Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేజీకేఎస్ వెబినార్లో వక్తలు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
అన్ని తరాలకూ మాజీ ఎంపీ, ప్రజానేత బొమ్మగాని ధర్మభిక్షం ఆదర్శనీయుడని పలువురు వక్తలు కొనియాడారు. ఆయన పోరాటాలను స్ఫూర్తిగా తీసుకుని ముందుకెళ్లాలని పిలుపునిచ్చారు. సర్దార్ సర్వాయి పాపన్న యాదిలో భాగంగా తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం(కేజీకేఎస్) రాష్ట్ర కార్యదర్శి ఎం.వి.రమణ అధ్యక్షతన 'ప్రజల మనిషి ధర్మభిక్షం నేటి తరానికి ఆదర్శం' అనే అంశంపై వెబినార్ను బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా అభ్యుదయ రచయితల సంఘం రాష్ట్ర కార్యదర్శి కె.వెంకటేశ్వర్లు మాట్లాడుతూ విద్యార్థి సంఘం నేతగా హాస్టల్ను పెట్టి వేలాది మంది విద్యార్థులను స్వాతంత్య్రోద్యమం లో పాల్గొనేలా చేయడంలో, వామపక్షభావజాలంవైపు నడిపించడంలో ధర్మభిక్షం పాత్ర మరువలేనిదన్నారు. ఎక్కడికెళ్తే అక్కడ ప్రజాసంఘాలను నిర్మిం చడంలో ధర్మభిక్షం ముందుండేవారన్నారు. రైతాంగ సాయుధ పోరాట సమయంలో రహస్యజీవితం గడుపుతూనే దీపాలు పెట్టుకుని రైతులకు చదువులు చెప్పారనీ, ఉద్యమాల పాఠాలు బోధించారని వివరించారు. విజయవాడ- హైదరాబాద్ జాతీయ రహదారికి, మూసీ ప్రాజెక్టుకు ధర్మభిక్షం పేరు పెట్టాలనీ, ట్యాంక్బండ్పై ఆయన విగ్రహం పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. సంఘటిత పోరాటాల ద్వారా మాత్రమే ప్రజా సమస్యల పరిష్కారం అవుతాయని నొక్కి చెప్పారు.
జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్ తిప్పర్తి యాదయ్య మాట్లాడుతూ అట్టడుగు వర్గాల ప్రజల శ్రేయస్సు కోసం పోరాడిన మహనీయుడు ధర్మభిక్షం అన్నారు. గీసేవారికే చెట్టుపై హక్కు ఉండాలనే నినాదంతో పోరాడి విజయం సాధించారనీ, సొసైటీలను ఏర్పాటు చేశారని గుర్తుచేశారు. బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు జాజుల శ్రీనివాస్గౌడ్ మాట్లాడుతూ ధర్మభిక్షాన్ని, దొడ్డి కొమురయ్య, చాకలి ఐలమ్మ, తదితర మహనీయులను ఒక కులంవారిగానో, కొందరికి చెందినవారిగానో చూడవద్దనీ, వెనుకబడిన వర్గాల వారి పక్షాన పోరాడిన ప్రజల మనుషులుగా చూడాలని సూచించారు. రాష్ట్రంలో నేడు నియంతృత్వ పాలన నడుస్తున్నదని విమర్శించారు. ప్రజాసమస్యలపై ధర్నాలు చేస్తామంటే కోవిడ్ నిబంధనల పేరుతో అడ్డుతగులుతున్నారని వాపోయారు.
టీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షులు పల్లె రవి కుమార్ మాట్లాడుతూ సర్వాయి సర్దార్ పాపన్న కోరుకున్న రాజకీయ, సామాజిక, ఆర్థిక సమానత్వం కోసం ప్రతి ఒక్కరూ పోరాడాలని పిలుపునిచ్చారు. చేతి వృత్తిదారుల హక్కుల కోసం జరిగిన పోరాటాలకు ధర్మభిక్షం ఆద్యుడని కొనియాడారు. డిండి ఎత్తిపోతల పథకానికి ధర్మభిక్షం పేరు పెట్టాలనీ, ఆయన పేరిట హైదరాబాద్లో స్మారక లైబ్రరీ, స్థూపాన్ని ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. మోదుగుపూలు ఎడిటర్ భూపతి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ విద్యార్థులను స్వాతంత్య్రోద్యమంలో, వామపక్ష ఉద్యమాల్లో పాల్గొనేలా చైతన్యపరచడంలో ధర్మభిక్షం పాత్ర మరువలేనిదన్నారు. ప్రజల్లోకి వేగంగా చొచ్చుకెళ్లిన నేతల్లో ఆయన ఒకరనీ, ఆయనను నేటి నాయకులు ఆదర్శంగా తీసుకోవాలని కోరారు.