Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పట్టభద్రుల నియోజకవర్గాలపై కేసీఆర్
- రెండింటినీ దక్కించుకోవాలంటూ నేతలకు దిశా నిర్దేశం
- మార్చితో ముగియనున్న పల్లా రాజేశ్వరరెడ్డి పదవీకాలం
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
త్వరలో జరగనున్న పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికలపై ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టి సారించారు. ఆయా నియోజకవర్గాల్లోని గ్రాడ్యుయేట్లు మొదటి నుంచీ టీఆర్ఎస్ను తిరస్కరిస్తున్న సంగతి తెలిసిందే. ముందస్తు అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో గెలిచి జోరుమీదున్న అధికార పార్టీకి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మెదక్ పట్టభద్రులు గతంలో షాక్ నిచ్చిన సంగతి విదితమే. అక్కడి నుంచి కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి టి.జీవన్రెడ్డి గెలుపొందటంతో గులాబీ శ్రేణులు ఖంగుతిన్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికలు జరగబోయే నల్లగొండ, ఖమ్మం, వరంగల్.. మహబూబ్నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ గ్రాడ్యుయేట్ల స్థానాల్లో ఈసారి కచ్చితంగా విజయం సాధించి తీరాలంటూ ఆయన ఆయా జిల్లాల మంత్రులు, ఎమ్మెల్యేలకు దిశా నిర్దేశం చేశారు.ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని పని చేయాలని ఆదేశించారు. అయితే ఈ రెండింటిలో తటస్థులు, మేధావులను అభ్యర్థులుగా నిలబెట్టి, మద్దతివ్వటం ద్వారా వాటిని కైవసం చేసుకుందామంటూ ఆయన చెప్పినట్టు తెలిసింది. మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ స్థానం నుంచి ఇప్పటి వరకూ టీఆర్ఎస్ ఒక్కసారి కూడా గెలవలేదు. గత ఎన్నికల్లో అధికార పార్టీ తరఫున పోటీ చేసిన టీఎన్జీవో నేత దేవీ ప్రసాదరావు ఓటమి పాలయ్యారు. మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కె.నాగేశ్వర్ రెండుసార్లు, బీజేపీ నేత రామచంద్రరావు ఒకసారి ఇక్కడి నుంచి గెలుపొందారు. రామచంద్రరావుతోపాటు నల్లగొండ, ఖమ్మం, వరంగల్ నుంచి ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న పల్లా రాజేశ్వరరెడ్డి పదవీకాలం వచ్చే మార్చితో ముగియనుంది.
నల్లగొండ, ఖమ్మం, వరంగల్ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగాలని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్ భావిస్తున్నారు. ఆయనకు మద్దతివ్వాలంటూ ఇతర రాజకీయ పార్టీలకు టీజేఎస్ శుక్రవారం లేఖలు రాసింది. కోదండరామ్ పోటికి దిగితే ఆయనకు ధీటుగా మరో మేధావిని బరిలోకి దించి, మద్దతివ్వాలని కేసీఆర్ యోచిస్తున్నారు. తద్వారా పట్టభద్రుల్లో ఉన్న ప్రభుత్వ వ్యతిరేకత నుంచి గట్టెక్కాలని భావిస్తున్నారు. మహబూబ్నగర్, హైదరాబాద్, రంగారెడ్డి స్థానం నుంచి మరోసారి పోటీ చేయాలని ప్రొఫెసర్ కె.నాగేశ్వర్ నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలో ఇక్కడ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయబోయే ఆయనకు మద్దతివ్వటం ద్వారా ఆ సీటును కూడా కైవసం చేసుకునేందుకు వీలుగా సీఎం యోచిస్తున్నట్టు సమాచారం. నల్లగొండ, ఖమ్మం, వరంగల్ నియోజకవర్గం నుంచి 2007లో సీపీఐ (ఎం) తరఫున బుగ్గవీటి సరళ పోటీ చేశారు. ఆ తర్వాత వరుసగా రెండుసార్లు టీఆర్ఎస్ అభ్యర్థి కపిలవాయి దిలీప్కుమార్ విజయం సాధించారు. 2015లో ప్రస్తుత ఎమ్మెల్సీ, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వరరెడ్డి గెలుపొందారు. ఈ క్రమంలో మరోసారి ఈ స్థానంలో తన అభ్యర్థిని నిలిపేందుకు సీపీఐ (ఎం) కూడా యోచిస్తున్నట్టు తెలిసింది.