Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
బెంగళూరులో ఎమ్మెల్యే శ్రీనివాసమూర్తి ఇంటివద్ద జరిగిన ఆందోళన హింసాత్మకంగా మారడాన్ని, పోలీసుల కాల్పుల్లో ముగ్గురు మరణించడాన్ని ఆవాజ్ తెలంగాణ రాష్ట్ర కమిటీ ఖండించింది. దీనికి కర్ణాటక ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలని డిమాండ్ చేసింది. ప్రజలు సంయమనంతో, సహనంతో వ్యవహరించాలని పిలుపునిచ్చింది. సోషల్ మీడియాలో మత విద్వేషాలు రెచ్చగొట్టే పోస్టులు పెడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు ఆవాజ్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ప్రొఫెసర్ మహమ్మద్ అన్సారీ, మహమ్మద్ అబ్బాస్ బుధవారంనాడొక పత్రికా ప్రకటన విడుదల చేశారు. కర్ణాటక ఎమ్మెల్యే శ్రీనివాసమూర్తి బంధువు సోషల్ మీడియాలో మొహమ్మద్ ప్రవక్తని కించపరిచేలా పోస్టులు పెట్టడాన్ని నిరసిస్తూ బెంగళూరులో ఎమ్మెల్యే ఇంటి వద్ద జరిగిన నిరసన కార్యక్రమం హింసాత్మకంగా మారడం, పోలీసుల కాల్పుల్లో ముగ్గురు మరణించడం ఖండనీయమనీ, పోలీసులు అప్రమత్తంగా వ్యవహరించి ఉంటే ఈ సంఘటన నివారించగలిగి ఉండేవారని తెలిపారు. కోవిడ్ -19 నిబంధనలు ఉన్నప్పటికీ అంతమంది అక్కడ గుమిగూడుతుంటే ప్రభుత్వం ఏం చేస్తుందని ప్రశ్నించారు. ఈ ఘటనలో కర్నాటక ప్రభుత్వ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తుం దన్నారు. దేశంలో కరోనా ప్రజల ప్రాణాలను బలిగొంటుంటే మతోన్మాదంతో లబ్ధి పొందాలనుకునే వ్యక్తులు, సంస్థలు, మత ఉద్రిక్తతలను, విద్వేషాలను రెచ్చ గొట్టి ప్రజల్లో చీలిక తీసుకురావడానికి ప్రయత్నాలు చేయడం సిగ్గుచేటని, ఇలాంటి సంస్థలు, వ్యక్తుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు.