Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రభుత్వానికి ట్రాన్స్పోర్ట్ ఫెడరేషన్ విజ్ఞప్తి
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
రాష్ట్రంలోని ప్రయివేటు రవాణారంగ కార్మికులను ప్రభుత్వం ఆదుకోవాలని తెలంగాణ పబ్లిక్ అండ్ ప్రయివేటు రోడ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ (సీఐటీయూ) ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావును కోరింది. ఈ మేరకు ఫెడరేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎం సాయిబాబు, పి శ్రీకాంత్ ఈ మెయిల్ ద్వారా సీఎం కేసీఆర్కు వినతిపత్రం పంపించారు. రాష్ట్రంలో ట్రాన్స్పోర్ట్ వాహనాలు 8,74,416 ఉన్నాయనీ, 12 లక్షల మంది కార్మికులు దీనిపై ఆధారపడి బతుకుతున్నారని తెలిపారు. కరోనా వైరస్ నియంత్రణ కోసం ఫ్రంట్లైన్లో ఉండి కృషి చేస్తున్న మున్సిపల్, గ్రామపంచాయతీ, వైద్యులు, నర్సింగ్స్టాఫ్, పారామెడికల్, పోలీస్ సిబ్బందితో పాటు సాధారణ ప్రజలకూ అవసరమైన సరుకు రవాణా బాధ్యతను ఆరునెలలుగా వీరు నిర్వహిస్తున్నారని గుర్తుచేశారు. లాక్డౌన్లో, ఆ తర్వాత రవాణారంగ కార్మికులు అనేక ఆర్థిక ఇబ్బందులు పడుతూ, ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు.
కరోనా భయంలో ప్రజలు సొంత వాహనాలకు ప్రాధాన్యం ఇస్తున్నారనీ, ఆటో, టాక్సీలు ఎక్కేందుకు ముందుకు రావట్లేదనీ తెలిపారు. రోజంతా రోడ్లపై తిరిగినా కనీసం రూ.200 సంపాదించుకోలేని నిస్సహాయస్థితిలో ఉన్నారనీ, పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు వారిని మరింత కుంగదీస్తున్నాయని చెప్పారు. ప్రభుత్వం రవాణారంగ కార్మికులకు నెలకు రూ.7,500 ఆర్థిక సహాయం ఇవ్వాలనీ, ప్రయివేటు అప్పులపై ఏడాదిపాటు మారటోరియం విధించాలనీ, స్కూల్ బస్సుల్లో పనిచేస్తున్న వారికి లాక్డౌన్ కాలంలో పూర్తిజీతం ఇచ్చేలా, యాజమాన్యాలకు ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. ఓలా, ఊబర్ డ్రైవర్ల నుంచి యాజమాన్యం తీసుకుంటున్న 20 శాతం కమీషన్నీ ఆపేయాలనీ, వారిని కంపెనీ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. అత్యవసర రవాణా సేవలు అందిస్తున్న సిబ్బంది కోవిడ్తో చనిపోతే రూ.50 లక్షల బీమా సౌకర్యం కల్పించాలని కోరారు. టోల్ట్యాక్స్, రోడ్ట్యాక్స్ ఎత్తేయాలనీ, ఫిట్నెస్, ఇన్సూరెన్స్ చార్జీలు తగ్గించాలనీ, అసంఘటిత రవాణారంగ కార్మికులకు సంక్షేమబోర్డ్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అద్దెబస్సు డ్రైవర్ల బకాయి వేతనాలు చెల్లించాలనీ, ఆత్మహత్యలు చేసుకున్న రవాణా కార్మికులకు రూ.10 లక్షల నష్టపరిహారం ఇవ్వాలని కోరారు. పెంచిన డీజీల్, పెట్రోల్ ధరలు తగ్గించి, జీఎస్టీ పరిధిలోకి తేవాలనీ, మోటారు వాహన చట్ట సవరణ బిల్లు 2019 వెనక్కి తీసుకోవాలనీ, కార్మిక చట్టాల సవరణను ఆపాలని డిమాండ్ చేశారు.