Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నాకు రూ.55 వేలు వచ్చింది...
- తగ్గించేందుకు చర్యలు తీసుకోండి: కాంగ్రెస్ పక్ష నేత భట్టి విక్రమార్క విజ్ఞప్తి
- పరిశీలించి.. తగ్గిస్తాం : సీఎం కేసీఆర్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
లాక్డౌన్ విధించిన మార్చి, ఏప్రిల్, మే నెలల్లో రాష్ట్రంలోని అనేక లక్షల మందికి కరెంటు బిల్లులు అధికంగా వచ్చాయని శాసనసభలో కాంగ్రెస్ పక్షనేత మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. తనకూ రూ.55 వేల బిల్లు వచ్చిందని చెప్పారు. వీటిని తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. మంగళవారం అసెంబ్లీలో 'విద్యుత్ రంగంలో తెలంగాణ సాధించిన ప్రగతి, కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన విద్యుత్ సవరణ బిల్లు, శ్రీశైలం పవర్ హౌస్లో సంభవించిన అగ్ని ప్రమాదం...' అనే అంశాలపై విద్యుత్ శాఖ మంత్రి జి.జగదీశ్రెడ్డి... స్వల్పకాలిక చర్చను ప్రారంభించారు. ఈ అంశంపై ఎంఐఎం సభ్యుడు అహ్మద్ పాషాఖాద్రీ, టీఆర్ఎస్ సభ్యుడు గంప గోవర్థన్ ప్రసంగించారు. అనంతరం భట్టి మాట్లాడుతూ... లాక్డౌన్ సమయంలో మూణ్నెల్ల కాలానికి కలిపి ఒకే బిల్లు వేయటం వల్ల, శ్లాబులు మారిపోయాయని తెలిపారు. దాని వల్ల వినియోగదారులకు కరెంటు బిల్లులు అధికంగా వచ్చాయని చెప్పారు. వాటిని నెలల వారీగా విడగొట్టి, బిల్లులు వేయాలని కోరారు. తద్వారా ప్రజలపై భారాన్ని తగ్గించాలని విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అనేక విద్యుత్ ప్రాజెక్టులను ప్రారంభించామని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. అవన్నీ టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక పూర్తయ్యాయని వివరించారు. అందువల్ల గత ప్రభుత్వాలు ఏమీ చేయలేదంటూ మంత్రి చెప్పటం సరికాదన్నారు. తెలంగాణ వచ్చాక కేవలం భద్రాద్రి, యాదాద్రి ప్రాజెక్టులకు మాత్రమే రూపకల్పన చేశారని గుర్తు చేశారు. ఇటీవల కాలంలో దేశంలోని అనేక రాష్ట్రాలు మిగులు విద్యుత్ రాష్ట్రాలుగా నిలిచాయని చెప్పారు. వాటి సరసన తెలంగాణ కూడా చేరిందే తప్ప... అందులో ప్రత్యేకత ఏమీ లేదన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన విద్యుత్ సవరణ బిల్లు... సమాఖ్య స్ఫూర్తికి తూట్లు పొడిచేదిగా ఉందని అన్నారు. అందువల్ల తమ పార్టీ దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నదని తెలిపారు. అయితే కేంద్రం చేతుల్లో ఈఆర్సీ సభ్యుల నియామకం, ఎస్సీ, ఎస్టీలకు ఇచ్చే విద్యుత్ రాయితీలకు కోతలు, క్రాప్ సబ్సిడీలు, రైతుల మోటార్లకు మీటర్లు తదితరాంశాలపై లోతైన అధ్యయనం, పరిశీలన చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. వీటిపై సమగ్ర వివరణివ్వాలంటూ సీఎంకు విజ్ఞప్తి చేశారు. ఇందుకు సంబంధించి రాష్ట్రంలోని విద్యుత్ రంగ నిపుణులు, అన్ని పార్టీలతో చర్చించాలని కోరారు. శ్రీశైలం పవర్హౌస్లో జరిగిన అగ్ని ప్రమాదం... దురదృ ష్టకరమైదని అన్నారు. దీనిపై ఉన్నతస్థాయి కమిటీతో విచారణ జరిపించాలనీ, అవసరమైతే సభా సంఘాన్ని కూడా నియమించాలని ఆయన కోరారు.
భట్టి వ్యాఖ్యలపై మంత్రి జగదీశ్రెడ్డి స్పందిస్తూ... కాంగ్రెస్ హయాంలోనే విద్యుత్ ప్రాజెక్టులకు రూపకల్పన జరిగితే ఆనాడు తెలంగాణలో కరెంటు కోతలు ఎందుకున్నాయని ప్రశ్నించారు. అప్పట్లో రైతుల ఆత్మహత్యలు జరగలేదా..? అని ప్రశ్నించారు. 'తెలంగాణ వస్తే ఇక్కడ చిమ్మ చీకట్లు కమ్ముకుంటాయి.. పరిశ్రమలు వెళ్లిపోతాయి...ప్రజలు వలసపోవాల్సిన పరిస్థితులొస్తయి...' అంటూ ఆనాటి కాంగ్రెస్ ముఖ్యమంత్రి మాట్లాడితే, అదే పార్టీకి చెందిన మీరు (భట్టిని ఉద్దేశించి) ఎందుకు నోరు మెదపలేదని ఎదురుదాడి చేశారు. శ్రీశైలం ఘటనపై ఇప్పటికే సీఐడీ విచారణకు ఆదేశించామని తెలిపారు. సీనియర్ అధికారులతో కమిటీని నియమించామనీ, అయితే వారిలో కొందరికి కరోనా సోకటంతో నివేదిక సమర్పణలో జాప్యం జరుగుతున్నదని వివరించారు. సభ్యులు లేవనెత్తిన పలు అంశాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమాధానమిస్తూ... లాక్డౌన్ కాలానికి సంబంధించిన కరెంటు బిల్లులను పరిశీలించి, తగు చర్యలు తీసుకుంటామని చెప్పారు. ప్రజలపై భారాలు పడ్డట్టు తేలితే.. వాటిని తగ్గిస్తామని హామీనిచ్చారు. శ్రీశైలం ఘటనలో మరణించిన ఉద్యోగుల త్యాగం గొప్పదని అన్నారు. వారి కుటుంబాలను అన్ని విధాలా ఆదుకుంటామని చెప్పారు.
అందుకే నేను బయటకొచ్చిన...
కరెంటుపై చర్చ జరుగుతున్న క్రమంలో సీఎం... చంద్రబాబు, కాంగ్రెస్ ప్రభుత్వాల గురించి ప్రస్తావించారు. ఈ సమయంలో ప్రతిపక్ష సభ్యుల్లో కొందరు... 'చంద్రబాబు హయాంలో విద్యుత్ ఉద్యమం సందర్భంగా కాల్పులు జరిగాయి... అప్పుడు మీరు టీడీపీలోనే ఉన్నారు కదా...?' అని వ్యాఖ్యానించారు. ప్రతిగా కేసీఆర్... 'గందుకేగదా నేను బయటకొచ్చిన... పిడికిలి బిగించి జై తెలంగాణ అన్నగదా....' అంటూ వ్యాఖ్యానించారు. కేంద్రం ప్రతిపాదించిన విద్యుత్ సవరణ బిల్లుపై మాట్లాడే సమయంలో ఆయన బీజేపీపై పలు సెటైర్లు విసిరారు. 'అన్న వస్త్రాల కోసం పోతే... ఉన్న వస్త్రాలు ఊడినట్టుంది...', 'బీఎస్ఎన్ఎల్, ఎల్ఐసీ, రైల్వే, విమాన రంగాలను ప్రయివేటీకరించారు... ఇప్పుడు విద్యుత్ రంగానికి కూడా గోవింద మంగళం పాడతరా...' అంటూ చురకలంటించారు. కాంగ్రెస్, బీజేపీ హయాంలో రాష్ట్రాలకున్న అధికారాలను హరించి, కేంద్రీకృతం చేస్తున్నారని విమర్శించారు. ఇది ఏనాటి నుంచో శరపరంపరగా కొనసాగుతున్నదని చెప్పారు. కేంద్రం ప్రతిపాదించిన బిల్లు... చట్ట రూపం దాల్చితే మనం ప్రతిదానికీ వాళ్ల (కేంద్రం) గడ్డం పట్టుకుని బతిమాలుకోవాల్సి వస్తుందని సీఎం హెచ్చరించారు.