Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
గిరిజన సంక్షేమశాఖలో అమలుచేస్తున్న పథకాలు నిజమైన లబ్ధిదారులకు అందేలా అధికారులు పనిచేయాలని ఆశాఖ మంత్రి సత్యవతిరాథోడ్ అన్నారు. ప్రభుత్వ పథకాల అమలు, గిరిజన పాఠశాలల పున:ప్రారంభం తదితర అంశాలపై శనివారం హైదరాబాద్లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ది సంస్థ(ఎంసీహెచ్ఆర్డీ)లో సంబంధిత అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కోవిడ్ సంక్షోభం నేపథ్యంలో ఏజెన్సీలో సరైన వసతులు లేని గిరిజన విద్యార్ధుల వద్దకు వెళ్లి విద్యాబోధన చేయాలని ఇప్పటికే ఆదేశాలిచ్చినట్టు చెప్పారు. కోవిడ్ సమయంలో ఆగిపోయిన పనులను వెంటనే పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. గిరిజన గ్రామాల్లో త్రీఫేజ్ కరెంట్కోసం రూ. 117 కోట్లు కేటాయించినట్టు తెలిపారు. హైదరాబాద్, మహబూబాబాద్ జిల్లాలకు పాడి పశువులను గిరిజనులకు అందించేందుకు ఒక పైలట్ ప్రాజెక్టుగా చేపడుతున్నట్టు ఆమె తెలిపారు. ప్రతి కార్యక్రమంలో లబ్ధిదారుల మేలు లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని గుర్తు చేశారు. ఈ క్యాక్రమంలో ఐటీడీఏ, జిల్లా అభివృద్ది అధికారులు పాల్గొన్నారు.