Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మరి కొందరు నిందితుల అక్రమాస్తులపై ఏసీబీ కన్ను
- ఆరా తీస్తున్న ప్రత్యేక బృందాలు
నవ తెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి
కోట్లాది రూపాయల ఈఎస్ఐ ఐఎంఎస్ మందులు కనుగోలు మాల్ స్కాంలో మరికొందరు నిందితుల అక్రమాస్తులపై ఏసీబీ అధికారులు కన్నేశారు. వీరికి సంబంధించిన అక్రమాస్తులు ఎక్కడెక్కడ ఉన్నాయి కనుక్కునేందుకు ప్రత్యేక బృందాలు అంతర్గతంగా పని చేస్తున్నాయని తెలిసింది. గత ఏడాది ఈఎస్ఐకు చెందిన ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీస్(ఐఎంఎస్)లో దాదాపు ఏడు వందల కోట్ల రూపాయలకు పైగా కుంభకోణం జరిగినట్టు ఏసీబీ విచారణలో వెలుగు చూసింది. ముఖ్యంగా ఐఎంఎస్ డైరెక్టర్ దేవికారాణి ప్రధాన సూత్రధారిగా వివిధ ప్రయివేటు ఫార్మా కంపెనీల నుంచి మందుల కొనుగోల్ మాల్కు తెర లేపినట్టు ఏసీబీ తేల్చింది. ఈ నేపథ్యంలో ఆమె దాదాపు వందల కోట్ల రూపాయలకు పైగా కుంభకోణానికి పాల్పడ్డారని తేల్చిన ఏసీబీ ఆమెతో పాటు మరో 30 మంది వరకు ఇతర ఐఎంఎస్ అధికారులు, జాయింట్ డైరెక్టర్లు, ప్రయివేటు ఫార్మా కంపెనీలకు చెందిన ఎండీలు, డైరెక్టర్లు, ఉద్యోగులను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. వీరిలో పలువురు ప్రస్తుతం బెయిల్పై జైలు నుంచి బయటకు వచ్చారు. ఈ నేపథ్యంలో మరి కొందరు నిందితులైన అధికారులు, ఫార్మా కంపెనీలకు చెందిన ఎండీలకు చెందిన ఆస్తుల కూపీని ఏసీబీ లాగుతున్నట్టు తెలిసింది. మందుల కొనుగోల్ ద్వారా సర్కారుకు కోట్లాది రూపాయల నష్టాన్ని తీసుకు వచ్చిన సదరు నిందితుల ఆస్తులను సీజ్ చేయడం ద్వారా నష్టాన్ని పూడ్చాలనే లక్ష్యంతో ఏసీబీ అధికారులు పని చేస్తున్నారని విశ్వసనీయంగా తెలిసింది. దీనికి సంబంధించి ముందడుగు వేయడానికి ప్రభుత్వం నుంచి ఏసీబీకి గ్రీన్ సిగల్ వచ్చినట్టు సమాచారం.