Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పంచాయతీరాజ్, గ్రామీణ ఉపాధి కల్పన కార్యాలయాన్ని ముట్టడించిన ఫీల్డు అసిస్టెంట్లు
- నగరంలోకి రాకుండా ఎక్కడికక్కడ అరెస్టులు
- అయినా తరలొచ్చిన వందలాది మంది
- ఎండకు సొమ్మసిల్లి పడిపోయిన మహిళ
- సీఎం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని కమిషనర్ హామీ ఇవ్వడంతో ఆందోళన విరమణ
- పరిష్కరించకపోతే ఉద్యమమే : ఫీల్డు అసిస్టెంట్లు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
తమను విధుల్లోకి తీసుకోవాలని ఫీల్డు అసిస్టెంట్లు సర్కారును వేడుకున్నారు...మంత్రి, ఎమ్మెల్యే,..ఇలా కనిపించిన ప్రజాప్రతినిధికల్లా వినతిపత్రాలిచ్చి మొరపెట్టుకున్నారు. టీఆర్ఎస్కేవీ చెంతకూ చేరారు. ఒకటికాదు..రెండు కాదు ఏడు నెలలుగా ఓపికపట్టుకుని...చివరకు కడుపు మండి పోరుబాటపట్టారు. జిల్లాల్లో ఎక్కడికక్కడ అరెస్టు చేసినా...ఎలాగోఅలాగా పట్నం చేరి పంచాయతీ రాజ్, గ్రామీణ ఉపాధి కల్పన కార్యాలయాన్ని శుక్రవారం నాడు వందలాది ఫీల్డు అసిస్టెంట్లు ముట్టడించి తమ పోరాట పటిమను ప్రదర్శించారు. తమను విధుల్లో తీసుకోకపోతే ప్రభుత్వానికి పతనం తప్పదని హెచ్చరించారు. కరోనా సమయంలో మూకుమ్మడి ఆందోళనలు తగవని సూచించగా..'మా బతుకులే కూలిపోతుంటే ఇంకా కరోనా ఏంది?' అంటూ ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు గేటు ఎదుటే బైటాయించారు. 'వారం రోజులు ఆగండి..సీఎం సార్ దృష్టికి తీసుకెళ్తాం..పరిష్కరిస్తాం' అని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ రఘునందన్రావు వచ్చి హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. ఎర్రటెండకు ఓ మహిళా ఫీల్డు అసిస్టెంటు సొమ్మసిల్లి కిందపడిపోయింది. ఈ ఆందోళనకు టీఆర్ఎస్కేవీ, సీఐటీయూ, ఐఎన్టీయూసీ, బీసీ సంఘాలు మద్దతు తెలిపాయి. ఫీల్డు అసిస్టెంట్ల ముట్టడినుద్దేశించి సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి భూపాల్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఫీల్డ్ అసిస్టెంట్లను విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. సమ్మె చేస్తే ఉద్యోగం నుంచి తొలగించడం ఎంతవరకు సబబు అని ప్రశ్నించారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం నిరంకుశత్వ చర్యలను విడనాడాలని సూచించారు.15 ఏండ్ల నుంచి పనిచేస్తున్న ఫీల్డు అసిస్టెంట్లను విధుల్లోకి తీసుకునేదాకా ఐక్యపోరాటాలను కొనసాగిస్తామన్నారు. బీసీ సంఘాల జాతీయ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే ఆర్ కష్ణయ్య మాట్లాడుతూ సమ్మెలు, ధర్నాలు చేస్తే ఉద్యోగాలు తీసేస్తామనే వైఖరిని రాష్ట్ర ప్రభుత్వం విడనాడకపోతే తీవ్ర మూల్యం చెల్లించాల్సి వస్తుందని హెచ్చరించారు. ఉద్యమాల ద్వారా సాధించుకున్న తెలంగాణలో హక్కుల కోసం పోరాడితే తీసేస్తామంటే ఎవ్వరూ చూస్తూ ఊరుకోబోరన్నారు. పది రోజుల్లో ప్రభుత్వం ఉద్యోగాల్లో తీసుకోకపోతే ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. సీపీఐ(ఎం), సీపీఐ, టీజేఎస్, ఎమ్మార్పీఎస్, బీసీ, ప్రజా సంఘాలను కలుపుకుని ముందుకు సాగుతామన్నారు. వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి ఆర్. వెంకట్ రాములు మాట్లాడుతూ 2005లో కేంద్ర ప్రభుత్వం పేదల కోసం తీసుకొచ్చిన ఉపాధి హామీ చట్టంలో పనిచేస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్లకు ఉద్యోగ భద్రత కల్పించాల్సిన ప్రభుత్వమే తొలగించడం అన్యాయమన్నారు. ఈ పోరాటానికి వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర వ్యాప్తంగా అండగా ఉంటుందని భరోసానిచ్చారు. గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు ధర్మ నాయక్ మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీనే అత్యధికంగా ఉన్నటువంటి ఫీల్డ్ అసిస్టెంట్లను తొలగించడం అనేది దుర్మార్గమని విమర్శించారు. కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి స్కైలాబ్బాబు మాట్లాడుతూ ఫీల్డ్ అసిస్టెంట్లు తొలగించడం రాజ్యాంగ వ్యతిరేకమనీ, అంబేద్కర్ చెప్పిన ప్రజాస్వామ్య సూత్రాలకు భిన్నమని అన్నారు. ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకులు రమేష్ మాట్లాడుతూ తమ సంఘం మద్దతు ఉంటుందని భరోసానిచ్చారు. ఫీల్డ్ అసిస్టెంట్ల సంఘం నాయకులు రవి, పి. యాదయ్య, కేశవులు మాట్లాడుతూ ఈ ఉద్యమాన్ని ఐక్యంగా కొనసాగిస్తామనీ, దీనికి రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు మద్దతు తెలపాలని కోరారు. ప్రభుత్వం ఎన్ని నిర్బంధాలు, ఆంక్షలు పెట్టినా సుమారు 1,500 మంది దాకా రావడం తమ ఐక్యతకు నిదర్శనమన్నారు. 22 జిల్లాల్లో వందలాది మంది ఫీల్డు అసిస్టెంట్లను పోలీసు స్టేషన్లలో నిర్బంధించడం సరిగాదన్నారు. హైదరాబాద్ చేరుకొని ముట్టడిని విజయవంతం చేసిన ప్రతిఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా తొలగించిన వారిని విధుల్లోకి తీసుకోవాలనీ, వేతనాల పెంపుదల, సర్య్కులర్ నెం.4779, హెచ్ ఆర్ పాలసీ ఇలాంటి డిమాండ్లను సానుకూలంగా పరిశీలించి పరిష్కరించాలని కోరారు.