గుమన్నాయి. ఒక కుటుంబంపై మరో కుటుంబం మూకుమ్మడిగా దాడికి దిగింది. ఈ దాడిలో ఒకరు ప్రాణం కోల్పోయారు. ఇద్దరికి గాయాలయ్యాయి. కారు, బైక్కు నిప్పు పెట్టారు. పోలీసులు, గ్రామస్థుల వివరాల ప్రకారం..
తూప్రాన్పేట గ్రామానికి చెందిన దండుగుల యాదగిరి, ద్యారంగుల నర్సింహా కుటుంబాల మధ్య రెండేండ్లుగా గొడవలు జరుగుతున్నాయి. గతంలో యాదగిరి తల్లి ఎల్లమ్మ సర్పంచిగా పోటీ చేసి ఓడిపోయారు. నర్సింహా కుటుంబం ఓట్లు వేయకపోవడం వల్లే ఓటమి చెందామనే అనుమానంతో యాదగిరి కుటుంబం కక్ష పెంచుకుంది. ఈ విషయంపై పలుమార్లు ఘర్షణలు జరిగాయి. పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నారు. విచారణ చేసిన పోలీసులు యాదగిరి కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేశారు.శుక్రవారం సాయంత్రం ఇరు కుటుంబాల మధ్య మరోసారి గొడవ జరిగింది. దండుగుల యాదగిరితోపాటు ఆయన ఇద్దరు చిన్నాన్నలు, వారి కొడుకులు కలిసి నర్సింహా కుటుంబంపై దాడి చేశారు. దాంతో నర్సింహా కుటుంబీకుల బంధువైన అబ్దుల్లాపూర్మెట్ మండలం కొత్తగూడెంలో నివాసముంటున్న వెంకటేష్(45)కు సమాచారం అందించారు. వెంటనే వెంకటేష్ తన భార్యతో కలిసి బైక్పై తూప్రాన్పేటకు వచ్చాడు. ఆయన గ్రామంలోకి చేరుకోగానే దండిగుల యాదగిరి, రమేష్, దేవేందర్, వెంకటేష్తోపాటు తండ్రి చిన్న నర్సింహా ఒక్కసారిగా వెంకటేష్పై ఇనుపరాడ్లు, కర్రలతో దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన వెంకటేష్ను ఆస్పత్రికి తీసుకుపోతుండగా మృతిచెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చౌటుప్పల్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కోపోద్రిక్తులైన మతుడి కుటుంబ సభ్యులు యాదగిరితో పాటు మిగతా వారి ఇండ్లపై శుక్రవారం రాత్రి దాడి చేశారు. ఇల్లు, కారు, బైక్లకు నిప్పు పెట్టారు. దీంతో గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. చౌటుప్పల్ పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.
అన్నను చంపిన తమ్ముడు
కేసముద్రం రూరల్ : తమ్ముడి చేతిలో అన్న దారుణ హత్యకు గురయ్యాడు. ఈ ఘటన శనివారం మహబూ బాబాద్ జిల్లా కేసముద్రం మండలంలో జరిగింది. స్థానికులు, ఎస్ఐ సతీశ్గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం.. కేసముద్రం గ్రామానికి చెందిన ఎలగలబోయిన వెంకన్న(50), చంద్రయ్య అన్నదమ్ములు. వీరి మధ్య కొంతకాలంగా భూ వివాదం జరుగుతోంది. ఇదే విషయంపై శనివారం కూడా ఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది. దీంతో తమ్ముడైన చంద్రయ్య, అతని కుమారులు రాజశేఖర్, పవన్ కలిసి వెంకన్నపై పారతో దాడి చేయగా తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే అంబులెన్సులో వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు.