Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్ర విద్యుత్ చట్టం చాలా ప్రమాదకరం
- రైతుల మోటార్లకు మీటర్లొస్తయ్..
- కరెంటు సబ్సిడీలన్నీ ఎగిరిపోతయ్... రాష్ట్రాల హక్కుల్ని గొడ్డలితో అడ్డంగా నరికే బిల్లు ఇది..
- విద్యుత్ రంగాన్ని ప్రయివేటీకరించేందుకే కేంద్రం చేస్తున్న ప్రయత్నం..
- బీఎస్ఎన్ఎల్, ఎల్ఐసీ, రైళ్లు, విమానాలు అయిపోయినయ్.. ఇగిప్పుడు కరెంటు మీద పడ్డరు.
- రాష్ట్రాల హక్కులు, స్వయం ప్రతిపత్తికి తీరని విఘాతం
- ముఖ్యమంత్రి కేసీఆర్
- 'విద్యుత్ చట్టం-2003' సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో తీర్మానం.. ఏకగ్రీవంగా ఆమోదం
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన 'విద్యుత్ చట్టం-2003 సవరణ బిల్లు' అనేది రాష్ట్రాల హక్కుల్ని గొడ్డలితో అడ్డంగా నరికే విధంగా ఉన్నదని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు ఆందోళన వ్యక్తం చేశారు. విద్యుత్ రంగాన్ని పూర్తిగా ప్రయివేటీకరించేందుకే మోడీ సర్కార్ ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నదని ఆయన తెలిపారు. ఇప్పటికే బీఎస్ఎన్ఎల్, ఎల్ఐసీ, రైల్వే, విమానయాన రంగాలను ప్రయివేటీకరించిన బీజేపీ ప్రభుత్వ దృష్టి... ఇప్పుడు అత్యంత కీలకమైన విద్యుత్రంగంపై పడిందని చెప్పారు. ఈ బిల్లు చట్ట రూపంలోకి వస్తే రాష్ట్రాల హక్కులకు తూట్లు పడతాయనీ, వాటి స్వయం ప్రతిపత్తికి తీరని విఘాతం కలుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. చివరకు తెలంగాణలోని రైతుల విద్యుత్ మోటార్లకు మీటర్లు బిగించాల్సి వస్తుందని, వారితోపాటు ఇతర రంగాలకు ఇచ్చే కరెంటు సబ్సిడీలన్నీ ఎగిరిపోతాయని హెచ్చరించారు. అందువల్ల ఈ బిల్లును అందరూ వ్యతిరేకించాలని ఆయన పిలుపునిచ్చారు.
'కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన విద్యుత్ చట్టం- 2003 సవరణ బిల్లు'ను వ్యతిరేకిస్తూ సీఎం కేసీఆర్ మంగళ వారం శాసనసభలో తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ తీర్మా నాన్ని సభ ఏకగ్రీవంగా ఆమోదించింది. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ... విద్యుత్ రంగానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వ విధానాలను నిశితంగా విమర్శించారు. బీజేపీతోపాటు గతంలో చంద్రబాబు, కాంగ్రెస్ చేసిన కథల వల్లే కరెంటు రంగంలో ఆనాడు సంక్షోభం నెలకొన్నదని అన్నారు. కేంద్రం ప్రతిపాదించిన బిల్లుకు సంబంధించి పైకి ఒకటి చెబుతున్నరు.. లోపల మరోటి ఉంటున్నదని వ్యాఖ్యానించారు. దీనివల్ల మున్ముందు రాష్ట్రాలు... ఢిల్లీ నుంచి అడుక్కోవాల్సిన పరిస్థితులు నెలకొంటాయని తెలిపారు. ప్రస్తుతం హైదరాబాద్లో ఉన్న లోడ్ డిస్పాచ్... హస్తినకు పోతుందని హెచ్చరించారు. డిస్ట్రిబ్యూటరీలను సబ్ లైసెన్సులకు ఇస్తారని తెలిపారు. ఫలితంగా బహిరంగ మార్కెట్లో ఎవరైనా విద్యుత్ పంపిణీని చేజిక్కించుకోవచ్చని చెప్పారు. ఇదే జరిగితే మన ట్రాన్స్కో, జెన్కోలు ఎటు పోవాలని ప్రశ్నించారు. అసలు ఆయా సంస్థలు మనుగడలో ఉంటాయా..? లేదా...? అనే సందేహాన్ని వ్యక్తం చేశారు. ఆఖరికి విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్సీ) సభ్యుల నియామకం కూడా కేంద్రం చేతుల్లోకి పోతుందని వివరించారు. మరోవైపు శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టుల్లో తయారయ్యే సాంప్రదాయేతర విద్యుత్ను పరిగణనలోకి తీసుకోబోరని చెప్పారు. మన విద్యుదుత్పత్తిని తగ్గించుకోవాలనీ, లేదంటే యూనిట్కు 50 పైసల నుంచి రూ.2 వరకు అపరాధ రుసుమునైనా కట్టాలనే షరతు విధించారని తెలిపారు. ఒక్క ముక్కలో చెప్పాలంటే విద్యుత్ రంగాన్ని మొత్తం ప్రయివేటీకరించేందుకే మోడీ సర్కార్... ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నదని వివరించారు. 'విద్యుత్ రంగాన్ని మొత్తం మా చేతుల్లోనే పెట్టుకుంటామంటూ సీదా చెప్తే సరిపోతదిగదా...? ఇలా డొంక తిరుగుడెందుకు...?' అంటూ సీఎం.. కేంద్రాన్ని ప్రశ్నించారు. ఇలాంటి చర్యల వల్ల ప్రభుత్వ విద్యుత్ సంస్థలైన ట్రాన్స్కో, జెన్కో మనుగడలో ఉంటాయా..? అనే సందేహం కలుగుతున్నదని చెప్పారు. వాటిలో పని చేస్తున్న 50 వేల మంది ఉద్యోగుల పరిస్థితేంటని ఆందోళన వ్యక్తం చేశారు.
బిల్లులు.. బిల్ కలెక్టర్లు...
'ప్రతిపాదిత విద్యుత్ బిల్లు.. చట్టం రూపం దాల్చితే రైతుల మోటార్లకు కచ్చితంగా మీటర్లు బిగించాలె, ఠంచన్గా బిల్లులు వసూల్జెయ్యాలే...' అని కేసీఆర్ హెచ్చరించారు. రైతులు ఎంత కరెంటును కాలిస్తే... అంత బిల్లును వారి నుంచి వసూలు చేయాల్సి వస్తుందని స్పష్టం చేశారు. ఇందుకోసం బిల్ కలెక్టర్లను నియమించాల్సి ఉంటుందని తెలిపారు. మీటర్లు బిగించాలంటే రూ.750 కోట్ల నుంచి రూ.వెయ్యి కోట్ల వరకూ ఖర్చవుతుందని వివరించారు. బిల్ కలెక్టర్లతో రైతులకు పలు రకాల ఇబ్బందులు ఎదురవుతాయని తెలిపారు. అందువల్ల కేంద్రం చేపడుతున్న ఇలాంటి చర్యలను ప్రజలు, రైతులు అంగీకరిస్తారా..? అని ప్రశ్నించారు.
పలు రాష్ట్రాలు వ్యతిరేకం...
కేంద్రం ప్రతిపాదించిన బిల్లుపై ఇప్పటికే తమిళనాడు, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్, కేరళ, చత్తీసగఢ్, ఢిల్లీ తదితర రాష్ట్రాల సీఎంలతో తాను మాట్లాడానని కేసీఆర్ చెప్పారు. ఆయా రాష్ట్రాలు ఈ బిల్లును పూర్తిగా వ్యతిరేకిస్తున్నాయని తెలిపారు. ఈ నేపథ్యంలో ఇలాంటి చర్యలు సరికాదంటూ తాను ప్రధానిమోడీకి మూణ్నెల క్రితమే లేఖ రాశానని వివ రించారు. 'ప్రధానికి చేతులెత్తి దండం పెడుతున్నా... రాష్ట్రా ల హక్కులను హరించే విధంగా ఉన్న ఇలాంటి బిల్లులు తేవొద్దు. మీకు పార్లమెంటులో బలం ఉంటే ఉండొచ్చు.. కానీ ఇలాంటి చట్టాలు తేవొద్దు...' అని విజ్ఞప్తి చేశారు.
తీర్మానం...
'కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన విద్యుత్ చట్టం- 2003 సవరణ బిల్లును తెలంగాణ శాసనసభ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది. సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా, రాష్ట్రాల హక్కులను హరించే విధంగా, రైతులు, పేదల ప్రయోజనా లను దెబ్బతీసే విధంగా ఈ బిల్లు రూపకల్పన జరిగింది. దేశ ప్రజలపై ఈ చట్టాన్ని రుద్దవద్దనీ, కొత్త బిల్లును వెంటనే ఉపసంహరించుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ తెలంగాణ శాసనసభ తీర్మానిస్తున్నది...'
శఠగోపం పెట్టొద్దు : కేసీఆర్
రాష్ట్రాలకు మంచి చేయకున్నా ఫరవాలేదు.. కానీ వాటికి శఠగోపం పెట్టొద్దంటూ సీఎం కేసీఆర్ కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. ప్రజా వ్యతిరేకమైన ఈబిల్లుపై రాష్ట్రానికి చెందిన కేంద్రమంత్రి, బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఏంచెబుతారని ప్రశ్నించారు. భద్రాద్రి, యాదాద్రి థర్మల్ పవర్స్టేషన్లను ప్రయివేటు వారికి కేటా యించాలంటూ గతంలో తనపై తీవ్రమైన ఒత్తిడి తెచ్చారని తెలిపారు. ఎట్టి పరిస్థి తుల్లోనూ ఆ పని చేయబోమంటూ తాను తెగేసి చెప్పానని అన్నారు. రాష్ట్రంలోని విద్యుత్ సంస్థల్లో పనిచేస్తున్న 22 వేల మంది ఆర్టిజన్లను రెగ్యులరైజ్ చేశామని కేసీఆర్ తెలిపారు. కేంద్ర బిల్లు అమలైతే వారి ఉద్యోగాలు ఉంటాయా..? అని ప్రశ్నించారు.