Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అర్ధాంతరంగానే ముగిసిన పరిశీలన
- జీహెచ్ఎంసీ పరిధిలోనే చూపించాలి : భట్టి
- కాంగ్రెస్ నేతలు పారిపోయారు : మంత్రి తలసాని
- టీఆర్ఎస్ది వాగ్దాన భంగమే : సీపీఐ(ఎం)
నవతెలంగాణ-సిటీబ్యూరో
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల నేపథ్యంలో మహానగర అభివృద్ధి కేంద్రంగా అధికార, ప్రతిపక్ష నేతల మధ్య 'డబుల్' రాజకీయ సంవాదం జరుగుతున్నది. డబుల్ బెడ్రూమ్ ఇండ్ల్ల నిర్మాణంపై మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్, ప్రతిపక్ష నేత భట్టి విక్రమార్క మధ్య సవాళ్లతో సాగిన ఇండ్ల పరిశీలన అర్ధాంతరంగానే ముగిసింది. లక్ష ఇండ్ల పరిశీలనలో భాగంగా గురు, శుక్రవారాల్లో నగరంలోని పలు ప్రాంతాల్లో పర్యటించారు. మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్, మేయర్ బొంతు రామ్మోహన్ స్వయంగా భట్టి ఇంటికెళ్లి ఆయన్ను తీసుకుని డబుల్ బెడ్రూమ్ ఇండ్లను చూపించారు. మేడ్చల్ జిల్లా రాంపల్లిలోని ఇండ్ల పరిశీలనతోనే పర్యటనకు బ్రేక్ పడింది. ఈ క్రమంలో టీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల మధ్య మాటల యుద్ధం మొదలైంది.
అర్ధాంతరంగానే..
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఇండ్లను చూపించమంటే పక్క నియోజకవర్గాల్లో ఇండ్ల్లు చూపిస్తున్నారని రాంపల్లి సైట్లో భట్టి విక్రమార్క ఫైర్ అయ్యారు. దీంతో అసహనం వ్యక్తం చేసిన మంత్రి తలసాని కొల్లూరుకు రావాలంటూ వెళ్లిపోయారు. అయితే, 150 డివిజన్ల పరిధిలో ఎక్కడ చూపించినా వస్తామని భట్టి విక్రమార్క చెప్పారు. నాగారం మున్సిపాలిటీ నుంచి కాంగ్రెస్ నేతలు వెనుదిరిగారు. భట్టి మాత్రం రాంపల్లిలోనే ఆగిపోయారు. ఎవరి దారిన వారు వెళ్లిపోవడంతో రెండో రోజు ఇండ్ల పరిశీలన అర్ధాంతరంగా ముగిసింది. మంత్రులు తలసాని, మల్లారెడ్డి, మేయర్ బొంతు రామ్మోహన్ మాత్రం కొల్లూరుకు వెళ్లారు.
అప్పుడు రూరల్.. ఇప్పుడు గ్రేటర్ ప్రజలను..
'చెప్పింది ఎన్ని? చూపించింది ఎన్ని? నాకు చూపించిన 3,248 ఇండ్లను పరిగణిస్తున్నాను. ఎన్నికలప్పుడు రూరల్ ప్రజలను, ఇప్పుడు గ్రేటర్ ప్రజలను టీఆర్ఎస్ మోసం చేస్తోంది. గ్రేటర్ పరిధిలో ఇండ్లను చూపించమంటే శివారు ప్రాంతాల్లో చూపిస్తున్నారు' అని ప్రతిపక్ష కాంగ్రెస్ నేత భట్టి విక్రమార్క అన్నారు. గ్రేటర్లో లక్ష ఇండ్లు చూపిస్తానని శాసనసభ సాక్షిగా చెప్పిన మంత్రి రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలోని మంకాల్లోని ఇండ్లను చూపించడం విడ్డూరంగా ఉందన్నారు.
ఓర్వలేకే సాకులు..
భట్టి కామెంట్స్పై మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. 'ఇండ్లను పూర్తిగా చూడకుండా మాట్లాడొద్దు. ప్రభుత్వం కట్టిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లన్నింటినీ చూపిస్తున్నాం' అన్నారు.
తోక ముడిచిన తలసాని : అయోధ్య రెడ్డి
హైదరాబాద్లో పేదలకు నిర్మించిన ఒక లక్ష డబుల్ బెడ్రూమ్ ఇండ్లు భౌతికంగా చూపిస్తామన్న మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ ఆ పని చేయలేక తోకముడిచారని టీపీసీసీ అధికార ప్రతినిధి, మీడియా కో ఆర్డినేటర్ బోరెడ్డి ఆయోధ్యరెడ్డి విమర్శించారు. ఈమేరకు శుక్రవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.
టీఆర్ఎస్ సవాళ్లు మోసపూరితమే..
- సీపీఐ(ఎం) గ్రేటర్ హైదరాబాద్ సెంట్రల్ సిటీ
ఇచ్చిన మాట ప్రకారం గ్రేటర్లో లక్ష డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణం ఘనంగా పూర్తి చేస్తున్నామని టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న సవాళ్లు మోసపూరితమేనని సీపీఐ(ఎం) గ్రేటర్ హైదరాబాద్ సెంట్రల్ సిటీ కార్యదర్శి ఎం.శ్రీనివాస్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. గ్రేటర్లో లక్ష ఇండ్లు, మిగిలిన రాష్ట్రంలో మరో లక్ష ఇండ్లు కట్టించకుండా వచ్చే ఎన్నికల్లో ఓట్లు అడగబోమని 2017మార్చిలో సీఎం కేసీఆర్ స్వయంగా శాసనసభలో ప్రకటించారని గుర్తు చేశారు. ఆ మాటను నిలబెట్టుకోలేదని, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో లబ్ది పొందడానికే ప్రజలను మభ్యపెడుతున్నారని అన్నారు. గ్రేటర్లో ఇండ్ల కోసం 7లక్షల మంది దరఖాస్తు చేసుకుంటే ఆరేండ్లలో 600 మందికి మాత్రమే ఇండ్లు కేటాయించారని చెప్పారు. సర్కార్ అసమర్థత కారణంగా కనీసం దరఖాస్తులను కూడా పరిశీలించకపోగా గొప్పలు చెప్పుకుంటోందన్నారు. ఇండ్లను శివారు ప్రాంతాల్లో నిర్మించి పేదలను ఇబ్బందులకు గురిచేయడం తప్ప మరొకటి కాదన్నారు. లక్ష ఇండ్లల్లో ఇబ్రహీంపట్నం, మహేశ్వరం, మేడ్చల్, కుత్బుల్లాపూర్, పటాన్చెరు నియోజకవర్గాల్లోనే 83వేల ఇండ్లను నిర్మించారని పేర్కొన్నారు. లబ్దిదారుల ఎంపికకు ఇప్పటికీ మార్గదర్శకాలు జారీ చేయకపోవడం ఇండ్లు వస్తాయో? రావోనని పేదలు ఆందోళన చెందుతున్నారన్నారు. సర్కార్ ఇప్పటికైనా ఆలస్యం చేయకుండా అర్హులైన వారికి ఇండ్లు కేటాయించాలని ప్రకటనలో డిమాండ్ చేశారు.