Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎన్నికల ఖర్చుపై విచారణకు ఏఐసీసీ ఆదేశం
- ఇచ్చిన నిధులనూ కొందరు ఖర్చు చేయలేదని ఆరోపణలు
- సర్దుబాటుతో కప్పిపుచ్చేందుకు యువనేతల ప్రయత్నం
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
దొంగలు పడ్డ ఆరు నెలలకు కుక్కలు మొరిగిన చందంగా ఏఐసీసీ తీరు ఉంది. సాధారణ ఎన్నికలు జరిగి రెండేండ్లయిన తర్వాత జమాఖర్చులను, వివరాలను సేకరించే పనిలో పడింది. అభ్యర్థులకు నిధుల పంపిణీలో అవకతవకలు జరిగినట్టు ఫిర్యాదులు అందటంతో ఓ సీనియర్ నేతతో విచారణకు ఆదేశించింది. ఆ విచారణలోనూ అది నిజమేనని తేలినట్టు విశ్వసనీయ సమాచారం. కొందరు నేతలు తమ తప్పులను కప్పిపుచ్చుకునేందుకు ప్రయత్నాలు కూడా చేస్తున్నట్టు తెలిసింది.
ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి చేసిన ఖర్చెంత? ఎవరికెంత ఇచ్చారు? ఇచ్చిన నిధులు ఎవరు పక్కదోవ పట్టించారు? ఆ లెక్కల వివరాలేంటి? తదితరాలపై ఏఐసీసీ సీరియస్గా పరిశీలిస్తున్నది. దీనిపై విచారణ జరిపేందుకు పార్టీ సీనియర్ నేతకు బాధ్యత అప్పగించింది. అంతర్గత విచారణ చేపట్టిన ఆ పెద్దాయన అవాక్కయినట్టు తెలిసింది. ఆయన విచారణలో ఎక్కువ నిధులు పక్కదారి పట్టినట్టు తేలింది. దీంతో ఎన్నికల ఖర్చుల కోసం డబ్బులు తీసుకున్న వారిలోనూ, ఆ డబ్బులను అభ్యర్థులకు పంపిణీ చేసినవారిలోనూ, ఆ నిధులతో సంబంధం ఉన్నవారిలోనూ గుబులు మొదలైంది. అన్ని నియోజకవర్గాల్లో ఖర్చు చేయాల్సిన నిధులను తమకు అనుకూలమైన అభ్యర్థులకు ఇచ్చినట్టు పార్టీలో చర్చ జరుగుతున్నది. అభ్యర్థుల ఆర్థిక స్థితిగతులను బట్టి అందరికీ ఇవ్వాలని ఏఐసీసీ ఆదేశాలున్నా...కొంత మంది అభ్యర్థులకు మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకున్నట్టు అప్పట్లో గుసగుసలు వినిపించాయి. అందని అభ్యర్థులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తమలో తాము అంతర్మథనం చెందుతూనే ఎన్నికల బరిలో నిలిచారు. కొంత మంది అభ్యర్థులు పార్టీ ఇస్తుందన్న భరోసాతో చివరి దాకా వేచి చూశారు. అయినా వారి ఆశలు గల్లం తయ్యాయి. ఎన్నికల ఖర్చుల కోసం ఏఐసీసీతోపాటు మిత్రపక్షాలు, చందాల రూపంలోనూ పార్టీకి వచ్చినట్టు విశ్వసనీయ సమాచారం. ఆ నిధులను ఎన్నికల కోసం ఖర్చు చేయకుండా కొంత వెనకేసుకున్నట్టు, మరికొంత తన అనుయాయులకు ఇచ్చినట్టు ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి బక్క జడ్సన్ ఏఐసీసీకి రాతపూర్వకంగా ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈమేరకు లెక్కలు తేల్చాలంటూ ఏఐసీసీ ఆదేశించింది. అందని వారు తమకు అందలేదని చెప్పగా, అందిన అభ్యర్థులు సరైన లెక్కలు చూపలేదని తేల్చింది.
ఈ వ్యవహారమంతా బయటపడకుండా సర్దుబాటు చేసేందుకు ఇద్దరు యువ నేతలు ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. విచారణ చేపట్టిన సదరు సీనియర్ నేత ఇంటికి ఆ ఇద్దరు యువనేతలు వెళ్లి బతిమిలాడినట్టు తెలిసింది. 'అయ్యిదేదో అయిపోయింది. ఈ విషయం బయటకు తెలిస్తే పార్టీ అప్రతిష్టపాలవుతుంది. ఇంతటితో వది లేయండి' అని కోరినట్టు ఆ వర్గాలు చెప్పాయి. లెక్కల్లోనూ తీవ్రమైన వ్యత్యాసం ఉంది. దానిని సరి చేయడం ఎలా అని యువ నేతలను ప్రశ్నించినట్టు తెలిసింది. ఏదోలా సర్దుబాటు చేయండి అంటూ వేడుకున్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ నేపథ్యంలో సరైన లెక్కలు అధిష్టానానికి అందిస్తారా? లేకపోతే అంతర్గతంగా సర్దుబాటు చేసి బయటకు పొక్కకుండా గుంభనంగా ఉంటారా? అనేది వేచి చూడాల్సిందే.