Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సమానపనికి సమానవేతనం ఇవ్వకపోవటంపై హైకోర్టు
- జీహెచ్ఎంసీ తీరుపై నిలదీత
- రెండునెలల్లోగా రెగ్యులైజ్ చేయాలి..
హైదరాబాద్: జీహెచ్ఎంసీలో పనిచేసే పలువురు ఔట్సోర్సింగ్ పద్ధతిలో ఏండ్ల తరబడి పని చేయించుకుని సమాన పనికి సమాన వేతనం ఇవ్వకపోవడం చట్ట వ్యతిరేకమని హైకోర్టు తీర్పు చెప్పింది. ఔట్సోర్సింగ్ కాంట్రాక్టు పద్ధతిలో దశాబ్ధంగా ఉద్యోగాలు చేయించడం చట్ట వ్యతిరేకమనీ, రాజ్యాంగ ఉల్లంఘనే అవుతుందనీ, పైగా శ్రమదోపిడీనే అవుతుందని తీర్పు వెలువరించింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎం.ఎస్.రామచంద్రరావు ఇటీవల తీర్పు చెప్పారు. జీహెచ్ఎంసీలో ఔట్సోర్సింగ్లో పనిచేసే శానిటరీ సూపర్వైజర్స్, శానిటేషన్ కార్మికులు, ఎంటమాలజీ ఫీల్డ్ వర్కర్స్, ఎంటమాలజీ సుపీరియల్ ఫీల్డ్ వర్కర్స్, సూపర్వైజర్స్, సుపీరియర్ ఫీల్డ్ అసిస్టెంట్స్ల సర్వీసుల్ని రెగ్యులరైజ్ చేయాలని శ్రీనివాసాచారి మరో 97 మంది దాఖలు చేసిన రిట్ పిటిషన్లపై హైకోర్టు ఇటీవల తీర్పు చెప్పింది. ఔట్సోర్సింగ్లో పనిచేసే జి.శ్రీనివాసాచారి మరో 97 మందికి రెగ్యులర్ స్టాఫ్కు ఇచ్చే జీతాలు చెల్లించాలన్న మధ్యంతర ఉత్తర్వులు రద్దు చేయాలని జీహెచ్ఎంసీ అభ్యర్థను
తిరస్కరించింది. ''వీరందరి సర్వీసులను రెగ్యులరైజ్ చేయడానికి అర్హతలున్నాయి. ఉమాదేవి కేసులో సుప్రీంకోర్టు తీర్పు చెప్పి 10 ఏండ్లు దాటినా వీరి సర్వీసుల్ని రెగ్యులరైజ్ చేయకపోవడం సరికాదు. ఆ తీర్పు ప్రకారం 14 ఏండ్ల కంటే ఎక్కువ కాలం రెగ్యులర్ పోస్ట్లు ఖాళీగా ఉంటే వాటిని భర్తీ చేయాలేగానీ ఔట్సోర్సింగ్ పద్ధతిలో నియామకాలు చేయకూడదు. ఇలా చేస్తే రాజ్యాంగంలోని 14, 16, 21 అధికరణాలకు వ్యతిరేకమే. ఏండ్ల తరబడి కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేయించడం శ్రమదోపిడినే. వెట్టి చాకిరీ చేయించుకోవడమే. కాంట్రాక్టర్ ద్వారా ఔట్సోర్సింగ్ స్టాఫ్తో పనులు చేయించడం రాజ్యాంగ వ్యతిరేకమే. ఔట్సోర్సింగ్ స్టాఫ్ నిస్సహాయతను అడ్డంపెట్టుకుని వాళ్ల శ్రమశక్తిని దోపిడీ చేయడం రాజ్యాంగ వ్యతిరేకం. రెగ్యులర్ స్టాఫ్కు లభించే పెన్షన్, మెడికల్, రిటైర్మెంట్ బెనిఫిట్స్, ఇంక్రిమెంట్లు ఇవ్వకపోవడం దోపిడీనే అవుతుంది.
కాంట్రాక్టు విధానంపై 1970 నాటి యాక్ట్ నేటికీ అమలు చేయకపోవడం శోచనీయం. హైకోర్టులో రిట్ వేసిన వాళ్ల సర్వీసుల్ని 2 నెలల్లోగా రెగ్యులరైజ్ చేయాలి. రెగ్యులర్ ఉద్యోగులకు ఇచ్చే జీతాలు చెల్లించాలి. 2019 జులై వరకూ కాంట్రాక్టు పద్ధతిపై చెల్లించిన మొత్తాలను మినహాయించిన మిగిలిన డబ్బును వచ్చే సెప్టెంబర్ 15లోగా చెల్లించాలి... అని తీర్పు చెప్పింది.