Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నాలా వద్ద సైకిల్.. చెరువులో మృతదేహం
- హైదరాబాద్ నేరెడ్మెట్లో ప్రమాదం
- జీహెచ్ఎంసీ నిర్లక్ష్యం వల్లే పాప చనిపోయింది : బంధువులు
నవతెలంగాణ-మల్కాజిగిరి/సిటీబ్యూరో
హైదరాబాద్లోని నేరెడ్మెట్లో బాలిక అదృశ్యం ఘటన విషాదంగా ముగిసింది. సీఐ నరసింహ స్వామి తెలిపిన వివరాల ప్రకారం.. మల్కాజిగిరి నేరెడ్మెట్ కాకతీయ నగర్కు చెందిన సుమేధ కపారియా(12) ఐదో తరగతి చదివేది. గురువారం సైకిల్ తొక్కుతానని తల్లి సుకన్య కపారియాతో చెప్పిన బాలిక బయటకు వెళ్లింది. ఎంత సేపటికీ ఇంటికి చేరుకోకపోవడంతో ఆందోళనకు గురైన తల్లిదండ్రులు చుట్టపక్కల వెతికారు. ఫలితం లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. నేరేట్మెట్ పోలీసులు శుక్రవారం అన్ని కోణాల్లో విచారణ చేపట్టారు. గురువారం సాయంత్రం భారీ వర్షానికి దీన్దయాల్నగర్లో నాలాలు పొంగిపొర్లాయని స్థానికుల నుంచి సమాచారం సేకరించిన పోలీసులు నాలా వద్ద గాలింపు చర్యలు చేపట్టారు. స్థానికంగా ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించారు. జీహెచ్ఎంసీ అధికారులతో కలిసి గాలిస్తున్న సమయంలో నాలా వద్ద బాలిక సైకిల్ను గుర్తించారు. వెంటనే రెస్క్యూటీంను రంగంలోకి దించారు. నాలాకు రెండు కిలోమీటర్ల దూరంలోని బండ చెరువులో బాలిక మృతదేహాన్ని కనుగొన్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. చిన్నారి ప్రమాదవశాత్తూ నాలాలో పడి మృతిచెందిందా.. ఇతర కారణాలేమైనా ఉన్నాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
బాలిక మృతిపై కుటుంబ సభ్యులు, స్థానికులు పలు అనుమానాలు వ్యక్తం చేశారు. చిన్నారి సైకిల్ నాలా వద్ద లభించడం, రెండు కిలోమీటర్ల దూరంలోని చెరువు వద్ద మృతదేహం లభించడంపై సందేహాలు వ్యక్తం చేశారు. ఇలాంటి సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు హామీచ్చారు. సంఘటనా స్థలాన్ని డీసీపీ రక్షితామూర్తి, ఏసీపీ శివ కుమార్ పరిశీలించారు.