Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎస్ఎఫ్ఐ రౌండ్ టేబుల్లో వక్తలు
- ఖాళీలు భర్తీ చేయాలని డిమాండ్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
'ప్రయివేట్ విశ్వవిద్యాలయాలతో ఎస్సీ, ఎస్టీ, బడుగు, బలహీన వర్గాలు విద్యకు దూరమవుతారు. రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేయనున్న ప్రయివేటు వర్సిటీల్లో ఫీజు రీయింబర్స్మెంట్, రిజర్వేషన్లు కల్పించబోమని చెప్పడం ప్రభుత్వం విద్య అందించే భాద్యత నుంచి తప్పుకోవడమే అవుతుంది. ముఖ్యమంత్రి ఇప్పటికైనా మనసు మార్చుకుని ఈ బిల్లును ఉపసంహరించుకోవాలి' అని పలువురు వక్తలు అన్నారు. ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో శనివారం హైదరాబాద్లోని ఆ సంఘం రాష్ట్ర కార్యాలయంలో ప్రయివేట్ యూనివర్శీటీలు- సామాజిక న్యాయం'' అనే అంశంపై రౌండ్టేబుల్ నిర్వహించారు. ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎల్.మూర్తి అధ్యక్షత జరిగిన సమావేశంలో గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీరాంనాయక్, అవాజ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎండీ అబ్బాస్, కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.స్కైలాబ్బాబు, వ్యవసాయ కార్మికసంఘం ప్రధాన కార్యదర్శి బి.ప్రసాద్, ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.నాగరాజు, ఏఐడీఎస్ఓ నాయకులు ఆర్.గంగాధర్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ ప్రయివేటు విశ్వవిద్యాలయాల వల్ల రాష్ట్రంలో 90శాతానికి పైగా ఉన్న దళిత, గిరిజన, ఆదివాసీ, బీసీ ,మైనార్టీ విద్యార్థులను విద్యకు దూరం చేయడమేనని వ్యాఖ్యానించారు. ప్రభుత్వం కల్పించిన రాయితీలు వాడుకుంటూ పీడీత కులాలకు రిజర్వేషన్లు కల్పించడం లేదని విమర్శించారు. రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో గత ఎనిమిదేండ్లుగా ఖాళీగా ఉన్న 2000 పైగా బోధన, బోధనేతర పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. యూనివర్శీటీలకు ప్రతియేటా నిధులు తగ్గిస్తూ వాటిని నిర్వీర్యం చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. విద్యా వ్యవస్థను కార్పొరేట్లకు అప్పగించేందుకు కేసీఆర్ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు వ్యతిరేకంగా విద్యార్థులు, మేధావులు గళం విప్పాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ.రాష్ట్ర కమిటీ సభ్యులు పడాల శంకర్, సాయికిరణ్, భవాని, రిసెర్చ్స్కాలర్స్ రమేష్, నరేందర్ తదితరులు పాల్గోన్నారు.