Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్ర ఆర్థిక మంత్రికి కేటీఆర్ లేఖ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రంలోని పట్టణాలకు రావలసిన గ్రాంట్ల బకాయిలను వెంటనే విడుదల చేయాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ను రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కె. తారకరామారావు కోరారు. ఈ మేరకు శనివారం ఆయా విషయాలను ప్రస్తావిస్తూ లేఖ రాశారు. 15వ ఆర్థిక సంఘం తెలంగాణలోని మిలియన్ ప్లస్ నగరాల కేటగిరి లో ఉన్న హైదరాబాద్కు రూ.468 కోట్లతోపాటు ఇతర పట్టణాలకు మరో రూ.421 కోట్లు కేటాయించిందన్నారు. వీటిని ఇప్పటికే విడుదల చేయాల్సి ఉన్నా, అవి ఇంకా రాలేదని చెప్పారు. ఇందులో హైదరాబాద్కు రావాల్సిన నిధుల్లో ఇప్పటిదాకా ఒక్క రూపాయి విడుదల కాలేదనీ, మిగిలిన నగరాలకు సంబంధించి కేవలం రూ.105 కోట్లు మాత్రమే వచ్చాయన్నారు. కరోనా సంక్షోభంలో రాష్ట్రాలు కూడా ముందువరుసలో ఉండి పోరాడుతున్నాయనీ, దీంతోపాటు ఆర్థిక కార్యకలాపాలను తిరిగి గాడీలో పెట్టేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు రాష్ట్రంలోని పట్టణాల్లో మౌలిక వసతుల కల్పనలో రాష్ట్ర ప్రభుత్వం భారీగా కార్యక్రమాలు తీసుకున్నదని చెప్పారు. గతంలో 14వ ఆర్థిక సంఘం సూచించిన రూ. 2714 కోట్ల బేసిక్ గ్రాంట్కుగానూ కేంద్రం కేవలం రూ. 2502 కోట్లు మాత్రమే విడుదల చేసిందని చెప్పారు. అప్పుడూ రూ. 208 కోట్లను పెండింగ్లోనే పెట్టిందని గుర్తు చేశారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి తీసుకోవాల్సిన అన్నీ చర్యలు తీసుకున్నా కేంద్రం నిధులు ఇవ్వడంలో జాప్యం జరిగిందన్నారు. దీంతో పాటు 14వ ఆర్థిక సంఘానికి సంబంధించి పర్ఫామెన్స్ గ్రాంట్ కింద రావాల్సిన నిధుల్లో రూ. 441 కోట్లు బాకీ ఉన్నాయన్నారు. ఇలా మొత్తం 14వ ఆర్థిక సంఘానికి సంబంధించి రూ. 650 కోట్లు రాష్ట్రానికి రాలేదన్నారు. మంత్రి తన లేఖను కేంద్ర పట్టణాభివద్ధి, గృహానిర్మాణ మంత్రి హరీ దీప్ సింగ్ పూరికి కూడా పంపించారు.