Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆరు నుంచి పదో తరగతివరకు పాఠాల బోధన
- 17 నుంచి 50 శాతం టీచర్లు విధుల్లోకి
- ఈ నెల 31న ఈసెట్..సెప్టెంబర్2 పాలిసెట్,
- సెప్టెంబర్ 9,10,11,14 ఎంసెట్ !
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఈ నెల 20వ తేదీ నుంచి డిజిటల్ తరగతులు ప్రారంభమవుతాయని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. ఈ నెల 17వ తేదీ నుంచి ప్రతిరోజూ 50 శాతం మంది టీచర్లు పాఠశాలలకు హాజరుకావాలని ఆదేశించారు. సోమవారం నాడు ఆమె విద్యాశాఖ ఉన్నతాధికారులతో సమావేశం అయ్యారు. ప్రవేశపరీక్షలు, విద్యాసంవత్సరం, పరీక్షల నిర్వహణపై చర్చించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆరు నుంచి పదో తరగతి విద్యార్థులకు దూరదర్శన్, టీశాట్ ద్వారా తరగతులు నిర్వహిస్తామన్నారు. సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి 3 నుంచి ఐదో తరగతి వరకు గల విద్యార్థులకు డిజిటల్ తరగతులు ఉంటాయన్నారు. ఈ నెల 17 నుంచి ఇంటర్ విద్యార్థులకు ఆన్లైన్ తరగతులు నిర్వహిస్తామన్నారు. సెప్టెంబర్ ఒకటో తేదీ తర్వాతే ఇంటర్ ప్రవేశాల ప్రక్రియ ఉంటుందన్నారు. ఈ నెల 31న ఈసెట్, సెప్టెంబర్ 2న పాలిసెట్, సెప్టెంబర్ 9,10,11,14 తేదీల్లో ఎంసెట్ పరీక్షలు పెట్టాలని భావిస్తున్నామన్నారు.
సుప్రీం ఉత్తర్వుల తర్వాతే డిగ్రీ, పీజీ పరీక్షలపై స్పష్టత: పాపిరెడ్డి
సుప్రీం కోర్టు ఆదేశాల తర్వాతే డిగ్రీ, పీజీ పరీక్షల నిర్వహణపై స్పష్టత వస్తుందని రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మెన్ టి.పాపిరెడ్డి తెలిపారు. విద్యాశాఖా మంత్రి కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ డిగ్రీ, పీజీ పరీక్షల నిర్వహణపై విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డితో చర్చించామన్నారు. డిగ్రీ, పీజీ పరీక్షలకు సంబంధించిన అంశం సుప్రీం కోర్టులో ఉందనీ, ఈ అంశాలకు సంబంధించి మహారాష్ట్ర, ఢిల్లీ ప్రభుత్వాలను కౌంటర్ దాఖలు చేయాలని సుప్రీం కోర్టు ఆదేశించిదని ఆయన పేర్కొన్నారు. సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారమే పరీక్షల నిర్వహణపై నిర్ణయం తీసుకుంటామన్నారు.