Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 'గాల్వాన్ ఘటన'పై పెరుగుతున్న అనుమానాలు
- రక్షణ శాఖ విడుదలచేసిన పత్రంపై జాతీయ మీడియాలో కథనాలు
న్యూఢిల్లీ: గాల్వాన్ ఘటనపై నిజాలు బయటకు రావటం లేదని కాంగ్రెస్ నాయకుడు రాహుల్గాంధీ సహా పలువురు ప్రతిపక్ష నాయకులు విమర్శిస్తున్నారు. భారత్ భూభాగంలోకి చైనా బలగాలు చొచ్చుకొచ్చాయని కొద్దిరోజుల క్రితం రక్షణశాఖ వెబ్సైట్లో పేర్కొనటం అందరికీ తెలిసిందే. ఇది కాస్తా మీడియాలో సంచలనం సృష్టించటంతో కొద్ది గంటల వ్యవధిలో వెబ్సైట్ నుంచి రక్షణ శాఖ సమాచారాన్ని తొలగించింది. దీనిపై ఇండియన్ ఎక్స్ప్రెస్, ఎన్డీటీవీ, టైమ్స్ ఆఫ్ ఇండియా...మొదలైన ప్రముఖ ఆంగ్ల దినపత్రికలన్నీ ప్రచురించిన వార్తా కథనాలు రాజకీయంగా చర్చనీయాంశమయ్యాయి.
ఈ నేపథ్యంలో జూన్ 19న గాల్వాన్ ఘటనపై ప్రధాని మోడీ దేశ ప్రజలకు తెలిపినదానికి, రక్షణశాఖ ప్రకటనకు పొంతన కుదరటం లేదు. దాంతో ప్రతిపక్షాలు మోడీ సర్కార్పై తీవ్రంగా మండిపడ్డాయి. ప్రధాని మోడీ దేశ ప్రజలకు అబద్ధాలు చెబుతున్నారని రాహుల్గాంధీ ఆరోపించారు. ట్విట్టర్, ఫేస్బుక్..సామాజిక మాధ్యమాల్లో పలువురు మోడీ తీరును తప్పుబడుతున్నారు.
దేశాన్ని మోడీ సర్కార్ తప్పుదోవ పట్టిస్తున్నదని సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి విమర్శించారు. ఇది చాలా సీరియస్ అంశం, మోడీ సర్కార్ ఏదో దాచాలని ప్రయత్నిస్తున్నదని, రక్షణ శాఖ వెబ్సైట్లో కీలక సమాచారం తొలగించటం అనుమానాల్ని పెంచిందని ఏచూరి ట్విట్టర్లో పేర్కొన్నారు. గాల్వాన్ లోయ వద్ద చైనా-భారత్ సైనిక బలగాలకు మధ్య జరిగిన ఘర్షణలో 20మందికిపైగా జవాన్లు మరణించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై జూన్ 19న ప్రధాని మోడీ, అఖిలపక్ష సమావేశంలో మాట్లాడుతూ, చైనా బలగాలు మన భూభాగంలో అడుగుపెట్టలేదు..అని తెలిపారు. అటు తర్వాత వివిధ వర్గాల నుంచి వస్తున్న సమాచారం ప్రధాని మోడీ ప్రకటనకు విరుద్ధంగా ఉన్నాయి. ఇప్పుడు తాజాగా రక్షణశాఖ వెబ్సైట్ విడుదల చేసిన సమాచారమూ ప్రధాని ప్రకటన అబద్ధమని తేల్చింది. దాంతో ప్రధాని మాటలు అటు ప్రతిపక్షాలనుగానీ, ఇటు దేశ ప్రజల్ని సంతృప్తి పర్చలేకపోయాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.