Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కరోనా కట్టడిలో ప్రభుత్వాల వైఫల్యం
- సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ
నవతెలంగాణ- వరంగల్
దేశాన్ని హిందూ దేశంగా మార్చేందుకు మోడీ కుట్ర పన్నుతున్నారని, ఆయన దేశంలోని 130 కోట్ల మందికి ప్రధాని అన్న విషయం మర్చిపోతున్నారని సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె.నారాయణ అన్నారు. సోమవారం హన్మకొండలోని సీపీఐ జిల్లా కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కోవిడ్-19తో దేశం అల్లాడుతుంటే.. ప్రజలను ఆదుకోవడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని విమర్శించారు. దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థకు భిన్నంగా ప్రధాని మోడీ వ్యవహరిస్తున్నారన్నారు. ఆగస్టు 5న అయోధ్యలో రామమందిర నిర్మాణానికి ఆర్ఎస్ఎస్ లాంటి మతసంస్థతో కలిసి శంకుస్థాపన చేయడం సరికాదన్నారు. మోడీ చర్యలకు నిరసనగా ఆగస్టు 15న ''రాజ్యాంగాన్ని రక్షించండి, ప్రజాస్వామ్యాన్ని కాపాడండి'' నినాదంతో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జరుపుకోవాలని పిలుపునిచ్చారు. కోవిడ్ లాక్డౌన్తో ఇబ్బందులు పడిన వలస, అసంఘటిత రంగ కార్మికులను నెలన్నర తరువాత గుర్తించారన్నారు. కేంద్రం ప్రకటించిన 20 లక్షల కోట్ల ప్యాకేజీ కార్పొరేట్, పెట్టుబడిదారీ శక్తులకే ఉపయోగపడిందని, రెండు లక్షల కోట్లు మాత్రమే ప్రజలకు లబ్ది చేకూరిందని అన్నారు. కోవిడ్ బారి నుంచి ప్రజలను కాపాడటంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి విమర్శించారు.
ప్రభుత్వం ఇస్తున్న 5 కిలోల బియ్యంతో పేదలు ఎలా బతుకుతారని ప్రశ్నించారు. కరోనా వైద్య సేవలు అందిస్తున్న నర్సులకు, వైద్య సిబ్బందికి కనీస వేతనాలు అందక ఆందోళన చేశారన్నారు. తెలంగాణలో టెస్టులు తక్కువ చేయడం వల్లే కేసులు తక్కువ వస్తున్నాయన్నారు. ప్రభుత్వాస్పత్రుల్లో కోవిడ్ సౌకర్యాలు లేవని, దీంతో బాధితులు ప్రయివేటు ఆస్పత్రులకు వెళ్లి లక్షలాది రూపాయలు కడుతున్నారని అన్నారు. సౌకర్యాలు లేక రోగులు నిలదీయడం, సిబ్బంది సమస్యల నేపథ్యంలోనే వరంగల్ ఎంజీఎం ఆస్పత్రి సూపరింటెండెంట్ రాజీనామా చేశారన్నారు. విలేకరుల సమావేశంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి టి.శ్రీనివాసరావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నేదునూరి జ్యోతి, అర్భన్ జిల్లా కార్యదర్శి మేకల రవి తదితరులు పాల్గొన్నారు.