Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గతేడాది 118 మంది కౌలు రైతుల ఆత్మహత్య
- వారంతా ఎస్సీ, ఎస్టీ, బీసీల్లోని పేదలే
- 2011లో భూ ఆధీకృత రైతుల చట్టానికి తూట్లు
- ఇప్పటికే వర్తించని రైతుబంధు, రుణాలు, సబ్సిడీలు
- కౌలు భారానికి తోడు తలకు మించిన సాగు వ్యయం
- కొత్త రెవెన్యూ చట్టంతో 14లక్షల మందికి అన్యాయం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
మేం గుర్తించనే గుర్తించం అంటూ కౌలురైతుల పట్ల రాష్ట్రప్రభుత్వం మరోమారు తన వివక్ష ప్రదర్శిం చింది. వాస్తవసాగుదారులను పూర్తిగా విస్మరించి రాష్ట్రంలోని 14లక్షలకుపైగా ఉన్న కౌలురైతుల కుటుం బాలకు తీరని అన్యాయం చేసింది. వీరంతా ఎస్సీలు, ఎస్టీలు, బీసీల్లోని పేదలే. ఇప్పటికే రైతుబంధు, వ్యవసాయరుణాలు, ఎరువులు, విత్తనసబ్సిడీలు లభించక కౌలురైతులు తీవ్రఇక్కట్లు ఎదుర్కొంటు న్నారు. ఇవన్నీ బయట కొనుక్కోవాల్సిందే. సాగువ్యయానికి తోడు కౌలు భారం తడిసిమోపడవుతున్నది. కొందరు కౌలురైతులు అప్పుల భారంతాళలేక ఆత్మహత్యలూ చేసుకుంటు న్నారు. రాష్ట్రంలో అసలు కౌలు రైతులే లేరన్నట్టుగా మాట్లాడుతున్న సీఎం కేసీఆర్కి గతేడాది నేషనల్ క్రైం బ్యూరో నివేదిక ప్రకటించిన 118 మంది కౌలు రైతుల ఆత్మహత్యలు కనిపించకపోవడం దారుణం. రాష్ట్రంలో 14 లక్షలకుపైగా కౌలు రైతులున్నట్టు రైతు సంఘాలు, పలు సర్వే సంస్థలు చెబుతున్నాయి. వారి కుటుంబ సభ్యులను కలుపుకుంటే 50 లక్షల మంది దాకా ఉంటారు. వీళ్లంతా ఎస్సీ, ఎస్టీ, బీసీ సామాజిక తరగతుల్లో ఆర్థికంగా అత్యంత వెనుక బడిన వారే. భూములను కౌలుకు తీసుకుని సాగు చేస్తున్నారు. ప్రస్తుత సీజన్లో సాగు విస్తీర్ణం కోటీ 28 లక్షలు కాగా 30 శాతానికిపైగా కౌలుదారులే సాగుచేస్తున్నారని గణాంకాలే చెబుతున్నాయి. ఇవి కండ్లకు కొట్టచ్చినట్టు కనిపిస్తున్నా...'గతంలో జమీందారులు, జాగీర్దార్లు ఉన్నప్పుడు సాగుదారుల రక్షణ కోసం కౌల్దారీ రక్షిత చట్టాలు తీసుకొచ్చారు. వాళ్లే లేనప్పుడు ఈ చట్టాలెందుకు?' అని అసెంబ్లీ సాక్షిగా సీఎం మాట్లాడటం అంటే రాష్ట్రంలోని 50 లక్షలకుపైగా మందిని విస్మరించడమే. రాష్ట్రంలో చిన్న, సన్నకారు రైతులే 95 శాతానికిపైగా ఉండగా ఇంకా కౌలుదారులు ఎక్కడున్నారు? అని సీఎం మాట్లాడటంపైనా సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం రాష్ట్రంలో ఎస్సీ సామాజిక తరగతికి చెందిన 17,96,622 కుటుం బాలున్నాయి. రాష్ట్ర జనాభాలో 18శాతం. వీరిలో 11,99,015 కుటుంబాలకు(గ్రామాల్లో 7,88,903 కుటుంబాలు, పట్టణాల్లో 4,10,112 కుటుంబాలు) భూమి లేదని తేలింది. ఆ లెక్కల ప్రకారమే ఎస్టీ కుటుంబాలు 9,80,808(రాష్ట్ర జనాభాలో 10 శాతం) ఉండగా 4,62,829 కుటుంబాలకు (గ్రామాల్లో 3,79,208 కుటుంబాలకు, పట్టణాల్లో 83,619 కుటుంబాలకు) భూమి లేదు. వీరిలో పట్టణప్రాంతాలలో నివసించేవారిని మినహాయిస్తే మిగతా వారిలో ఎక్కువగా భూములను కౌలుకు తీసుకుని, కూలినాలి చేసి బతికేవారే. కౌలురైతులలో ఎక్కువ ఎస్సీ, ఎస్టీ, బీసీల్లోని పేదలేనని అవగతం అవుతున్నది. కౌలు రైతులను రాష్ట్ర ప్రభుత్వం గుర్తించకపోవడం అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ సామాజిక తరగతుల్లోని పేదలకు అన్యాయం చేయడమే. అయితే, రాష్ట్ర ప్రభుత్వం కొడుకులకు ఉద్యోగాలు, ఇతరత్రా సాకులు చూపి 3లక్షల దళిత కుటుంబా లకు మూడెకరాల చొప్పున కొనిస్తానని చెప్పింది. ఎస్టీల్లోనూ లక్ష కుటుంబాలను ఆదుకుంటామని చెప్పింది. 'ఎస్సీలందరికీ మూడెకరాలను పంచుతాం. మూడెకరాల లోపు వారికి కూడా మూడెకరాలు ఉండేటట్టు చేస్తాం' అని చెప్పిన సీఎం కేసీఆర్నే శాసనసభలో ప్రభుత్వం వద్ద భూమే లేదు..రాబోయే సంవత్సరాలలో భూ పంపిణీ ఉండదని తేల్చేయడం అంటే దళితులను వంచించడమే.
కౌలు దారులు నష్టపోతున్నదిలా..
1971 పాసుపుస్తకాల చట్టంలోని సెక్షన్ 26 పట్టేదారులతో పాటు కౌలుదారులకు తాకట్టు పెట్టుకున్నవారికి వాస్తవ సాగుదారులకు స్వాధీనపు పాసుపుస్తకం ఇవ్వాలని చెప్పింది. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం దాన్ని ఎత్తేసింది. దీనివల్ల కౌలుదార్లకు తీవ్ర నష్టం జరుగుతున్నది. ఇప్పటికే పట్టేదారు పాసుపుస్తకాలలో వాస్తవ సాగుదారు కాలం తీసేయడం వల్ల కౌలు రైతులు రైతుబంధు, సాగు రుణాలకు నోచుకోవడం లేదు. సబ్సిడీ ఎరువులు, విత్తనాలు కూడా దక్కట్లేదు. సాగు కోసం కౌలుదారులు అప్పులు చేయాల్సిన పరిస్థితి. దీని ప్రతి ఏటా పంట పండినా పండకపోయినా ఎకరాకు (భూమి నాణ్యత, పంట దిగుబడి ఆధారంగా) రూ.8 వేల నుంచి 15 వేల వరకు కౌలు కడుతున్నారు. కౌలు రైతులు ఎక్కువగా మెట్టపంటలనే సాగుచేస్తున్న పరిస్థితి క్షేత్రస్థాయిలో ఉంది. వర్షాలు అతిగా పడ్డా, పడకపోయినా కౌలు రైతు నష్టపోవాల్సిందే. అందుకే రైతు ఆత్మహత్యల్లో ఎక్కువగా కౌలు రైతులే ఉంటున్నారు. నేషనల్ క్రైం బ్యూరో లెక్కల ప్రకారం గతేడాది రాష్ట్రంలో 118 రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. లెక్కలోకి రాని మరణాలెన్నో? కౌలు రైతుల ఇక్కట్లు కండ్లకు కట్టినట్టు కనపడుతున్నా ప్రభుత్వం వారిని పట్టించుకోకపోవడం దారుణం. కౌలు రైతుల కోసం రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూ చట్టంలో కొన్ని మార్పులు చేయాల్సిన అవసరం ఉందనే డిమాండ్ వినిపిస్తున్నది. అలాగే కౌలు రైతులకు గుర్తింపు కార్డులిచ్చి వారికి కూడా సాగు కోసం రుణాలు, రైతుబంధు అందించేలా చూడాల్సిన గురుతర బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉంది. అప్పుడే మూడున్నర కోట్ల జనాభాలోని 50 లక్షలకుపైగా మందికి న్యాయం చేసినట్టు అవుతుంది.
కౌలు రైతులను ఆదుకోవాలి : టి.సాగర్, రైతు సంఘం ప్రధాన కార్యదర్శి
రాష్ట్రంలోని కౌలురైతులను ప్రభుత్వం గుర్తించకపోవడం తీవ్ర అన్యాయం. వారంతా ఎస్సీ, ఎస్టీ, బీసీల్లోని పేదలే. 2011లో తీసుకొచ్చిన భూ ఆధీకృత రైతుల చట్టం ప్రకారం కౌలు రైతులకు లోన్ల కోసం కార్డులివ్వాలి. దీని ద్వారా కౌలు రైతులకు రుణాలు, సబ్సిడీలు లభిస్తాయి. కానీ, టీఆర్ఎస్ ప్రభుత్వం ఆ చట్టానికి తూట్లు పొడిచింది. కనీసం ఆచట్టం ప్రకారమైనా కౌలు రైతులకు మేలు చేస్తే బాగుంటుంది.