Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గుండెకాయనే పేదలకు దూరం చేస్తామంటే ఊరుకోం
- కార్పొరేట్లు, భూస్వాముల కోసమే కొత్త రెవెన్యూచట్టం
- ప్రభుత్వ మోసాలను క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్తాం
- ఈ నెల 25 వరకు జిల్లా, మండల స్థాయిలో రౌండ్టేబుల్ సమావేశాలు
- వ్యవసాయ కార్మిక, రైతు, కౌలు రైతు సంఘాల రౌండ్టేబుల్లో వక్తలు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
కొత్త రెవెన్యూ చట్టాల పేరుతో పేదలకు గుండెకాయ లాంటి భూమిని దూరం చేస్తుంటే ఊరుకోబోమని పలువురు వక్తలు రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ప్రభుత్వ విధానాలపై జనం తిరగబడేలా చైతన్యపరుస్తూ ఐక్య పోరాటాలు చేస్తామని ప్రకటించారు. ఈ నెల 19 నుంచి 25 వరకు జిల్లా, మండల స్థాయిలో రౌండ్టేబుల్ సమావేశాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. ఆ తర్వాత భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని చెప్పారు. తెలంగాణ రైతు సంఘం, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం, కౌలు రైతు సంఘాల ఆధ్వర్యంలో తెలంగాణ భూమి హక్కులు, పాసు పుస్తకాల బిల్లు-2020పై రౌండ్టేబుల్ సమావేశం రైతు సంఘం అధ్యక్షులు పి.జంగారెడ్డి, వ్యవసాయ కార్మిక సంఘం అధ్యక్షులు బుర్రి ప్రసాద్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశంలో అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి బి.వెంకట్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని నిర్వీర్యం చేయడంలో భాగంగా తీసుకొచ్చిన ఆర్డినెన్స్లకు మద్దతుగానే రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూ చట్టాలలో మార్పులు చేసిందని విమర్శించారు. సమగ్ర భూ సర్వే చేయకుండా పట్టాదారు బుక్కులు ఇవ్వడం అంటేనే పెద్దల ఆక్రమణలో ఉన్న పేదల భూములను చట్టబద్ధం చేయడమేనన్నారు. రెవెన్యూ కోర్టుల రద్దు దారుణమన్నారు. భూ సమస్యలను సివిల్ కోర్టుల్లో పరిష్కరించుకోవాలని ప్రభుత్వం చెప్పడం అన్యాయమనీ, అక్కడ లాయర్లను పెట్టుకుని కేసులను గెలిచే స్థోమత పేద రైతులకు ఉండదనీ, ఫలితంగా భూములు డబ్బులున్నవాళ్ల పాలయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వెలిబుచ్చారు. ఏఐకేఎస్ ఉపాధ్యక్షులు సారంపల్లి మల్లారెడ్డి మాట్లాడుతూ భూములకు సంబంధించిన 198 సెక్షన్లలో ఒక సెక్షన్కు మార్పులు చేసి రెవెన్యూ చట్టాన్నే మార్చినట్టు ప్రచారం చేస్తున్నారన్నారు. 1971 చట్టంలోని సెక్షన్ 26ని రద్దు చేసి వాస్తవ సాగుదారులను విస్మరించడం దారుణమన్నారు. సాదాబైనామాలను పట్టాలుగా మార్చుకునేందుకు 12,65,000 దరఖాస్తులు వచ్చాయనీ, అందులో 11,35,000 పెండింగ్లో ఉన్నాయని గుర్తుచేశారు. ప్రస్తుతం ఆ దరఖాస్తులన్నీ ధరణి వెబ్సైట్లోకి ఎక్కవనీ, వారు పట్టాదారులు కారని అన్నారు. రాష్ట్రంలో సాగవుతున్న భూముల్లో 16 లక్షల ఎకరాలు ఎవరిపైనా పట్టాలేదనీ, ఇప్పుడు ఆ భూమంతా అన్యాక్రాంతమయ్యే ప్రమాదముందన్నారు. క్యాబినెట్ తీర్మానం చేసిన భూములు, ట్రస్టుల భూములు, రబ్బరు, కాఫీ తోటలు ల్యాండ్ సీలింగ్ చట్టంలోకి రావన్నారు. తక్షణమే ల్యాండ్ సీలింగ్ చట్టంలో మార్పులు తీసుకురావాలనీ, ఒక కుటుంబానికి గరిష్ట భూమి అంశంపై ఒక నిర్ధిష్ట విధానాన్ని రూపొందించాలని డిమాండ్ చేశారు. రైతు సంఘం ప్రధాన కార్యదర్శి టి.సాగర్ మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా, మండల కేంద్రాల్లో రైతు, వ్యవసాయ కూలీ తదితర సంఘాలతో రౌండ్టేబుల్ సమావేశాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. సీఐటీయూ ప్రధాన కార్యదర్శి ఎం.సాయిబాబు మాట్లాడుతూ ప్రస్తుత రెవెన్యూ చట్ట సవరణల వల్ల అవినీతి ఇంకా తారాస్థాయికి చేరుతుందని హెచ్చరించారు. డీబీఎఫ్ అధ్యక్షులు శంకర్ మాట్లాడుతూ సమగ్ర భూసర్వే చేపట్టి రాజకీయ నాయకులు, భూస్వాముల చేతుల్లో ఉన్న వందల ఎకరాలను గుర్తించాలనీ, సీలింగ్ యాక్టును పకడ్బందీగా అమలు చేయాలనీ, ల్యాండ్ కమిషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్.వెంకట్రాములు మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ఫక్తు భూస్వామి ఏజెంట్లా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి స్కైలాబ్బాబు, గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు ధర్మానాయక్, శ్రీరామ్నాయక్, రైతు సంఘం సహాయ కార్యదర్శి ఎం. శోభన్, చేతివత్తిదారుల సమన్వయ కమిటీ రాష్ట్ర నాయకులు పి.ఆశయ్య, వ్యవసాయ కార్మిక సంఘం ఉపాధ్యక్షులు పద్మ, ఐద్వా రాష్ట్ర ఉపాధ్యక్షులు అరుణజ్యోతి, వీఆర్ఏ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వంగూరు రాములు, టీపీఎస్ఏకే రాష్ట్ర నాయకులు భూపతి వెంకటేశ్వర్లు, ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగరాజు, పీఎన్ఎం రాష్ట్ర సహాయ కార్యదర్శి కోట రమేశ్, కేవీపీఎస్ నాయకులు విజరు, జి.రాములు తదితరులు పాల్గొన్నారు.