Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నాణ్యతకు భరోసా : డాక్టర్ శృతి రాజగోపాలన్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
సోషలిస్టు వ్యవస్థతోనే నిత్యావసర వస్తువుల ధరలు నియంత్రణలో ఉంటాయనీ, ఆహార పదార్థాల నాణ్యతకు భరోసా ఉంటుందని ప్రముఖ ఆర్థికవేత్త డాక్టర్ శృతి రాజగోపాలన్ అభిప్రాయపడ్డారు. ఆలోచనాపరుల వేదిక 'మంథన్' సంవాద్ ఆధ్వర్యంలో శనివారం భారతదేశంలో పాలన - ప్రభుత్వ సామర్థ్యంపై ఆమె ఆన్లైన్ వెబినార్లో ప్రసంగించారు. ఆహారపదార్థాల అమ్మకాలను మార్కెట్కు అప్పగించిన తర్వాత దాన్ని నియంత్రించే శక్తి ప్రభుత్వం కోల్పోతుందని అన్నారు. భారతదేశంలో న్యాయం ఎండమావిగా మారిందనీ, ఎదురుగా నేరం జరిగినట్టు కనిపిస్తున్నా నేరస్తులకు శిక్ష- బాధితులకు న్యాయం జరిగేందుకు దశాబ్దాల సమయం పడుతున్నదని విమర్శించారు. ఆహారకల్తీకి సంబంధించి ఒక కేసులో ప్రేమ్చంద్ అనే వ్యక్తికి 38 ఏండ్ల తర్వాత శిక్ష పడిందని ఆమె గుర్తుచేశారు. జనాభాకు ప్రాతిపదికన న్యాయమూర్తుల పోస్టులను మంజూరు చేయడం లేదనీ, పోస్టులు కూడా చాలా వరకు భర్తీ చేయడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో కేసుల విచారణకు సుదీర్ఘకాలం పడుతున్నదని వ్యాఖ్యానించారు. 1948లో కనీస వేతనాల చట్టం వచ్చిందనీ, అయితే ఆ చట్టం అమలును తనిఖీ చేయాల్సిన అధికారులు ఇప్పటికీ సరిపడినంతగా లేరని ఆవేదన వ్యక్తం చేశారు. ఐఎల్ఓ ప్రతి 40 వేల మందికి ఒక తనిఖీ అధికారి ఉండాలనీ సిఫారసు చేస్తే 1.2 లక్షల మందికి ఒకరు మాత్రమే ఉన్నారని తెలిపారు. ప్రభుత్వ తప్పుడు విధానాల కారణంగా దేశంలో 80 శాతం మంది బలవంతంగా అసంఘటిత రంగ కార్మికులుగా మారిపోతున్నారని వివరించారు. ప్రభుత్వ విద్యావ్యవస్థను కాపాడలేకపోయారనీ, సౌకర్యాలు కల్పిస్తున్నా కీలకమైన ఉపాధ్యాయుల నియామకాలను విస్మరించారని తప్పుపట్టారు. ప్రజలకు సోషలిస్టు వ్యవస్థతోనే భద్రత ఉంటుందని వెల్లడించారు.