Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గ్రామపంచాయతీ ఎంప్లాయీస్, వర్కర్స్ యూనియన్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
మల్టీ పర్పస్ విధానాన్నివెంటనే రద్దు చేయాలని తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్, వర్కర్స్ యూనియన్ డిమాండ్ చేసింది. ఈ మేరకు యూనియన్ గౌరవాధ్యక్షులు పాలడుగు భాస్కర్, ప్రధాన కార్యదర్శి సి.హెచ్.వెంకటయ్య నేతృత్వంలోని ప్రతినిధి బృందం సచివాలయంలో శనివారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ను కలిసి వినతిపత్రం సమర్పించింది. పంచాయతీ సిబ్బందితో మరుగుదొడ్లు కడిగించడం విరమించాలని కోరారు. కార్మికులతో బలవంతంగా రాయించుకున్న బాండ్ పేపర్లను తిరిగివ్వాలని విజ్ఞప్తి చేశారు. మల్టీపర్పస్ విధానంతో కార్మికులను బానిసలుగా మార్చాలని ప్రయత్నించడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు. మెమో నెంబర్ 2026ను రద్దు చేయాలనీ, మల్టీపర్పస్ విధానాన్ని ఉపసంహరించి జీ.ఓ.నెంబర్ 51ని సవరించాలని విజ్ఞప్తి చేసింది. కారోబార్, బిల్ కలెక్టర్లను యధావిధిగా కొనసాగించాలనీ, పంచాయతీ అసిస్టెంట్ పోస్టులివ్వాలనీ, పాత కేటగిరీలను యధావిధిగా కొనసాగించాలనీ, బలవంతంగా బాండ్ పేపర్ రాయించుకోవడం మానుకోవాలని డిమాండ్ చేశారు. 500 జనాభాకు ఒకరు మాత్రమే సిబ్బంది ఉండాలనే నిబంధన సరికాదనీ, పని చేస్తున్న కార్మికులందరికీ ప్రతి నెలా రూ.8,500 వేతనం బ్యాంకు ద్వారా ఇవ్వాలని పేర్కొన్నారు. అక్రమంగా కారోబార్, బిల్ కలెక్టర్లు, పంచాయతీ కార్మికులను తొలగించిన వారిపై చర్యలతో పాటు ఆ కార్మికులను విధుల్లో చేర్చుకోవాలని సీఎస్ దృష్టికి తీసుకెళ్లారు. ఎస్కే-డే పేరుతో ప్రవేశపెట్టిన రూ.2,00,000 బీమాను వెంటనే అమలు చేసేలా, 60 ఏండ్లు దాటిన వారికి నష్టపరిహారం అందేలా, రోజుకు 8 గంటల పనిదినంతో పాటు వారాంతపు, పండుగ సెలవులు కార్మికులకు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని నాయకులు డిమాండ్ చేశారు.